6, అక్టోబర్ 2012, శనివారం

ప్రపంచ ఉత్తమ లిపుల్లో తెలుగు ఒకటి

ప్రపంచ ఉత్తమ లిపుల్లో తెలుగు ఒకటని, ప్రపంచంలోని అనేక ధ్వనుల్ని ఈ లిపిలో రాయవచ్చని, ప్రపంచంలోని అనేక భాషలకు లేని ఈ సదుపాయం తెలుగుభాషకు మాత్రమే వుందని మద్రాస్ విశ్వవిద్యాలయం తెలుగు శాఖాధిపతి డాక్టర్ మాడభూషి సంపత్‌కుమార్ పేర్కొన్నారు. ఆయన బ్యాంకాక్‌లోని 'ది ఇంటర్నేషనల్ ఆల్ఫబేట్ అసోసియేషన్' నిర్వహించిన రెండో ప్రపంచ లిపుల సదస్సులో పాల్గొని తెలుగు లిపిపై సమగ్రమైన పత్రాన్ని సమర్పించారు. కొరియాకు చెందిన 'ది ఇంటర్నేషనల్ ఆల్ఫబేట్ అసోసియేషన్' థాయ్‌ల్యాండ్‌లోని బ్యాంకాక్‌లో ఈ సదస్సును నిర్వహించింది. 1 నుంచి 4వ తేదీ వరకు జరిగిన ఈ సదస్సులో 33 దేశాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. భారతదేశం నుంచి తెలుగు, కన్నడం, మలయాళం, బెంగాలీ, మరాఠీ, గుజరాతి, ఉర్దూ, పంజాబీ తదితర భాషలకు చెందిన ప్రతినిధులు పాల్గొనగా, డాక్టర్ మాడభూషి సంపత్‌కుమార్ తెలుగు లిపిపై పత్ర సమర్పణ చేశారు.

తెలుగు లిపి బ్రాహ్మీలిపి నుంచి పరిణామం పొందిందని, క్రీ.పూ.400 సంవత్సరాల నుంచి తెలుగు లిపి ఉనికి స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొన్నారు. భారతదేశంలో క్రీ.పూ.3500 సంవత్సరాల నుంచి బ్రాహ్మీలిపి వుందని ఆయన పేర్కొన్నారు. బ్రాహ్మీలిపి నుంచే భారతీయ భాషలన్నీ తమ లిపిని రూపొందించుకున్నాయన్నారు. బ్రాహ్మీ, దక్షిణ బ్రాహ్మీ, శాతవాహన, ఇక్ష్వాక, పల్లవ, వేంగీ, చాళుక్య, కాకతీయ తదితర పేర్లతో తెలుగు లిపి ఆయా కాలాల్లో రూపాంతరం చెందుతూ వచ్చి తెలుగు లిపిగా స్థిరపడినట్లు ఆయన తెలుగు లిపి పరిణామాన్ని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన తెలుగు ప్రత్యేకతలను సభకు తెలియజేశారు. తెలుగు లిపి అందంగా వుండడమే కాకుండా, అనేక భాషల కన్నా ఎక్కువ ధ్వనులను రాయగలిగిన సామర్థ్యం వుందన్నారు. ఉచ్ఛారణా విధేయమైన లిపి కలిగిన భాషని ఆయన సోపపత్తికంగా నిరూపించారు.

తెలుగు భాషా పదాలు ఎక్కువ భాగం అచ్చులతో అంతమవ్వడం వల్ల భాషకు అందం వచ్చిందన్నారు. అచ్చు, హల్లు ఒకదానితో ఒకటి కలిసి ఒకే లిపి ద్వారా సూచితం కావడం వల్ల రాతలో వర్ణాల సంఖ్య తక్కువగా వుంటుందన్నారు. తెలుగు లిపి సాధారణంగా ఎడమవైపు నుంచి ప్రారంభమవుతుం దన్నారు. తెలుగు లిపిలో వర్ణాలు ఎక్కువగా కనిపించినప్పటికీ, ఒకే మాదిరిగా వున్న వర్ణాలు ఎక్కువగా వున్నందువల్ల నేర్చుకోవడం కష్టం కాదని, అదే సమయంలో ఉచ్చరించినట్లే రాసే అవకాశం వున్నందువల్ల సులభంగా నేర్చుకోవచ్చని అన్నారు. కాగా ఈ సదస్సులో సంపత్‌కుమార్ సమర్పించిన పత్రాన్ని ఉత్తమ పత్రంగా తొమ్మిదిమంది న్యాయనిర్ణేతలు, యాభైమంది పరిశీలకులు «ద్రువీకరించారు. కొరియా లిపికి మొదటి స్థానం లభించగా, తెలుగు లిపికి రెండవ స్థానం లభించడం విశేషం. ఈ సందర్భంగా సంపత్‌కుమార్ మాట్లాడుతూ... ఎన్నో భాషా మేధావులు సమర్పించిన పత్రాల్లో తెలుగుకు ద్వితీయ స్థానం రావడం సంతోషంగా వుందన్నారు.

కేసీఆర్‌ను ఇంతవరకు కలవని కోదండరాం

తెలంగాణ మార్చ్ విజయవంతమైన నేపథ్యంలో జేఏసీ చైర్మన్ కోదండరాం ఆ కార్యక్రమానికి సహకరించిన వారిని కలుస్తూ కృతజ్ఞతలు చెబుతున్నారు. కానీ, టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌ను ఇంతవరకు కలవలేదు. ఉద్యమ నేతలిద్దరూ కలవని వైనం ఇటు టీఆర్ఎస్, అటు జేఏసీ వర్గాల్ల్లో చర్చనీయాంశమైంది. కేసీఆర్ గతనెల 5న ఢిల్లీ వెళ్లారు. అంతకంటే ముందే ప్రకటించిన షెడ్యూల్ మేరకు జేఏసీ సెప్టెంబర్ 30న మార్చ్ నిర్వహించింది. కేసీఆర్ ఢిల్లీలో ఉండగానే.. ఆయన పాల్గొనకుండానే కోదండరాం ఆధ్వర్యంలో మార్చ్ విజయవంతమైంది. ఈనెల 3న కేసీఆర్ హైదరాబాద్ వచ్చారు.

మార్చ్ జయప్రదానికి సహకరించిన భాగస్వామ్య పక్షం బీజేపీతోపాటు, సంఘీభావం ప్రకటించిన సీపీఐ, తెలంగాణ నగారా సమితి నేతలను కోదండరాం బృందం రెండు రోజులుగా కలిసి కృతజ్ఞతలు చెబుతున్నారు. మిగిలిన వారిని కలిసినట్టే టీఆర్ఎస్ అధ్యక్షుడినీ కలవటానికి కోదండరాం బృందం ప్రయత్నించినట్టు సమాచారం. "కోదండరాం, ఇతర ముఖ్య నేతలందరం నివాసానికి వస్తామం''టూ జేఏసీ కన్వీనర్ కె.స్వామిగౌడ్ గు రువారం కేసీఆర్ తోడల్లుడి తనయుడు జోగిన్‌పల్లి సంతోష్‌కుమార్ ద్వా రా కేసీఆర్‌కు కబురు చేశారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. కేసీఆర్ "కలుద్దాంలే'' అని బదులిచ్చారు.

కేసీఆర్ అపాయింట్‌మెంట్ స మాచారం టీఆర్ఎస్ శిబిరం నుంచి జేఏసీకి శుక్రవారం రాత్రి వరకు అం దలేదు. మరోవైపు ఆయన మధ్యాహ్నమే మెదక్ జిల్లా ఫామ్ హౌస్‌కి వెళ్లారు. ఈమేరకు ఏం జరుగుతుందనేది ఆసక్తిగా మారింది. "కేసీఆర్‌ను కలవటానికి టైం అడిగాం. ఇంతవరకు ఇవ్వలేదు. ఆయనే కలుస్తారులే అని ఊరుకున్నాం'' అని జేఏసీ ముఖ్య నేత ఒకరు చెప్పారు. మరోవైపు కోదండరాం, కొంత మంది జేఏసీ నేతలపై టీఆర్ఎస్‌లో ఆగ్రహం చల్లారలేదనే సంకేతాలు వెలువడుతున్నాయి.

జేఏసీ చైర్మన్ పదవి నుంచి కోదండరాంను తప్పించి స్వామిగౌడ్‌ను కూర్చోబెట్టాలనే కేసీఆర్ వ్యూహం.. జేఏసీలోని మిగిలిన పక్షాల ప్రతి వ్యూహంతో బెడిసికొట్టింది. పరకాల ఉప ఎన్నికలతో వారి మధ్య వైరుధ్యాలు పరాకాష్టకు చేరుకున్నాయి. కోదండరాం, కేసీఆర్ ముఖాముఖి కలుసుకోలేని పరిస్థితి ఏర్పడింది. అనివార్య పరిస్థితుల్లో గులాబీ నేతలు తెలంగాణ మార్చ్‌కు చివరి దశలో మద్దతు ప్రకటించారు. మార్చ్‌కు జన సమీకరణ చేసిన టీఆర్ఎస్ నేతలకు వేదికపై తగిన ప్రాధాన్యం లభించకపోవటం కోపం తెప్పించింది.

హరీశ్‌రావును ఉద్దేశించి ఉద్యోగ సంఘాల నేత శ్రీనివాస్‌గౌడ్ చేసిన వ్యాఖ్యలు, కేసీఆర్ పై విమలక్క చేసిన వ్యాఖ్యలు ఆగ్రహం తెప్పించాయి. దీంతో వారు మా ర్చ్ మధ్యలోనే వెనుదిరిగారు. ఈక్రమంలో జేఏసీ భాగస్వామి అయిన న్యూడెమోక్రసీ నేతలను కేసీఆర్ గురువారం తన నివాసానికి పిలిపించుకొని మాట్లాడినప్పుడు కూడా.. కోదండరాం తీరుపై ఆగ్రహం, అసంతృప్తి వ్యక్తంచేసినట్లు చెబుతున్నారు. అయినా కోదండరాం, కేసీఆర్ రాబోయే రోజుల్లో ముఖాముఖి సమావేశమవుతారా? లేదా? కనీసం జేఏసీలోని మిగిలిన నేతలతో అయినా కలిసి వారిద్దరు భేటీ అవుతారా ? అనేది కచ్చితంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది.

5, అక్టోబర్ 2012, శుక్రవారం

జగన్‌కు జైలే

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి భారత అత్యున్నత న్యాయస్థానంలో ఎదురు దెబ్బ తగిలింది. సుప్రీం కోర్టు శుక్రవారం జగన్‌కు బెయిల్‌ను నిరాకరించింది. ఈ రోజు జగన్ బెయిల్ పిటిషన్ పైన విచారణ జరిగింది. సిబిఐ తరఫు న్యాయవాది.... దర్యాఫ్తు కొనసాగుతోందని, ఇలాంటి సమయంలో బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశముందని కోర్టుకు తెలిపారు. ఆయన ఓ రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా, ఎంపీగా ఉన్నారని, కాబట్టి సాక్ష్యులను బెదిరింపులకు గురి చేసే అవకాశముందన్నారు. బెయిల్ ఇస్తే కేసు ప్రభావితమవుతుందన్నారు. తాము నాలుగు ఛార్జీషీట్లలో మూడువేల అక్రమాస్తులను గుర్తించామని చెప్పారు. జగన్ విచారణకు సహకరిస్తే ఎప్పుడో పూర్తయ్యేదన్నారు. మారిషస్, లగ్జెంబర్గ్ తదిదర విదేశాల ద్వారా తన కంపెనీలలోకి జగన్ నిధులు మళ్లించారన్నారు. విదేశీ నిధుల ప్రభావంపై విచారించాల్సి ఉందన్నారు. జగన్ కంపెనీల్లోకి వచ్చిన కొన్ని హవాలా మనీ మార్గాలను ఛేదించామన్నారు. సిబిఐ వాదనలతో కోర్టు ఏకీభవించి, బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది.



వేల కోట్లని చెప్పి రూ.74 కోట్లకు లెక్క

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వేల కోట్లు దోచారని చెప్పి రూ.74 కోట్లకు మాత్రమే సిబిఐ లెక్క చెప్పిందని జగన్ తరఫు న్యాయవాది సుబ్రహ్మణ్యం శుక్రవారం భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో వాదించారు. ఈ రోజు జగన్ బెయిల్ పిటిషన్ పైన విచారణ ప్రారంభమైంది. జగన్ అరెస్టు అక్రమమని చెప్పారు. జగన్ నేరస్తుడు అని చెప్పడానికి సిబిఐ ఇంత వరకు ఎలాంటి ఆధారాలు చూపలేదన్నారు. అరెస్టు చేసి 130 రోజులు దాటిందని, అయినా ఇప్పటి వరకు ఒక్క ఆధారం చూపలేదు కాబట్టి బెయిల్ ఇవ్వాల్సిందేనని జగన్ తరఫు న్యాయవాది  అన్నారు. ఒక పార్టీ అధినేత  జైలులో ఉండటం సరికాదన్నారు.

పన్నులు లేని భారతదేశం

అవినీతి నిర్మూలనలో యువత కీలకపాత్ర పోషించాలని కర్ణాటక లోకాయుక్త మాజీ జస్టిస్ సంతోష్ హెగ్డే పేర్కొన్నారు. స్వాతంత్య్రం సాధించిన 65 ఏళ్లలో దేశంలో 74 కుంభకోణాలు వెలుగుచూశాయన్నారు. ప్రతి కుంభకోణం ఒక రాష్ట్ర బడ్జెట్ కంటే అధికంగానే ఉందన్నారు. స్విస్ బ్యాంక్‌లో దాచిన కోటి నాలుగులక్షల బిలియన్ల అమెరికన్ డాలర్లను భారతదేశానికి తిరిగి తీసుకురాగలిగితే 24 గంటల్లో దేశానికి ఉన్న అప్పును తీర్చేయచ్చన్నారు. పన్నులు లేని భారతదేశంగా తీర్చి దిద్దొచ్చన్నారు. కామన్‌వెల్త్ క్రీడల్లో రూ. 70వేల కోట్ల మేర అవినీతి జరిగితే ప్రశ్నించేవారే లేకపోవడం బాధాకరమన్నారు. ప్రభుత్వ పాఠశాలలను బలహీనపరిచి ప్రైవేట్‌వైపు వెళ్లే విధంగా నాయకులే ప్రోత్సహిస్తున్నారన్నారు. అన్నా హజారే బృందం అవినీతిని నిర్మూలించలేకపోయినా అవినీతి గురించి ప్రశ్నించే ఒక వేదికను అందించిందన్నారు.

దోపిడీదార్లను ఎన్నుకుంటే ప్రజాస్వామ్యానికి ముప్పు

రానున్న ఎన్నికల్లో దొంగలను ఎమ్మెల్యేలుగా, దోపిడీదార్లను ఎంపీలుగా ఎన్నుకుంటే ప్రజాస్వామ్యానికి ముప్పువాటిల్లే ప్రమాదం పొంచి ఉందన్నారు టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి కడియం శ్రీహరి . జగన్ జైలుకెళ్లి వంద రోజులు గడిస్తే ఆ పార్టీ కార్యకర్తలు శత దినోత్సవాలను జరుపుకోవడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రం కోసం పోరాటం చేస్తున్నట్లు నటిస్తున్న తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ ఎంపీలకు దమ్ముంటే సోనియాగాంధీ ఇంటి ఎదుట ధర్నా చేయాలని సవాల్ విసిరారు. లేనిపక్షంలో పదవులకు రాజీనామా చేయాలని అప్పుడే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం దానంతటదే వస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అటు రాష్ట్రంలోనూ ఇటు దేశంలోనూ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని , ప్రభుత్వంలో ప్రాంతీయ, నాయకత్వ విబేధాలు ఏర్పడి ముఖ్యమంత్రికి మంత్రుల మధ్య సఖ్యత కొరవడి ప్రజా సమస్యలను గాలికొదిలేస్తున్నారన్నారు.

ఉద్యమాన్ని అడ్డంపెట్టుకుని కేసీఆర్‌తో టీఆర్ఎస్‌ను, జగన్‌ను జైలు నుంచి తప్పించి వైఎస్ఆర్ కాంగ్రెస్‌ను విలీనం చేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించిన  కాంగ్రెస్‌  టీడీపీని బలహీనపర్చేందుకు పావులు కదుపుతోందని ఆరోపించారు.

ప్యాకేజీ కోసం కేసీఆర్ ఆరాటం:ఎర్రబెల్లి

టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు కాంగ్రెస్ పార్టీ ఇచ్చే ప్యాకేజీ కోసం ఆశపడి ఇన్ని రోజులుగా ఢిల్లీలో మకాం వేశారని టీ-టీడీపీ ఫోరం కన్వీనర్,   ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆరోపించారు.   టీఆర్ఎస్, కాంగ్రెస్ కుమ్మక్కై తెలంగాణ ప్రాంతంలో టీడీపీని రాజకీయంగా దెబ్బతీయడానికి కుట్రలు పన్నారని, తెలంగాణ కోసం కాంగ్రెస్ పార్టీతో చర్చలు జరిపానని కేసీఆర్ ప్రకటించుకోవడం తగదని విమర్శించారు.
టీఆర్ఎస్‌లో కాంగ్రెస్‌తో చర్చించే సీనియర్ నాయకులే లేరా ? కేవలం కేసీఆర్, ఆయన కుటుంబీకులు చర్చలు జరపడంలో ఆంతర్యం ఎమిటన్నారు. కాంగ్రెస్‌నేతలు తాము ఎవ్వరిని పిలువలేదని ప్రకటించినా కేసీఆర్ మాత్రం కాంగ్రెస్ నాయకులే ఆహ్వానించారని ప్రకటించుకోవడం సిగ్గుచేటన్నారు.  కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వదలచుకుంటే సీమాంధ్ర, రాయలసీమ నాయకులతో చర్చలు జరపాలి, కానీ కేసీఆర్‌తో చర్చలు జరుపడంలో రహస్యం ఏమిటన్నారు. గతంలో సకల జనుల సమ్మె   నీరు గార్చడానికి కేసీఆర్ కాంగ్రెస్ పార్టీతో రూ.500కోట్ల ఒప్పందం కుదుర్చుకొన్నారని ,  తెలంగాణ మార్చ్‌ను నీరుగార్చడానికి యత్నించాడని ఎర్రబెల్లి ఆరోపించారు.  మార్చ్‌కు సంఘీభావం తెలిపినట్లుగా నటించి ఆ పార్టీ నాయకులు మధ్యలోనే వెళ్లిపోయారన్నారు.
పరకాల ఉప ఎన్నిక సమయంలో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తే మూడు నెలల్లో తెలంగాణ ఏర్పడుతుందని కే సీఆర్, హరీష్‌రావు ప్రకటించి ఓట్లు దండుకున్నారని నేడు తెలంగాణ ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించారు. 

3, అక్టోబర్ 2012, బుధవారం

తెలంగాణ భవన్‌లో టి.వి. ఛానలా ?

తెలంగాణ భవన్‌లో వాణిజ్య కార్యకలాపాలు జరుగుతుంటే ఏం చర్యలు తీసుకున్నారని హై కోర్టు బుధవారంనాడు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. రాజకీయ పార్టీకి కేటాయించిన భూమిలో ఒక టి.వి. ఛానల్ పెట్టి వాణిజ్య అవసరాలకు వినియోగించుకుంటున్నారని కాంగ్రెస్ నాయకుడు ఉమేశ్ రావు ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదును ఎందుకు స్వీకరించలేదని కూడా కోర్టు ప్రశ్నించింది.

1, అక్టోబర్ 2012, సోమవారం

రేపు పార్టీని ప్రకటించనున్న కేజ్రీవాల్


రాజకీయ పార్టీ ఏర్పాటు ప్రకటన చేయడం ద్వారా మంగళవారం రోజు ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించనున్నట్లు అరవింద్ కేజ్రీవాల్ చెప్పారు. కాన్టిట్యూషనల్ క్లబ్‌లో ఏర్పాటు చేసే సమావేశంలో పార్టీ ఏర్పాటు ప్రకటనను మనీష్ సిసోడియాతో కలిసి కేజ్రీవాల్ ప్రకటించనున్నారు. జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని పార్టీ ప్రకటన, విధివిధానాలను రేపు ప్రకటిస్తామని చెప్పారు. తనకు హజారేతో ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు.

కేజ్రీవాల్ పార్టీకి ప్రచారం: హజారే

అరవింద్ కేజ్రీవాల్ పార్టీ పెడితే ఆయన పార్టీకి మద్దతుగా తాను ప్రచారం నిర్వహిస్తాననిప్రముఖ సామాజిక సంఘ సంస్కర్త అన్నా హజారే సోమవారం ప్రకటించారు. అవినీతిరహిత పార్టీగా అది ఉంటుందని,. ఆ పార్టీకి ప్రచారం చేసినప్పటికీ తాను ఎప్పటికీ ఎన్నికలలో పోటీ మాత్రం చేయనని, అవినీతికి వ్యతిరేకంగా పోరాటమే తన ఉద్దేశ్యమన్నారు. అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని బలోపేతం చేస్తామని చెప్పారు.

అరవింద్ కేజ్రీవాల్‌తో, తన బృందంలో కూడా తనకు ఎవరితోనూ విభేదాలు లేవని  అందరం కలిసి అవినీతిపై ఉద్యమిస్తున్నామన్నారు. తాను ఇప్పటి వరకు 70 మంది బ్యూరోక్రాట్లతో చర్చించానని, పలువురు మాజీ ఆర్మీ అధికారులను కలిశానని,నవంబరులో దేశవ్యాప్తంగా పర్యటిస్తానని హజారే చెప్పారు.