19, ఫిబ్రవరి 2011, శనివారం

22, 23 తేదీలలో తెలంగాణా బంద్‌

ఈ నెల 22, 23 తేదీలలో బంద్‌కు తెలంగాణా రాజకీయ ఐకాస పిలుపు ఇచ్చింది. సహాయ నిరాకరణలో భాగంగా ప్రజల్ని చైతన్యవంతం చేసేందుకు ఐకాస తీసుకున్న నిర్ణయం మేరకు ఈ బంద్‌ నిర్వహిస్తున్నట్లు ఐకాస కన్వినర్‌ ఏ కోదండరామ్‌ శనివారం ప్రకటించారు.

ఆ రెండు రోజులు తెలంగాణా ప్రజలంతా ఎలాంటి రాక పోకలు సాగించ కుండా... రోడ్లపైనా, రహదారులపైనా బైటాయింపులు జరపాలని.. రైల్‌ రోకోలు నిర్వహించి రైల్ల రాకపోకల్ని కూడా అడ్డు కోవాలని కోదండరామ్‌ సూచించారు.

మరో సెంచరీతో భారత్‌ మెరుపులు

మీర్పూర్‌: మీర్పూర్‌లో ప్రారంభమైన ప్రపంచ కప్‌లో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న పోరులో మరో సెంచరీని భారత జట్టు సాధించింది. ఇప్పటికే ఈ ప్రపంచకప్‌లో తొలి సెంచరీ సాధించిన క్రీడాకారుడిగా భారత డాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ పేరు నమోదు చేసుకోగా.. రెండో సెంచరీని వి.కోహ్లీ సాధించాడు. కొహ్లీకి ఇది వన్డేల్లో ఐదో సెంచరీ.

ప్రపంచ కప్‌-2011లో సెహ్వాగ్‌ తొలి శతకం

మీర్పూర్‌లో ప్రారంభమైన ప్రపంచ కప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌లో జరుగుతున్న భారత డాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ సెంచరీ సాధించాడు. ప్రస్తుతం 2011లో ప్రారంభమైన ఈ ప్రపంచకప్‌లో తొలి సెంచరీ సాధించిన క్రీడాకారుడిగా పేరు నమోదు చేసుకున్నాడు. కేవలం 94 బంతుల్లోనే ఒక సిక్సర్‌తోపాటు, 9 ఫోర్లు సాధించిన సెహ్వాగ్‌కు వ్యక్తిగతంగా వన్డేలలో ఇది 14వ సెంచరీ.

కొందరిని ప్రమోట్ చేయడానికే సర్వేలు : డి శ్రీనివాస్

కొందరిని రాజకీయంగా ప్రమోట్ చేయడానికే సర్వేలు చేస్తున్నారన్నారు. సర్వేలకు ఇది సమయం కూడా కాదన్నారు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డి శ్రీనివాస్. శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఎన్నికలకు ఇంకా మూడేళ్లు గడువున్నా..ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలు లేకున్నా.. సర్వే నిర్వహించాల్సిన ఆవశ్యకత .. ఎందుకొచ్చిందో? ఆ ఛానల్‌కి, ఏజన్సీకే తెలియాలి అని ఎద్దేవాచేసారు... ఎవరెందుకోసం పాట్లు పడుతున్నారో? ప్రజలు చూస్తున్నారని.. తగిన సమయంలో నిర్ణయం తీసుకోగల విజ్ఞత వారికి ఉందని వాఖ్యానించారు.

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు మహాత్మాగాంధీ పద్ధతిలో పోరాడుతామని చెప్పారని .. అయితే ఇప్పుడు అసెంబ్లీ ఘటన ఆయనకు గాంధేయవాదంలా కనిపిస్తుందా అని ప్రశ్నించారు. లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణపై, గవర్నర్ నరసింహన్ చేతిలోని ప్రతులు చించివేయడం వంటి చర్యలు సిగ్గు పడేలా ఉన్నాయన్నాని.. కొందరు తెలంగాణ పేరుతో హింసకు పాల్పడుతూ తెలంగాణ ప్రజల పరువు తీశారన్నారు. ఒక సాధారణ డ్రైవర్ ఓ ఎమ్మెల్యేపై దాడి చేయడం దారణమని... అభీష్టం నెరవేరకుంటే అందరూ నిరసనలు చేయవచ్చని... అయితే ఆ నిరసనలకు హద్దు ఉంటుందని అన్నారు.

తెలంగాణ కోసం అంటూ ఇక్కడ ఉద్యమాలు చేస్తే సరిపోదని..కేంద్రం స్థాయిలో ఒత్తిడి తీసుకు రావాలన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు వెళ్లినట్టు అందరూ ఢిల్లీ వెళ్లి ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌లపై ఒత్తిడి తీసుకు రావాలని సూచించారు.

ఏ క్షణంలోనైనా రాష్ట్రపతి పాలన : నల్లపురెడ్డి

నెల్లూరు : రాబోయే ఎన్నికల్లో యువనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీకి 222 సీట్లు రావటం ఖాయమని ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారు. శనివారం ఆయన మీడియాతో ఏ క్షణంలోనైనా ప్రభుత్వం పడిపోతుందని రాష్ట్రపతి పాలన వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని అన్నారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడితే.. సంక్షేమ పథకాలు కొనసాగించకపోతే .. సర్కార్ కుప్పకూలుతుందన్నారు.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై వివాదం

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై వివాదం చెలరేగుతోందని తెలుస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా నల్గొండ జిల్లాకు చెందిన శివకుమార్ అనే వ్యక్తి పేరిట ఉంది. జగన్‌ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం నుండి ఇంకా అనుమతి రానందున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరుతో పోటీ చేయడానికి శివకుమార్‌తో చర్చలు జరిపిన విషయం తెలిసిందే. అయితే శివకుమార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తనదిగా చెప్పుకోవడాన్ని కడప జిల్లాకు చెందిన షేక్ మహబూబ్ బాషా ఖండిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరుకు సంబంధించి తాము ఇప్పటికే కోర్టులో దావా వేశామని చెప్పారు.

జగన్‌కు టిఆర్ఎస్ మద్దతు

ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఓ టీవి ఛానల్‌లో వచ్చినంత ఘనంగా కాకపోయినప్పటికీ ఇటు తెలంగాణలో ఉద్యమం తీవ్రత దృష్ట్యా, అటు సీమాంధ్రలో భావోద్వేగాల దృష్ట్యా టిఆర్ఎస్, జగన్ పార్టీ ఎంతో కొంత లాభ పడనున్న నేపథ్యంలో ఇద్దరు లోపాయికారి ఒప్పందంతో ముందుకు సాగుతున్నట్లు భావిస్తున్నారు.

ఎన్నికలు వస్తే ఇరువురు లాభపడే పరిస్థితి కనిపిస్తున్నందునే వారు కలిసి ముందుకు సాగుతున్నట్టుగా ..
వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీక్షకు తెలంగాణ రాష్ట్ర సమితి మద్దతు తెలుపుతున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో ప్రాంతంలో ఏ మాత్రం పట్టులేని జగన్‌కు టిఆర్ఎస్ మద్దతు ఇచ్చి ఫీజు పోరును విజయవంతం చేయాలని .. హైదరాబాద్‌లోని ఇందిరా పార్కు వద్ద జగన్ ప్రారంభించిన దీక్షకు టిఆర్ఎస్ అనుబంధ విభాగం.. టిఆర్ఎస్‌వి సమీకరించే బాధ్యత తీసుకున్నట్టుగా సమాచారం.

ట్యాంక్‌బండ్ వద్ద లోక్‌సత్తా మానవహారం

లోక్‌సత్తా అధ్యక్షుడు, కూకట్‌పల్లి శాసనసభ్యుడు జయప్రకాశ్ నారాయణపై తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన ఎమ్మెల్యేలు అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద దాడి చేయడాన్ని నిరసిస్తూ లోక్‌సత్తా పార్టీ ఆధ్వర్యంలో ఆ పార్టీ కార్యకర్తలు హుస్సేన్‌సాగర్ ట్యాంక్‌బండ్ వద్ద మానవహారం చేపట్టారు. జెపిపై దాడిని వారు తీవ్రంగా ఖండించారు. రాజకీయాల్లో విలువల కోసం పోరాడుతున్న జెపిపై దాడిని ప్రజాస్వామ్యం దాడిగా వారు అభివర్ణించారు. ఇలాంటి దాడులు ప్రజాస్వామ్యంలో కూడదన్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కావద్దని వారు కోరారు.

నోములపై కోడిగుడ్లతో దాడి

నల్గొండ : సీపీఎం నేత నోముల నర్సింహయ్యపై శనివారం తెలంగాణవాదులు కోడిగుడ్లతో దాడి చేశారు. నల్గొండ జిల్లా భువనగిరిలో దళిత సమస్యలపై పోరాటం చేస్తున్న ఆయనపై ఈ దాడి జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణవాదులకు, సీపీఎం కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. తోపులాటలో పదిమంది గాయపడ్డారు. ఈ దాడిని సీపీఎం నేతలు తీవ్రంగా ఖండించారు.

బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వనం ఝాన్సీ రోడ్డు ప్రమాదంలో మృతి

హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వనం ఝాన్సీ శనివారం ఉదయం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. మహబూబ్‌నగర్ జిల్లా ఆమనగల్ మండలం కడ్తాల్ సమీపంలో ఆమె ప్రయాణిస్తున వాహనాన్ని మరో వాహనం ఢీకొనటంతో ఈ ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడిన ఝాన్సీని చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందినట్లు సమాచారం. సంతోష్‌నగర్‌లోని డీఆర్‌డీవో అపోలో ఆస్పత్రి వైద్యులు ఝాన్సీ మరణించినట్లు నిర్థారించారు. కాగా ఝాన్సీ మృతితో బీజేపీ వర్గాలు దిగ్బ్రాంతి చెందాయి.