16, ఫిబ్రవరి 2011, బుధవారం

చిరంజీవిని విమర్శించే నైతిక హక్కు అంబటికి లేదు

ప్రజాధనాన్ని కొల్లగొట్టి దోచుకున్న అంబటి రాంబాబు ఎంత ? చిరంజీవి ఎంత ? కోట్ల ప్రజాభిమానమున్న మచ్చలేని చిరంజీవి గురించి ఆయన విమర్శించడమేమిటంటూ ప్రజారాజ్యం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సి.రామచంద్రయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప జిల్లా రాజంపేటలో బుధవారం జరిగిన ప్రజారాజ్యం పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒకరి మోచేతుల కింద నీరు తాగే అంబటి రాంబాబు పేపర్లలో పేర్లు వేయించుకోవడానికి, పాపులారిటీ కావడానికి చిరంజీవిని విమర్శిస్తున్నారన్నారు.

తండ్రి శవాన్ని పక్కనపెట్టి ముఖ్యమంత్రి పదవి కోసం 20 మంది ఎమ్మెల్యేలను చిరంజీవి వద్దకు పంపిన జగన్ వర్గంలోని అంబటికి చిరంజీవిని విమర్శించే నైతిక హక్కులేదన్నారు. వైఎస్ ఉన్ననాడు చిరంజీవి మద్దతు కోరడం తప్పు కానప్పుడు ఇప్పుడు ఎలా తప్పవుతుందని నిలదీశారు..

నాకొద్దీ....అధికారం: రఘువీరా

రెవెన్యూశాఖలో అత్యంత కీలకమైన అధికారం అది. ఎంతటి లిటిగేషన్ భూమిపైనైనా నిర్ణయం తీసుకునే అధికారం రెవెన్యూ మంత్రికి ఉంటుంది. భూములపై ఫిర్యాదులు వచ్చినప్పుడు....అంతిమ నిర్ణయం తీసుకునే అధికారం మంత్రికి బిజినెస్ రూల్ 22 కింద ప్రభుత్వం కట్టబెట్టింది. దీన్ని అడ్డంపెట్టుకొని అయినవారికి ఆకుల్లో...కాని వారికి....అన్న చందంగా తీర్పులు చెప్పవచ్చు. అయితే ఇంతటి అధికారం తనకొద్దని రెవెన్యూ మంత్రి ఎన్. రఘువీరారెడ్డి ముందుకొచ్చారు. రెవెన్యూకోర్టు నిర్వహించే అధికారాన్ని రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శికి అప్పగించాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు.

భూ వివాదాలు తన దృష్టికి వచ్చినప్పుడు ఏవరో ఒకరికి ఆయాచితంగా మేలు చేశారన్న అపకీర్తిని, ఒకరికి మంచిచేసి మరొకరికి చేడుచేశామన్న అపవాదు తనకు అంటకూడదనే ఈ అధికారానికి మంత్రి దూరంగా ఉన్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.