23, జూన్ 2011, గురువారం

ట్రస్టు వ్యవహారాలపై జీర్ణించుకోలేక పోతున్న భక్తులు

భగవాన్ శ్రీసత్యసాయిబాబా శివైక్యం చెందడంతో రేగిన కలకలం క్రమేణా సర్దుకుంటోందని, అయితే ట్రస్టు సభ్యులు నిజాల్ని బహిర్గతపరచాల్సి ఉందని సత్యసాయిబాబా ప్రసంగ అనువాదకుడు ప్రొఫెసర్ అనిల్‌కుమార్ పేర్కొన్నారు. సాయిభక్తులకు ట్రస్టుతో సంబంధం లేదని, తిరుపతి తరహాలో బాబా దర్శనానికి వచ్చేవారన్నారు. అయితే భక్తులు సందిగ్ధ స్థితిలో ఉన్నారని, నిజాల్ని తెలుసుకోవాలని ఆరాటపడుతున్నారన్నారు. పలువురు తనకు ఫోన్ ద్వారా ఈ వి షయాన్ని తెలుపుతున్నారన్నారు. కొందరు భక్తులు ట్రస్టు వ్యవహారాలపై జీర్ణించుకోలేక పోతున్నారని, అయితే బాబాపై ఏమాత్రం నమ్మకం తగ్గలేదన్నారు. ట్రస్టు సభ్యులు సమష్టిగా, సమైక్యంగా నిజాలను తెలియజేయాల్సి ఉందన్నారు.

సాయి ట్రస్టు అక్రమాలపై తాత్సారం

సత్యసాయి సెంట్రల్ ట్రస్టు అక్రమాలపై సమగ్ర విచారణ చేపట్టే విషయంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు. కొడికొండచెక్‌పోస్టు వద్ద నగదు తరలిస్తూ దోషులు పట్టుబడినప్పటికీ వారి వెనుక ఉన్న వారి నిజానిజాలను వెలికితీయడంలో ఎందుకు తాత్సారం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన లేదన్నారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి ఈ అక్రమాలను అరికట్టాలని ఆయన డిమాండ్ చేశారు. భక్తుల అనుమానాలను నివృత్తి చేయాలన్నారు.

మంత్రులు ఆస్తుల వివరాలు వెల్లడించాలి

రాష్ట్ర మంత్రులు తమ ఆస్తుల వివరాలను ఆగస్టు నెలాఖరులోగా వెల్లడించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి గురువారం ఆదేశించారు. ఈ విషయమై ప్రాథమిక, వయోజన విద్య శాఖ మంత్రి సాకే శైలజానాథ్ మీడియాతో మాట్లాడుతూ మంత్రులు ఆస్తుల జాబితాను వెల్లడించాలని సీఎం సర్క్యూలర్ జారీ చేసిన విషయం వాస్తవమేనని అన్నారు.

తన ఆస్తి వివరాలను జూలై 15వ తేదీ లోపల వెల్లడిస్తానని చెప్పారు. ఇందులో పెద్ద విశేషం ఏమీలేదని, మంత్రులు ఎవరెవరు ఎంత సంపాదించారు, లేక ఎంత పోగొట్టుకున్నారు అన్న విషయాన్ని వెల్లడిస్తే సరిపోతుందని మంత్రి పేర్కొన్నారు.

జూలై 2 లేదా 9 వ తేదీలలో మంత్రి వర్గ విస్తరణ?

హస్తిన రాజకీయం వేడెక్కుతోంది. కేంద్ర మంత్రి వర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. జూలై 2 లేదా 9 వ తేదీలలో మంత్రి వర్గ విస్తరణ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. తిరుపతి ఎమ్మెల్యే, ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి కి కేంద్ర సహాయ మంత్రి పదవి దక్కే అవకాశాలు పుష్కలంగా వున్నాయి. అలాగే కేంద్ర మంత్రి పదవి కోసం పట్టుబడుతున్న బలమైన సామాజిక వర్గానికి చెందిన గుంటూరు ఎంపి రాయపాటి సాంబశివ రావుకు తిరుమల, తిరుపతి దేవస్థానం బోర్డు ఛైర్మన్‌ పదవి ఖరారైనట్లు విశ్వసనీయ సమాచారం. కేంద్ర మంత్రి వర్గ విస్తరణ అనంతరం కేంద్ర సహాయ మంత్రి హోదాలో ప్రజా రాజ్యం పార్టీని, చిరంజీవి కాంగ్రెస్‌ పార్టీలో విలీనం చేసేందుకు జూలై 15 న మూహూర్త నిర్ణయించనున్నట్లు తెలుస్తోంది. మంత్రి వర్గ విస్తరణ పూర్తయిన వెంటనే తిరుపతి నియోజక వర్గ శాసన సభ సభ్యత్వానికి చిరంజీవి రాజీనామా చేయనున్నారు. దీంతో తిరుపతి శాసన సభ నియోజకవర్గానికి సె ప్టెంబర్‌ ఆఖరులో గానీ, అక్టోబర్‌ మాసంలో గానీ ఉప ఎన్నికలు జరిగే అవకాశాలు వున్నాయి. ఇదిలా వుండగా జిల్లా కాంగ్రెస్‌ లో సియం కు వ్యతిరేకంగా రెబల్‌ వర్గం బలం పుంజుకుంటోంది. రాష్ట్ర పిసిసి అధ్యక్షుడిగా సియం అనుకూల శత్రువుగా పేరుపడ్డ బొత్స సత్య నారాయణ నియమితులు కావడం, జిల్లాలో సియంపై మీసం మెలేస్తున్న మాజీ మంత్రి పుంగనూరు శాసన సభ్యులు పెద్ది రెడ్డికి, బొత్సకు మధ్య సత్సంబందాలు కలిగివుండడం, మరో వైపు చిరంజీవి, బొత్సకు వున్న సమన్వయంతో చిరు ఇటీవల పెద్ది రెడ్డిని కలవడంతో జిల్లాలో సియం ప్రాబల్యాన్ని తగ్గించేందుకు కుట్ర జరుగుతోందని, సియం ను ఉక్కిరి బిక్కిరి చేసేందుకు మొదట జిల్లానే ప్రధాన వేదికగా చేసుకుంటున్నారనే విశ్లేషణ రాజకీయ మేధావుల నుండి బలంగా వినిపిస్తోంది. ఇప్పటికే జిల్లా కాంగ్రెస్‌ లో బలమైన రెబల్‌ వర్గం నాయకుడిగా పేరు పడ్డ పెద్దిరెడ్డి ఇటీవల కాంగ్రెస్‌ అధిష్టానం జోక్యంతో కాస్తా వెనక్కు తగ్గట్లు కనిపించినా, ఓ వైపు పార్టీ రాగం ఆలపిస్తూనే మరో వైపు సియం పై కత్తి నూరుతూ, అందివస్తున్న అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకునేందుకు ఇదే సరైన తరుణంగా భావిస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో సియం కిరణ్‌ జట్టు నుండి పూతలపట్టు ఎమ్మెల్యే రవి వేరుపడగా, పెద్ది రెడ్డి, కుతూహలమ్మ, షాజహాన్‌ బాషలు తటస్థంగా వుంటూ, కిరణ్‌ ను వ్యతిరేకిస్తున్నారు.వీరందరూ కూడా సమయం చూసి ఫిరాయించడమా లేక, పార్టీలో వుంటూ తమ పంతం నెగ్గించుకోవడమో చేస్తారనే అభిప్రాయమూ కూడా లేకపోలేదు. ఇదిలా వుండగా చిరంజీవికి కేంద్ర మంత్రి వర్గంలో చోటు లభించే అవకాశాలు పుష్కలంగా వున్న నేపథ్యంలో తిరుపతి స్థానానికి ఇటు పెద్ది రెడ్డి , అటు బొత్స సత్యనారాయణకు అనుకూలురుగా మెలుగుతున్న మాజీ ఎమ్మెల్యే వెంకట రమణకు ఉప ఎన్నికలో టిక్కెట్టు ఇప్పించి గెలిపించుకోవాలని, దీంతో జిల్లాలో సియంకు వ్యతిరేకంగా పూర్తి స్థాయి బలాన్ని సొంతం చేసుకుని, తద్వారా కాంగ్రెస్‌ అధిష్టానానికి తన సత్తా ఏమిటో చాటాలని పెద్ది రెడ్డి వ్యూహం రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ముందు జాగ్రత్తగా ఇప్పటికే పె ద్ది రెడ్డి, పిసిసి ఛీప్‌ బొత్స తో చర్చించినట్లు సమాచారం. తిరుపతికి ఉప ఎన్నికలు తథ్యమైన నేపథ్యంలో ఈ స్థానంలో విజయావకాశాలు కాంగ్రెస్‌ పార్టీకే అధికంగా కనిపిస్తున్నాయి. తిరుపతి నియోజకవర్గంలో కాంగ్రెస్‌, వై.యస్‌ .ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీల మధ్యే ప్రధాన పోటీ నెలకొనే అవకాశాలు కనిపిస్తుండగా, ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం తృతీయ స్థానాని కి పరిమితమయ్యే అవకాశాం వుంది. కాంగ్రెస్‌ పార్టీకి బలమైన ఓటు బ్యాంకు కలిగిన వెంకటరమణ రూపంలో సమర్థ వంతమైన అభ్యర్థి వుండడం, మరో వైపు వై.యస్‌.ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో అక్కడ టిటిడి మాజీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డిని కాదని, తుడా మాజీ ఛైర్మన్‌ చెవిరెడ్డి బాస్కర్‌ రెడ్డికే పోటీ చేసే అవకాశం కలుగనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా వుండగా తెలుగుదేశం పార్టీకి ఇప్పటి వరకూ సరైన అభ్యర్థి తిరుపతి నియోజకవర్గంలో కరువయ్యారు. స్థానిక అభ్యర్థుల నెవరినైనా పోటీ చేయిస్తారా, లేక నియోజక వర్గం వెలుపల నుండి అరువుతెచ్చిన అభ్యర్థిని ఎన్నికల్లో పోటీ చేయిస్తారా అనే సంశయం ఇంకా జిల్లా టీడీపిని వీడడం లేదు. ఇప్పుటికే పెద్దిరెడ్డికి రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారాల ఇన్‌ చార్జ్‌ గులాం నబీ ఆజాద్‌ నుండి స్పష్టమైన హామీ రావడంతో ముందు ముందు, రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణలోను, అలాగే జిల్లాలోని నామినేటెడ్‌ పోస్టుల భర్తీలోను పెద్దిరె డ్డి వర్గాని కి పెద్ద పీట వేయనున్నారని ఆయన అనుచరులు ధీమాగా వున్నారు. మారు తున్న రాజకీయ సమీకరణాలు, వ్యూహాలు పరిశీలిస్తే తిరుపతి నియోజకవర్గంలో ఉప ఎన్నికలు జరిగి, అక్కడ కాంగ్రెస్‌ గెలిచిన నేపథ్యంలో పెద్ది రెడ్డి వర్గంలో మరో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే చేరే అవకాశం కనిపిస్తోంది. దీంతో పాటూ ఇటు పెద్ది రెడ్డి వర్గం కూడా జిల్లాలో బలం పుంజుకుని, అటు పిసిసి ఛీఫ్‌ బొత్స, ఇటు చిరంజీవి అండదండలతో జిల్లాలో పెద్ది రెడ్డి వర్గం రాష్ట్ర ముఖ్యమంత్రిని మరింతగా ఇబ్బంది పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ త్వరలో జరుగునున్న కేంద్ర మంత్రి వర్గ విస్తరణతో జిల్లా రాజకీయం విశ్లేషకులకు సైతం అందని అనూహ్య మార్పులు సంభవించడం ఖాయంగా తెలుస్తోంది.

కడపలో రూ. 10 లక్షల ఆభరణాల చోరీ

నగల దుకాణం యజమానిపై మత్తుమందు చల్లి 10 లక్షల రూపాయల విలువ చేసే ఆభరణాలను ఎత్తుకెళ్లిన సంఘటన కడపలోని బీకేఎంలో వీధిలో గురువారం రాత్రి జరిగింది. ముగ్గురు దుండగులు ఈ దొంగతానికి పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇంటిగ్రేటెడ్ కోర్సుల ప్రవేశానికి ఈనెల 30న నోటిఫికేషన్

రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ నాలెడ్జ్ టెక్నాలజీస్ యూనివర్సిటీలో ఇంటిగ్రేటెడ్ కోర్సుల ప్రవేశాన్ని పునరుద్ధరించామని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆర్.వి.రాజాకుమార్ తెలిపారు.

గచ్చిబౌలిలోని ఐఐఐటీ ఆవరణలో గల యూనివర్సిటీ కార్యాలయంలో గురువారం ఆయన విలేఖరుల సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ ప్రవేశాల్లోని రిజర్వేషన్ల విధానాలపై కొందరు న్యాయస్థానాలను ఆశ్రయించగా తాత్కాలికంగా ప్రవేశాలను నిలిపివేశామన్నారు.

అయితే న్యాయస్థానం ప్రభుత్వ ఆదేశాలకు లోబడి, ఈ ప్రవేశాలకు సంబంధించిన దరఖాస్తులను ఆహ్వానిస్తూ ఈనెల 30న నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నామని ఆయన తెలిపారు.

రాహుల్‌ను ప్రధాని కానివ్వను

ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి కాలేడని జనతా పార్టీ అధ్యక్షుడు సుబ్రమణ్య స్వామి వ్యాఖ్యానించారు. ఒకవేళ ఆ ప్రయత్నం జరిగినా అడ్డుకుని తీరుతానని బుధవారం చెన్నైలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ పేర్కొన్నారు. అయితే అందుకుగల కారణాలను మాత్రం ఆయన వెల్లడించలేదు.

మరో నిత్య పెళ్లికొడుకు?

విజయనగరం జిల్లా నెల్లిమర్లకు చెందిన సురేష్‌ అనే యువకుడు అక్కడే హోమ్‌గార్డుగా పనిచేసేవాడు. అక్కడి నుంచి అతను భోగాపురానికి ఉద్యోగ రీత్యా వెళ్లాడు. భోగాపురంలోని గీత అనే అమ్మాయిని ప్రేమించాడు. పెళ్లి కూడా చేసుకున్నాడు. రెండు నెలల పసిబిడ్డ కూడా ఉంది. ఆ తర్వాత సురేష్‌కి ఎపిఎస్పీలో ఉద్యోగం వచ్చింది. శిక్షణ నిమిత్తం వరంగల్‌ వెళ్లాడు. శిక్షణ పూర్తయ్యాక తిరిగి విజయనగరంలోని ఎపిఎస్‌పికి వచ్చాడు. బంధువులు సంబంధం చూడటం మొదలుపెట్టారు. గంట్యాడ మండలం నరవ గ్రామంలో ఒక సంబంధం కుదిరింది. కావ్యశ్రీ అనే యువతితో సంబంధం నిశ్చయమైంది. తల్లిలేని కావ్యశ్రీ తన అమ్మమ్మ సత్యవతమ్మ దగ్గర ఉంటోంది. ఉద్యోగస్తుడు కాబట్టి లక్షల రూపాయల కట్నంతో పాటూ మూడు తులాల బంగారం, అర ఎకరా పొలం ఇచ్చేందుకు అంగీకారం కుదిరింది. ఈ మేరకు ఈ నెల 24న కావ్యశ్రీ, సురేష్‌ల వివాహం అన్నవరంలో జరగాల్సింది. ఈ క్రమంలోనే శుభలేఖలు అచ్చువేయించారు. కావ్యశ్రీ బంధువులు శుభలేఖ ఇచ్చేందుకు భోగాపురం లోని బంధువులు ఇంటికి వెళ్లారు. కావ్యశ్రీ బంధువులు శుభలేఖలో ఉన్న సురేష్‌ ఫోటో చూసి నివ్వెరపోయారు. ఇప్పటికే ఇతనికి వివాహమైందని కావ్యశ్రీ బంధువులకు చెప్పారు. విషయాన్ని స్పష్టంగా తెలుసుకునేందుకు కావ్యశ్రీ బంధువులు భోగాపురంలోనే ఉన్న గీత దగ్గరకు వెళ్లి నిర్ధారించుకున్నారు. దీంతో షాక్‌ కు గురైన కావ్యశ్రీ బంధువులు వెనుదిరిగి వచ్చేశారు. అయితే ఈనెల 21న మంగళవారం సురేష్‌ తల్లిదండ్రులు నరవ లోని కావ్యశ్రీ ఇంటికి భోజనాలకు వచ్చారు. సహజంగానే కావ్యశ్రీ బంధువులు సురేష్‌ తల్లిదండ్రులను నిలదీశారు. సురేష్‌కు పెళ్లయిన విషయం ఇంతకుముందే ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. అయితే ఈ విషయమై తమ కుమారుడు చెబుతాడని, సురేష్‌ తల్లిదండ్రులు చెప్పడంతో సంతృప్తి చెందని కావ్యశ్రీ బంధువులు సురేష్‌ తల్లిదండ్రులను ఒక గదిలో పెట్టి నిర్భందించారు. వెంటనే సురేష్‌ రంగంలోకి దిగాడు. గంట్యాడ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. కావ్యశ్రీ బంధువులు నిర్భందించిన తన తల్లిదండ్రులను కోరాడు. పోలీసులు కూడా రంగ ప్రవేశం చేసి ఎట్టకేలకు సురేష్‌ తల్లిదండ్రులను విడిపించారు. తర్వాత వ్యవహారం మొదలైంది. సురేష్‌, కావ్యశ్రీల బంధువులు, గ్రామ పెద్దలు రంగంలో దిగారు. కొంతమంది రాజకీయ నాయుకులు కూడా మధ్యవర్తిత్వం నెరిపారు. మొత్తంమీద ఇరువర్గాల మధ్య చర్చోపచర్చలు నిరాటంకంగా సాగుతున్నాయి. చర్చలు ఓకే అయితే సరే... లేకపోతే పోలీస్‌ కేసే... కాగా, దీనిపై పోలీసులు ఎప్పటిలాగానే స్పందించారు. ఈ విషయం తమకు తెలియనట్లు చెప్పారు. దీంతో మరోసారి పోలీసులు తమంతట తామే తమ బేలతనాన్ని చాటుకున్నారు

నల్లధనం రప్పించడానికి ఉద్యమాలే శరణ్యం

విదేశీ బ్యాంకుల్లో మూలుగుతున్న భారతీయ నల్లధనం తిరిగి దేశంలోకి రప్పించడానికి ప్రజా ఉద్యమాలే శరణ్యమని బిజెపి నేత బండారు దత్తాత్రేయ అన్నారు. అవినీతికి వ్యతిరేకంగా నోరెత్తే ప్రతివారిపై ఎదురుదాడే తప్ప దేశంలో రోజురోజుకూ వెలుగు చూస్తున్న అవినీతి కుంభకోణాలపై దేశ ప్రజలకు జవాబు చెప్పే పరిస్థితి లేదన్నారు. నాటి బోఫోర్స్‌ కుంభకోణంలో చేతులు మారాయని ఒప్పుకున్న 50కోట్ల రూపాయల కుంభకోణంతో పోల్చుకుంటే ఇప్పుడు వెలుగు చూస్తున్న కుంభకోణాలు ఎన్నో రెట్లు పెద్దవని, పివి. నరసింహారావు ప్రభుత్వంలో జరిగిన సిమెంట్‌ కుంభకోణంలో 150కోట్ల కుంభకోణం కూడా చాలా చిన్నదన్నారు.
ప్రధాన మంత్రి యుపిఎ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీ కేవలం పనికిమాలిన ఉపన్యాసాలు ఇస్తున్నారే తప్ప, ఈ కేసులు విచారణకు ప్రభుత్వం వైపు నుంచి సహకరించటం లేదని, ప్రభుత్వంలోని పెద్దలు దిగ్విజయ్‌ సింగ్‌, కపిల్‌సింగ్‌ వంటి నాయకులు పౌర సమాజం ప్రతిపాదించిన లోక్‌పాల్‌ బిల్లుకు కొర్రీలు పెడుతూ, అవినీతిని ప్రశ్నించిన వారిపై సిబిఐ వంటి రాజ్యాంగ సంస్థలను ఉసిగోల్పుతున్నారని, ఈరోజు 2జి స్కాంపై జరుగుతున్న విచారణ కూడా బిజెపి పార్లమెంటును 25 రోజులు స్థంభింపజేస్తే తప్ప ఈ ప్రభుత్వం జెపిసి వెయ్యడానికి ఒప్పకోలేదని, ఆకారణంగానే 2జీ కేసు సుప్రీం ప్రత్యక్ష పర్యవేక్షణలో కొనసాగుతోందని ఆయన చెప్పారు.

వాదోపవాదాలు...ఘర్షణలతో...మరింత జాప్యం

తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలపై దాడికి పాల్పడితే తెలంగాణ వస్తుందా అని పంచాయతీరాజ్‌ శాఖ మంతి జానారెడ్డి తెలంగాణవాదులను సూటిగా ప్రశ్నించారు. ఇలా పరస్పరం దాడులకు పాల్పడితే తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ మరింత జాప్యం అవుతుందని జానారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రొఫెసర్‌ జయశంకర్‌ మృతదేహాన్ని సందర్శించడానికి వెళ్లిన కాంగ్రెస్‌ ఎంపిలు, ఎంఎల్‌ఏలపై తెలంగాణ వాదులు చేసిన దాడిని ఆయన ఖండించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తాము చిత్తశుద్ధితో ఉన్నామని, తమ వాదనను గత వారం ఢిల్లీకి వెళ్లినపుడు అధిష్టానం ముందు తీవ్ర స్థాయిలో వినిపించామన్నారు. సమస్యకు పరిష్కారం ఎక్కడ ఉఉందో..అక్కడే తీవ్ర స్థాయిలో తమ వాదనను వినిపించాలి తప్ప బహిరంగంగా ఢాంబికాలు, ప్రగల్భాలు పలకొద్దని ఆయన హితవు పలికారు. రెండు సమూహాలుగా విడిపోతే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అంతరాయం కల్గుతుందని, అలా ఆటంకపరిచే వారు కారణభూతులు అవుతారన్నారు.

ఇసుక మాఫియాకు మంత్రి ధర్మాన ప్రోత్సాహం

మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రోత్సాహం ఉండడం వల్ల ఇసుక మాఫియా ఎక్కువైందని దానివల్ల భావితరాలకు భూగర్భజలాలు ప్రశ్నార్ధకమేనన్నారు. భూగర్భజలాలు అడుగంటుతున్నా, అడిగే నాధుడే కరువయ్యారని అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైందని, మంత్రి ధర్మానకు తొత్తుగా వ్యవహరిస్తూ, అండగా ఉంటున్నారని టిడిపి పొలిట్‌ బ్యూరో సభ్యులు, కేంద్ర మాజీ మంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు విమర్శించారు.

ఇసుక మాఫియాపై ప్రభుత్వం కొత్త విధానం తీసుకురావాలని లేకపోతే భూగర్భజలాలు అడుగంటక తప్పదని విమర్శించారు. అలాగే తెలుగుదేశం పార్టీ హయాంలోనే పాఠశాల భవనాలు ఎక్కువగా మంజూరు అయ్యాయని, వాటికి ప్రస్తుతం అధికారులు, కాంగ్రెస్‌ నాయకులు సున్నాలు వేస్తూ, మంత్రిధర్మాన ప్రసాదరావు గొప్పలు చెప్పుకుంటున్నారని ఆరోపించారు. పాఠశాల భవనాలలో నాణ్యత లేదని, అధికార యంత్రాంగం నిఘా కరువైందని ఆరోపించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో విద్యకు అనేక ఆటంకాలు ఎదురవుతున్నాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవినీతిలో కూరుకుపోవడం వల్ల దోపిడీ పాలన కొనసాగుతోందని దుయ్యబట్టారు.

తిరుమలలో మొరాయించిన రోటీ యంత్రాలు

తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన రోటీ యంత్రాలు మొరాయించాయి. దీంతో ఉత్తర భారతదేశ భక్తులు రోటీలు లేక ఇబ్బంది పడ్డారు. ఈ యంత్రాలను ఉత్తర భారతదేశం నుంచి కాకుండా పొరుగునే ఉన్న తమిళనాడులోని కోయంబత్తూరు నుంచి కొనుగోలు చేశారు. నూతన అన్నదాన భవనంలో జూలై మొదటి వారం నుంచి భక్తులకు రోటీలతో కూడిన భోజనాన్ని పూర్తి స్థాయిలో అందించాలని టిటిడి నిర్ణయించింది. అయితే ఆదిలోనే హంసపాదు అన్న చందంగా ఈ యంత్రాలు చెడిపోయాయి. రోటీల తయారీలో పేరెన్నిక గన్న ఉత్తర భారతదేశ యంత్రాలు తేకుండా ఏమీ తెలియని పొరుగు రాష్ట్రం నుంచి తేవడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని సిబ్బంది అంటున్నారు.

మాతృ భాషలోనే మాటామంతీ మంచిది!

మాతృదేశము కన్న మాతృ భాష కన్న

మధురమైనదేది మానవులకు!

స్వర్గమైన నేమి సౌఖ్యమ్ము లొనగూర్చు

తల్లి కన్నతల్లి భాష కన్న!

ఇటాలియన్‌ ఆఫ్‌ ది ఈస్ట్‌ అనీ, దేశ భాషలందు తెలుగులెస్స అనీ గొప్పపేరు తెచ్చుకున్న తేనెలొలికే తెలుగు భాష తెలుగువారి చేతనే నిరాదరణకు గురి అవుతుంటే తెలుగు బాషాభిమానులకు చాలా బాధ కలుగుతోంది. తెలుగుకు ప్రాచీన భాష హోదా వచ్చినందువల్ల ఏమి ఒరిగింది? చాలామంది తెలుగువాళ్లు తెలుగులో మాట్లాడడం చిన్నతనంగా భావిస్తూ ఇంట్లోవాళ్లతో, బంధువులతో స్నేహితులతో ఇంగ్లీష్‌లో మాట్లాడుతున్నారు. అది ఒక గొప్ప ఫ్యాషన్‌గా భావిస్తున్నారు. మాతృభాషలో మాట్లాడడమే నిజమైన సంస్కృతీ ఫ్యాషనూ అని తెలుసుకోవడం లేదు వాళ్లు పాపం!

వీళ్లు పిల్లల్ని కూడా తెలుగులో మాట్లాడవద్దనీ ఇంగ్లీష్‌లోనే మాట్లాడమనీ నూరిపోస్తున్నారు. అందువల్ల ఈ రోజుల్లో చాలామంది పిల్లలకి తెలుగుమాటలు అర్థం కాక ''అంటే ఏమిటీ'' అని అడుగుతున్నారు. మమ్మీ, డాడీ అని పిల్లల చేత పిలిపించుకుంటూ చాలా మోడ్రర్న్‌ వాళ్లమని మురిసిపోతున్నారు తెలుగు తల్లితండ్రులు! అమ్మ, నాన్న అనే పిలుపులో ఉన్న మాధుర్యమూ, ఆప్యాయతా వీళ్లకి తెలియడంలేదు.

ఇప్పటి పిల్లలే కదా భావిపౌరులు? వీళ్లకి తెలుగురాకపోతే రాబోయే కాలంలో తెలుగుభాషే వినపడకుండా పోతుందేమోననీ తెలుగు క్రమంగా అంతరించిపోతుందేమోననీ భయం కలుగుతోందంటే అతిశయోక్తి కానేకాదు. ఈ ఇంగ్లీష్‌ పిచ్చి తెలుగువాళ్లకి ఉన్నంతగా మన దేశంలో ఇతర రాష్ట్రాల వాళ్ల కెవరికీ లేదు. వాళ్లు వాళ్ల మాతృభాషలలోనే మాట్లాడుకుంటారు.

ఈ మధ్య ఒక సినీ కవిగారు అన్నారుట ''నలుగురైదుగురు కూర్చుని ఆపకుండా ఇంగ్లీష్‌లో మాట్లాడుతున్నారంటే వాళ్లు తప్పకుండా తెలుగువాళ్లే అయి ఉంటారని తెలుస్తుంది అని''.

ఇక్కడ షాపుల వాళ్లకి కూడా ఇంగ్లీష్‌ మోజు ఎక్కువే! వాళ్లు ఇంగ్లీష్‌ మాట్లాడుతూ వచ్చిన కస్టమర్లకిచ్చే అతి గౌరవం తెలుగులో మాట్లాడేవాళ్లకివ్వరనిపిస్తుంది.

ఈ ధోరణిని అరికట్టాలంటే, ఇలా ఇంగ్లీష్‌లో మాట్లాడడం మొదలుపెట్టిన వాళ్లతో ఏమాత్రం సందేహించకుండా గట్టిగా ''ఏం? మీకు తెలుగు వచ్చుకదా ఇంగ్లీష్‌లో ఎందుకు మాట్లాడుతున్నారు?'' అని మన నిరసనని వాళ్లకి బాగా తెలియచెయ్యాలి. అలా వాళ్లకి చెప్పడం ఏమీ తప్పుకాదు. తప్పకుండా అందరూ నిర్భయంగా చెప్పాలి కూడాను.

ఎప్పుడైనా తెలుగుమాట సరైనది స్ఫురించకపోతే ఇంగ్లీష్‌ మాటలు ఉపయోగించడం ఏమీ తప్పుకాదు.

తెలుగు భాష అంతరించిపోకుండా ఉండాలంటే తెలుగు భాషాభిమానులు అందరూ పెద్దఎత్తున ఉద్యమం చేపట్టాలి. తెలుగు భాషను కాపాడుకోవాలి. తప్పకుండా చివరిగా ఒక మాటఏమిటంటే -ఇంగ్లీష్‌ భాషను ద్వేషించవలసిన అవసరమెంత మాత్రమూ లేదు. అది గొప్ప ప్రపంచ భాష? అందరూ తప్పకుండా నేర్చుకుని ప్రావీణ్యత సంపాదించవలసిన భాష? అందుకేమీ సందేహం లేదు.

--శ్రీమతి కె.హైమవతీ శాస్త్రి

27న మార్కెట్లోకి ఎతియోస్‌ లివా

భారత వాహన రంగంలోకి మరో చిన్న కారు రానుంది. టయోటా కిర్లోస్కర్‌ మోటార్స్‌ తామందిస్తున్న ఎతియోస్‌ బ్రాండ్‌ కింద లివా పేరిట చిన్న కారును ఈ నెల 27న విడుదల చేయనుంది. మారుతి సుజుకి, నిస్సాన్‌, ఫోర్డ్‌, చవర్లెట్‌, వోక్స్‌వాగన్‌ వంటి కంపెనీలు ఇప్పటికే తమ తమ కాంపాక్ట్‌ కార్లను విడుదల చేసిన నేపథ్యంలో టయోటా సైతం అదే దారిలో పయనించనుంది. కొత్తగా రానున్న టయోటా లివా ధర 4 లక్షల రూపాయల నుంచ ప్రారంభం కావచ్చని, ఎయిర్‌బ్యాగ్స్‌, యాంటీ లాక్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌ గల హై ఎండ్‌ కారు ధర 5.5 నుంచి 6 లక్షల రూపాయల మధ్య ఉంటుందని నిపుణుల అంచనా. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అన్ని హాచ్‌బ్యాక్‌ కార్లతో పోలిస్తే ధర తక్కువగా ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మారుతి స్విఫ్ట్‌, హ్యుందాయ్‌ ఐ20, వోక్స్‌ వాగన్‌ పోలో, నిస్సాన్‌ మైక్రా, స్కూడా ఫాబియా, ఫియట్‌ పుంటో తదితర కార్ల ధరలు 4.3 నుంచి 8 లక్షల రూపాయల మధ్య ఉన్న సంగతి తెలిసిందే.

'కాకా' పట్టడమూ ఆరోగ్యమే!

ఆఫీసులో మీ బాసు తెగ ఇబ్బంది పెడుతున్నారా? దీంతో అనవసర ఆలోచ నలు చుట్టుముట్టి మీ ఆరోగ్యం చెడిపో తోందా? అయితే ఖచ్చితంగా మీరు కాకా పట్టడం నేర్చుకోవాల్పిందే... మీరు ఆరో గ్యంగా ఉండాలంటే కాకాయే ఉత్తమం అని నిపుణులు నిరారిస్తున్నారు కాబట్టి.

కొందరికి మనుషుల్ని కాకా పట్టి తమ పనులు చేయించుకోవటం అంటే మహా సరదా... అంతెందుకు ఆఫీసుల్లో బాసుల్ని కాకా పట్టి సెలవు సంపాదించ డమో... తోటి ఉద్యోగుల్ని కాకా పట్టి తాము చేయాల్సిన పనిని చేయించుకోవ టమో తరచూ మనం చూస్తుంటాం. పై అధికారులేమంటారో అని కొందరు... వారి వేధింపులకు గురై మరికొందరు మానసిక వేదనలకు గురై తీవ్ర అనారోగ్యం పాలవు తున్నారని వీరికి మనుషుల్ని కాకా పట్ట డం తెలియకనే అని జర్నల్‌ ఆఫ్‌ మేనేజ్‌ మెంట్‌ స్టడీస్‌ ప్రకటించింది. చైనా, అమె రికా లకు చెందిన పలువురు నిపుణు లు దాదాపు 5 ఏళ్ల పాటు చేసిన వివిధ సర్వేలలో తేలిన రిపోర్టును ప్రచురిస్తూ... నిత్యం బాసులని కాకా పడుతూ తిరిగేవారు ఆనం దకర జీవనాన్ని గుడుపుతున్నారని... బాస్‌ సహచరం, ఆశీస్సులు ఉన్నట్లు ముద్ర పడ్డవారి వైపు సహోద్యోగులు కూడా తొం గి చూసేందుకు భయపడతారని సర్వేలో వెల్లడైంది. బాస్‌ని కాకా పట్టిన వారంతా ఎలాంటి ఆందోళనా లేకుండా తమ విధు లను నిర్వహిస్తు ఆరోగ్యంగా ఉన్నట్లు పేర్కొంది. మరింకేం... మీరూ మీ బాస్‌ని కాకా పట్ట డం నేటి నుండే ప్రారంభించండి....

శ్రీవల్లి తన్మయ్‌

త్వరలో యాహు పాఠాలు...

నేటి ఆధునిక యుగంలో ఇన్ఫర్మేషన్‌టెక్నాలజి దూసుకుపోతున్న తరుణంలో ప్రతి ఒక్కరికి కంప్యూటర్‌ నిత్యావసరంగా మారుతోంది. ఏ చిన్న సమాచారం కోసమైనా నేటియువతరం ఆశ్రయించేది ఇంటర్నెట్‌నే. ఇంటర్నెట్‌ అందుబాటులోకి వచ్చాక దాదాపు ప్రపంచం అంతా మొత్తం ఓ కుగ్రామంగానే కాదు ఏకంగా మనిషి అరచేతిలోకి వచ్చేసిందనటంలో సందేహమేలేదు. మనిషి నిత్యజీవితంలొ ఇంటర్నెట్‌ ఓ భాగమైపోయింది. విద్య, ఉద్యోగం, వివాహం ఇలా అన్నింటికీ ఇం టర్నెట్‌నే ఆధారంగా చేసుకుని నేటి యువత తమ జీవన విధానాన్ని మార్చేసుకొంటోంది. సెల్‌ ఫోన్‌ ఎంత అవసరంగా మారిందో నేడు ఇ-మైల్‌ చిరునామా కూడా అంతే అవసరంగా మారి ంది. ప్రస్తుతం ఇ-మైల్‌ ఖాతాలను పలు సాంకేతిక సంస్ధలు అందిస్తుంటే.... యాహూ మరో అడుగు ముందుకేసి స్ధానిక భాషల్లో పాఠశాల విధ్యని అందించేందుకు సన్నాహాలు చేస్తోంది. 'లెర్న్‌ యాహు' పేరుతో ఒక ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేసి ఇంటర్నెట్‌ వినియోగదారులకు అందించే ఏర్పాట్లు చేస్తున్నట్లు యాహూ ఇండియా సీనియర్‌ డైరక్టర్‌ నితిన్‌ మాథ్యూర్‌ వెల్లడించారు. ఇటీవల ప్రయోగాత్మకంగా పరిశీలన చేయగా మొదటి ప్రయత్నంగానే వినియోగదారుల నుంచి 'యాహూ'పై అనూహ్య స్పందన లభించడంతో మరిన్ని సాంకేతిక మార్పులతో పూర్తిస్ధాయిలో వినియోగానికి తేవాలనే ప్రయ్నంలో ఉన్నట్లు తెలిపారు. తమ సంస్ధ యాహూ! ఇండియా చేపట్టిన సర్వేలో ప్రస్తుతం ఇంటర్నెట్‌ వినియోగదారుల సంఖ్య భారత్‌లో 81.7 శాతానికి చేరినట్లు వెల్లడైందని. అంతే గాకుండా చాలా మంది ఇంటర్నెట్‌ వినియోగదారులు తమ మాతృభాషలో ఇంటర్నెట్‌ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నట్లు తేలిందని అందుకు అనుగుణంగానే మార్పులు చేపట్టామన్నారు. - జి.సీతారామ్‌

పారిపోయిన ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌

సర్కస్‌ రాముడు చిత్రంలో ఎన్టీఆర్‌ హీరో. ఒక విగ్రహానికి ఆయన దండ వేసే సన్నివేశం చిత్రీకరణకు ఏర్పాట్లు జరిగాయి. ఆ విగ్రహంకి పక్కన ఏర్పాటు చేసిన నిచ్చెన ఎక్కి పూలదండ వేయాలి ఎన్టీఆర్‌. ఆర్ట్‌ డిపార్ట్‌ మెంట్‌ వారు ఆ ఏర్పాట్లు చేసారు.

''షాట్‌ రెడీ'' అని డైరక్టర్‌ దాసరి నారాయణరావు అనగానే ఎన్టీఆర్‌ నిచ్చెన ఎక్కుతున్నారు. కొన్ని మెట్లు ఎక్కాక ఒక అడ్డుమెట్టు విరిగింది. ఎన్టీఆర్‌ దఢాల్న కింద పడ్డారు. ఆ చప్పుడుకు అందరూ కంగారు పడిపోయారు. విషయం తెలుసుకున్న ఆర్ట్‌ డిపార్ట్‌ మెంట్‌కి చెందిన సభ్యులంతా తుపాకీ దెబ్బకు దొరకని వారై ఆచూకీ తెలీకుండా పారిపోయారు.

ఎన్టీఆర్‌ లేచి నిలబడ్డారు.

ఎవర్నీ ఏమీ అనలేదు. అడగలేదు.

ఏమీ జరగనట్టుగా ''నారాయణరావుగారూ నెక్ట్‌ ్స సీన్‌ ఏమిటి?'' అన్నారు కూల్‌గా. ఇంకెవరయినా అయివుంటే ఎంత హడావుడి జరిగేదో కదా అనిపిస్తుంది. అనిపించడమేమిటి చాలా గందరగోళం హడావుడి, ఉరుకులు పరుగులు వుండేవి.

ఎన్టీఆర్‌తో పని చేయడమే ఒక అదృష్టం. ఎన్టీఆర్‌ శోభన్‌బాబు, కృష్ణ, అక్కినేని, కృష్ణంరాజు తరం ఆర్టిస్టులుతో పనిచేయడం నిజంగా అదృష్టం. తరువాత తరాల్లో కాదా అంటే ఇప్పటి తరంతో నేను పనిచేయలేను. వారంతా మంచి క్రమశిక్షణ గలవారు. క్రమశిక్షణ కాదు చాలా విషయాలు వీరిదగ్గర పనిచేసిన వారు నేర్చుకోవచ్చు. ప్రొఫెషన్‌ మీద వారికి వుండే గౌరవం అంతా ఇంతాకాదు. ఎన్టీఆర్‌ నటించిన చిత్రాన్ని నేను డైరక్ట్‌ చేయలేదు గాని మా గురువుగారు డైరక్ట్‌ చేస్తున్న వాటికి అసిస్టెంట్‌గా, అసోసియేట్‌గా పనిచేసాను. ఎన్టీఆర్‌ తన పనేదో తాను చూసుకుంటారు. ఎవరినీ కించపరచరు. అందర్నీ గౌరవంగా సంబోధిస్తారు. బాయ్‌ని కూడా 'బాయ్‌గారూ' అని పిలుస్తారు. నేను సర్కస్‌రాముడు, మనుష్యులంతా ఒక్కటే, బొబ్బిలి పులి వగైరా చిత్రాలకు పనిచేసాను. 'సర్దార్‌ పాపారాయుడు'కి పనిచేయలేదు గాని షూటింగ్‌కి వెళ్ళేవాణ్ణి.

- డైరెక్టర్ రేలంగి నరసింహ రావు


పిల్లలకు స్కూలంటే భయమా?

మళ్లి పాఠశాలలు ప్రారంభమయినాయి. కొత్త డ్రెస్సులు, బూట్లు, పుస్తకాలతో పిల్లలు పాఠశాలకు ఎంత ఉత్సాహంతో పరిగెడుతుం టారు. మరి కొందరు పిల్లలు స్కూలుకు వెళ్ల మని మారాం చేస్తుంటారు. గత సంవత్సరం మా వాడు బాగానే వెళ్ళాడు కాదా...ఈ సంవ త్సరం ఎందుకు వెళ్లడం లేదని తల్లిదండ్రులు అనుకుంటారు. పిల్లలను కోపంతో బెదిరించి ఎలాగోలాగా మళ్లిd స్కూలుకు పంపిస్తారు. కాని స్కూలుకు వెళ్లడానికి గల కారణాలను చాలా మంది తల్లిదండ్రులు తెలుసుకోలేక పోతున్నారు. పిల్లలు ఇలా ఇష్టం లేకుండా పాఠశాలకు పోవ టం వలన మానసిక ఒత్తిడికి గురై చదువుల్లో రానించలేక పోతు న్నారు. వీరికి పాఠశాల అంటేనే భయంతో వణికి పోతుంటారు. పాఠశాలను వీరు జైలులాగా భావిస్తుం టారు. ఇటువంటి స్కూలు ఫోబియా ఉన్న పిల్లల యెడల తల్లిదండ్రులు కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లైతే పిల్లలు పాఠశాలలను దేవాల యాలుగా భావించి చక్కగా విద్యాభ్యాసం కొన సాగించేలాగా చేయవచ్చును.

పిల్లలు బాగా ఉన్నత చదువులు చదవా లని మంచి ఉద్యోగం చేయాలని ప్రతి తల్లిదం డ్రులు కోరుకుంటారు. కాని పిల్లలకు చదు వుతో పాటుగా సామాజిక సేవ, ఆధ్యాత్మికత, యోగ, ఆటలు కూడా నేర్పే ప్రయత్నం చేయాలి. దీని వల్ల పిల్లలకు మానసిక ఒత్తిడి తగ్గుతుంది.

స్కూలు ఫోబియా కారణాలు:

- పాఠశాలలో మాస్టరు చదువుమని దండించటం, పాఠశాలలో సదుపాయాలు సరిగా లేకపోవటం.

- పాఠశాలలో ఆటలకు, సృజనాత్మకతకు సమయం కేటాయించక అస్థమానం చదువమని బెదిరించటం.

- తోటి విద్యార్థుల కంటే చదువులో వెనక బడటంతో టీచర్‌ నిత్యం మందలించటం.

- కొత్తగా స్కూలుకు వెళ్లే చిన్న పిల్లలు తల్లిదండ్రులను ప్రధమంగా వదిలి వెళ్లుట వలన భయంతో ఏడుస్తుంటారు.

- పాఠశాలలో తోటి విద్యార్థులు దౌర్జన్య పూరితంగా నిత్యం వేదించటం.

- పాఠశాలలో కఠినమైన నిబంధనలు ఉండటం.

భయం-లక్షణాలు :

- చెమటలు పట్టడం, కాళ్లు చేతులు వణుకు రావడం.

- ఆకలి తగ్గి ఆహారం సరిగా తీసుకోక పోవడం.

- ఆలోచనలతో నిద్ర పట్టకపోవటం.

- మాటలు తడబడటం. ఎవరితో సరిగా మాట్లాడలేక పోవడం.

- వీరి ప్రవర్తన బాధ్యతారహితంగా వుంటుంది.

- ఏ పనిపై శ్రద్ద పెట్టకపోవడం, పనులను వాయిదా వేయటం

-ఏకాగ్రత లోపించటం, తలనొప్పి రావడం

-తమలో తామే బాధ పడటం వంటి లక్షణా లతో ఉంటారు

ఏం చేయాలి?

-పిల్లలు పాఠశాలకు వెళ్లాలంటే భయపడు తున్న కారణాలు తెలుసుకొని, వారిని నెమ్మదిగా నచ్చజెప్పాలి.

-పాఠశాల యాజమా న్యంతో, పాఠశాలలో బో ధించే టీచర్స్‌తో మాట్లాడి వివరణ తీసుకోవాలి.

- పాఠశాలకు వెళ్లా లంటే భయపడుతున్నా రని పాఠశాలకు పం పుట మానుకోవద్దు. అలా చేస్తే వారికి ఎప్ప టికి పాఠశాలంటే భయమే ఉంటుంది.

- వారికి ఉన్న సందేహాలను, భయా లను తొలగించి నచ్చ జెప్పి పాఠశాలకు దగ్గర ఉండి కొన్ని రోజులు తీసు కెళ్లాలి. తల్లిదండ్రులు పిల్లలతో స్నేహంగా వుండాలి.

- వారికి పాఠశాల మీద శ్రద్ద కలిగించే ఆదర్శవంతమైన మంచి మాటలు చెప్పి స్కూలుకు పంపే ప్రయత్నం చేయాలి.

చికిత్స

హోమియో వైద్య విధానంలో ప్రతి ఔషధం మానసిక లక్షణాలతో కూడి ముడిపడి వుంటుంది. కావున మానసిక రుగ్మతలకు హోమియో ఒక వరం. మందుల ఎంపికలో కూడా మానసిక శారీరక తత్వాన్ని ఆధారంగా చేసుకొని మందులను సూచించడం జరుగు తుంది కనుక సమూలంగా రుగ్మతలను చేయ డం సాధ్యం అవు తుంది.

మందులు :

ఆర్జెంటం నైట్రికం :

వీరు ఏ పని తలపెట్టాలన్నా గందర గోళం లో పడిపోతుంటారు. రేపు స్కూలుకు వెళ్లా లంటే ఈ రోజు రాత్రి వీరికి నిద్రపట్టదు. పాఠ శాల సమాయని కంటే ముందే స్కూలుకు వెళ్లాలనుకుంటారు. మానసిక స్థాయిలో ఈ రోగికి పంచరాద, తీపి అంటే ప్రాణం. వీరు లిఫ్ట్‌లో వెళ్లాలన్నా రోడ్డు మీద నడవాలన్నా, వంతెన దాటాలన్నా భయాందోళనకు గురౌ తారు. ఇటువంటి లక్షణాలుండి స్కూలంటే భయపడే వారికి ఈ మందు బాగా పని చేస్తుంది.

ఎకోనైట్‌ : స్కూలుకు వెళ్లే ముందు 'టెన్షన్‌' పడేవారికి ఈ మందు తప్పక పని చేస్తుందను కోవటం లో ఎలాంటి సందేహం లేదు. వీరికి మానసిక స్థాయిలో ఆందోళన, అస్తిమితం, ఉద్వేగపూరితమైన భయానికి లోనవుతారు. వీరికి నాడి వేగంగా, బలంగా కొట్టుకుంటుంది. వీరికి జన సమూహం, చీకటి అన్నా ఎక్కువగా భయంతో వీరు నిద్రలేమితో బాధపడుతుంటారు. ఇటువంటి లక్షణాలు ఉన్నవారికి ఈ మందు వాడినచో చక్కని ఫలి తం వుంటుంది.

జెల్సిమియం:

విద్యార్థులు స్కూ లంటేనే భయంతో పాటుగా తత్తరపడి పోతారు. తత్తర పాటుతో విరేచ నాలు కావడం ఈ రోగి గమనించద గిన ప్రత్యేక లక్ష ణం. పాఠశాలంటేనే వణుకు, దడ, తలనొప్పి మొదలవుతుంది. మూత్ర విస ర్జన అనంతరం తలనొప్పి తగ్గిపోవుట ఈ రోగి యొక్క మరొక విచిత్ర విశిష్ట లక్షణం. ఇలాంటి లక్షణాలున్న వారికి ఈ మందు ప్రయో జనకారి.

ఈ మందులే కాకుండా కాల్కేరియాఫాస్‌, జెన్సింగ్‌, సెఫియా, ఫాస్ఫరస్‌, బెల్లడొనా, కాల్కే రియా కార్బ్‌, సల్ఫర్‌, జింకం మెట్‌, ఆరంమెట్‌ వంటి మందులను లక్షణ సముదాయంను అనుసరించి డాక్టర్‌ సలహా మేరకు వాడుకొని స్కూలు ఫోబియా (భయం) నుండి విముక్తి పొందవచ్చును.

- డా|| పావుశెట్టి శ్రీధర్‌

దేశంలో 1974 నాటి ఎమర్జెన్సీ పరిస్థితులు

దేశంలో 1974 నాటి ఎమర్జెన్సీ పరిస్థితులు తలెత్తుతున్నాయని బీజేపీ జాతీయ నాయకుడు ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయిందని, రోజుకో కుంభకోణం బయటపడుతోందన్నారు. త్వరలో విమానాల కుంభకోణం కూడా బయటపడుతుందన్నారు. అవినీతి యూపీఏ ప్రభుత్వంపై పోరాటం చేసే వ్యక్తులకు తమ మద్దతు ఎల్లపుడూ ఉంటుందన్నారు. యోగా గురువు రామ్‌దేవ్ బాబాపై యూపీఏ ప్రభుత్వం దారుణంగా ప్రవర్తించిందన్నారు

ఎన్టీఆర్ పై బూట్లు విసిరిన సంగతి మర్చిపోయి

ఎన్టీఆర్ బతికుండగానే వైస్రాయ్ హోటల్ వద్ద ఆయనపై చంద్రబాబు నాయకత్వంలోని నేతలు చెప్పులు, బూట్లు విసిరిన సంగతి టీడీపీ నాయకత్వం మర్చిపోయిహన్మకొండలో ఎన్టీఆర్ విగ్రహంపై చెప్పులు విసరటంపై టీడీపీ నేతలు నానాయాగీ చేస్తున్నారని టీఆర్ఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ ఎంపీ బి.వినోద్‌కుమార్ ధ్వజమెత్తారు. ఆవేశంలో విగ్రహంపైకి చెప్పులు, రాళ్లు విసరటాన్ని టీడీపీ నేతలు పెద్దది చేయటం సరికాదని చెప్పారు

ఎన్‌టీఆర్ విగ్రహంపై దాడి పట్ల ఖండన

తెలంగాణ కోసం జీవితం అంకితం చేసిన ప్రొఫెసర్ జయశంకర్‌కు టీడీపీ తరపున అంజలిఘటిస్తుహన్మకొండ చౌరస్తాలో బుధవారం టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్‌టి.రామారావు విగ్రహం పై చెప్పులు విసిరి రాళ్ల దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు జి.భూపేశ్ తెలిపారు. తెలంగాణ వాదుల ముసుగులో ఎన్‌టీఆర్ విగ్రహం పై దాడి చేయడం దారుణమన్నారు

నాలుక చీరేస్తాం ! : పొన్నాలకు టీఆర్ఎస్ హెచ్చరిక

సీమాంధ్ర నాయకుల మోచేయి నీళ్లు తాగుతూ..వాళ్ల ప్రాపకంతో పదవులు పొందిన పొన్నాలది సీమాంధ్రుల ఆగడాలను నిలదీసిన జయశంకర్‌కు పదవులు ఇప్పించే స్థాయా... సొంత డబ్బా కొట్టుకుంటున్న పొన్నాల..డాలర్ లక్ష్మయ్యగా సమర్థత కంటే డబ్బే ప్రధానంగా రాజకీయాల్లో ఎదిగి, అక్రమంగా సంపాదించిన డబ్బు, అధికార మదంతో మాట్లాడుతున్నారని మధుసూదనాచారి ప్రశ్నించారు. "స్థాయి మరిచి చేస్తున్న మతిలేని ప్రేలాపనలు మానుకో. చేసిన అనుచిత వ్యాఖ్యలకు బహిరంగ క్షమాపణ చెప్పకుంటే నీ నాలుకను తెలంగాణ జాతి రెండుగా చీలుస్తుంది..జాగ్రత్త !'' అని హెచ్చరించారు.

డీజీల్, వంటగ్యాస్ ధరల పెంపు?

డీజీల్, వంటగ్యాస్ ధరలు మరోసారి పెరిగే అవకాశముంది. శుక్రవారం జరిగే కేంద్ర మంత్రుల కమిటీ సమావేశంలో డీజీల్, వంటగ్యాస్ ధరల పెంపుపై నిర్ణయం తీసుకోనున్నారు. డీజిల్ లీటర్‌కు 2 నుంచి 3 రూపాయలు, వంటగ్యాస్ 25 రూపాయలు పెరిగే అవకాశమున్నట్టు తెలుస్తోంది. క్రూడ్ ఆయిల్‌పై దిగుమతి సుంకాన్ని 5 శాతం పెంచి, డీజిల్‌పై 7.5 శాతం నుంచి 2.5 శాతానికి తగ్గించే అవకాశముంది. డీజీల్‌పై లీటర్ ఒక్కంటికి 15.44 రూపాయలు ఆయిల్ కంపెనీలు నష్టాన్ని భరిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ధరలు పెరుగుతుండటంతో ఆయిల్ కంపెనీల నష్టాల్ని వినియోగదారులపై వేసేందుకు పెట్రోలియం శాఖ ప్రయత్నాలు ప్రారంభించింది.

వందేమాతరం అవమానించిన కలెక్టర్

గన్‌ఫౌండ్రిలోని మహబూబియా పాఠశాలలో నూతన భవన ప్రారంభోత్సవానికి గురువారం ముఖ్యమంత్రి వచ్చిన సందర్భంలో సమయం సరిపోదనే ఉద్ధేశ్యంతో కలెక్టర్ వందేమాతరం, జాతీయగీతం పాడవద్దని చెప్పడం దారుణమని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు నర్రా భూపతిరెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరాజులు గురువారం ఓ ప్రకటనలో ఖండించారు.
కలెక్టర్ నటరాజన్ గుల్జార్ వందేమాతరం, జనగణమన పాడవద్దని చెప్పడం జాతిని అవమానపరచడమేనని జిల్లా కలెక్టర్ ఇలా వ్యవహరిస్తే, మిగతా వారి పరిస్థితి ఏమిటని వారు ప్రశ్నించారు.

తెలంగాణపై త్వరలో కేంద్రం నిర్ణయం

సరిగ్గా సంవత్సరం క్రితం జరిగిన ఉప ఎన్నికల్లో తనను గెలిపిస్తే బంగారు పల్లెంలో తెలంగాణ తె స్తానని వ్యాఖ్యానించిన డీఎస్ ఫలితాలు తారుమారు కావడంతో పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగినా తెలంగాణ విషయంలో ఏనాడూ పల్లెత్తు మాటైన అనకపోవడం గమనార్హం. పార్టీలకతీతంగా తెలంగాణ సాధన కోసం కృషి చేయాలని ఈ సందర్భంగా డీఎస్ పేర్కొన్నారు. ప్రోఫెసర్ జయశంకర్ ఆకస్మిక మరణం తెలంగాణ వాదులకు తీరనిలోటని తెలిపారు. జయశంకర్ ఆత్మ శాంతించాలంటే ఆయన చిరకాలవాంఛ అయిన తెలంగాణాను అతిత్వరలో తేవాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్రం అతిత్వరలో నిర్ణయం తీసుకుంటుందని శ్రీనివాస్ ఆశాభావం వ్యక్తం చేశారు

ప్రభుత్వం ఆ మాట మరిచిపోయింది.

నెలక్రితం వరంగల్ జిల్లా రఘునాథపల్లిలో ఉన్మాది దాడిలో గాయపడిన కు చెందిన మౌనికకు సాయమందిస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఆ మాటను మరిచిపోయింది. మౌనిక నిమ్స్‌లో చికిత్స పొందుతోంది. ఆమె చికిత్సకయ్యే ఖర్చును భరిస్తామని హామీయిచ్చిన ప్రభుత్వం ఇప్పటివరకు ఎటువంటి సాయం అందించలేదు. దీంతో వైద్యానికి అయిన రూ.70 వేలు కట్టాలని నిమ్స్ వర్గాలను మౌనికను కోరాయి. ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలుపుకోవాలని మౌనిక కోరుతోంది.

‘ఈసారి న్యాయం చేస్తారనుకుంటున్నా’

తనకు మంత్రి ఇవ్వడం, ఇవ్వకపోవడం అధిష్టానం ఇష్టమని కాంగ్రెస్ ఎంపీ కిషోర్ చంద్రదేవ్ అన్నారు. మంత్రివర్గ విస్తరణలో గతంలో జరిగిన అన్యాయాన్ని సరిదిద్ది ఈసారి న్యాయం చేస్తారని భావిస్తున్నానని ఆయన చెప్పారు. ఆగస్టులో కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఉంటుందని వస్తుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు.

సోంపేట విద్యుత్ కేంద్ర నిర్మాణానికి భూ కేటాయింపులపై హై కోర్టు స్టే

హైదరాబాద్, జూన్ 23 : సోంపేటలో నిర్మించతలపెట్టిన విద్యుత్ కేంద్రానికి భూ కేటాయింపులపై హై కోర్టు స్టే విధించింది. సోంపేట విద్యుత్ కేంద్ర నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వ జి.ఓ.పై అన్ని తదుపరి చర్యలనూ నిలిపివేయాలని కోర్టు ఆదేశించింది.

సోంపేటలో విద్యుత్ కేంద్రం నిర్మాణానికి 2008లో రాష్ట్ర ప్రభుత్వం 1000 ఎకరాలు కేటాయించింది. ఇందుకు సంబంధించిన జి.ఓ. కూడా అప్పుడే జారీ అయ్యింది. ఇప్పుడు ఆ జి.ఓ.పై హై కోర్టు స్టే విధించింది.

సోంపేటలో విద్యుత్ కేంద్రం వద్దంటూ అక్కడి ప్రజలు కొన్నాళ్లుగా తీవ్ర ఆందోళనలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

త్వరలోనే సువర్ణయుగం

త్వరలోనే వైఎస్ సువర్ణయుగం వస్తుందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. అనంతపురం జిల్లాలో కొనసాగుతున్న ఓదార్పుయాత్రలో భాగంగా గుట్టూరులో జగన్ ప్రసంగించారు. గుట్టూరులో ఓదార్పుయాత్రకు భారీ సంఖ్యలో ప్రజలు తరలి వచ్చారు. ఓదార్పుయాత్రలో జగన్ మాట్లాడుతూ ... త్వరలోనే మంచి రోజులు వస్తాయన్నారు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కై ప్రజా సమస్యల్ని పక్కదారి పట్టిస్తున్నారని జగన్ అన్నారు. ఈ ప్రభుత్వ ఎప్పడూ కూలిపోతుందా అని ప్రజలు ఎదురు చూస్తున్నరని జగన్ అన్నారు.