30, జూన్ 2011, గురువారం

తిరువనంతపురం: శ్రీపద్మనాభస్వామి దేవాలయంలో వందల కోట్ల విలువ చేసే అపార సంపద

తిరువనంతపురం: శ్రీపద్మనాభస్వామి కొలువైన తిరువనంతపురంలోని దేవాలయంలో వందల కోట్ల విలువ చేసే అపార సంపద బయటపడింది. ఆలయంలోని నేలమాళిగలో దాచిన అమూల్య వస్తువులను గుర్తించే క్రమంలో ఇవి వెలుగు చూశాయి. వేయి పడగల ఆదిశేషుడిపై కొలువైన అనంత పద్మనాభస్వామి దేవాలయాన్ని పారదర్శకంగా నిర్వహించేలా ఆదేశించాలని కోరుతూ సుప్రీంలో ప్రైవేట్ పిటిషన్ దాఖలైంది. ఈ నేపథ్యంలో నేలమాళిగలో దాచిన సంపద జాబితాను రూపొందించేందుకు సుప్రీంకోర్టు ఇటీవలే ఏడుగురు సభ్యులతో కూడిన కమిటీని నియమించింది. విశాలమైన దేవాలయం నేలమాళిగలోని ఆరు గదులకుగానూ మూడిటిలో వస్తువుల పరిశీలన మంగళవారం రాత్రి పూర్తయింది.

సువర్ణ ఆభరణాలు, పాత్రలు, నగలు, వెలకట్టలేని రత్నాలు లభ్యమయ్యా యి. వీటి విలువ సుమారు రూ. 700 కోట్లకు పైగా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. బంగారు గొలుసులు, రత్నఖచిత కిరీటం, బంగారు ఛత్రం, భారీ మొత్తంలో వెండి, అమూల్య సంపద ఉన్నట్లు పరిశీలనలో తేలిందని ఆలయ వర్గాలు తెలిపాయి. ట్రావెన్‌కోర్ మహారాజా మార్తాండవర్మ 18వ శతాబ్దంలో దేవాలయాన్ని పునర్‌నిర్మించారు. ప్రస్తుతం రాజకుటుంబ అధీనంలోని ట్రస్టు పద్మనాభ దేవాలయాన్ని నిర్వహిస్తోంది. తొలిరోజు బయటపడిన సంపద విలువ ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం రూ.700 కోట్లకు పైమాటేనని ఆలయ వర్గాలు పేర్కొన్నాయి. అయితే సంపద విలువను లెక్కించటం తమ పని కాదని కమిటీ స్పష్టం చేసింది.