24, జూన్ 2011, శుక్రవారం

మళ్లీ వస్తున్న ఉదయ్ కిరణ్

హీరోగా ఉదయ్ కిరణ్ అతితక్కువ కాలంలో ఎంతెలా దూసుకువచ్చాడో... తర్వాత కొన్నాళ్లకే అదే స్పీడుతో పడిపోయాడు. కెరీర్ మంచి పీక్ లో వుండగా వ్యక్తిగత జీవితానికి సంబంధించి చేసిన పొరబాటు మొత్తం అతని కెరీర్నే తుడిచిపెట్టేసింది. ఈమధ్య కాలంలో అయితే, అసలు సినిమాలే లేకుండా పోయింది. అసలు తను ఎక్కడున్నాడో... ఏం చేస్తున్నాడో కూడా ఎవరికీ తెలియనంతగా కనుమరుగైపోయాడు. ఈ నేపథ్యంలో తాజాగా మళ్లీ అతనితో ఓ చిత్ర నిర్మాణానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఉదయ్ హీరోగా నూతన దర్శకుడు 'శ్రీ' దర్శకత్వంలో 'దిల్ కబడ్డీ' పేరుతో ఓ సినిమా రూపొందనుంది. ఈ నెల 27 న ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమవుతుందని తెలుస్తోంది. ఈ చిత్రంతోనైనా ఉదయ్ కెరీర్ మళ్లీ ఊపందుకుంటుందేమో చూద్దాం!

రామ్ తో కరుణాకరన్ సినిమా 'ఎందుకంటే...'

ప్రస్తుతం 'కందిరీగ' సినిమా షూటింగుని పూర్తిచేస్తున్న యువ హీరో రామ్ తన తదుపరి చిత్రానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాకి తమిళ దర్శకుడు కరుణాకరన్ దర్శకత్వం వహిస్తాడు. ప్రేమ కథా చిత్రాల రూపకల్పనలో పేరు తెచ్చుకున్న కరుణాకరన్ ఇప్పుడీ చిత్రాన్ని కూడా వెరైటీ లవ్ స్టోరీగా తీర్చిదిద్దడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు. అతనితో చేయడానికి రామ్ కూడా ఎప్పటి నుంచో ఆసక్తి చూపిస్తున్నాడు. ఈ నెల 27 న ఈ చిత్రం షూటింగును హైదరాబాదులో ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. మొదట్లో ఈ చిత్రాన్ని పరుచూరి కిరీటి ప్రోడ్యుస్ చేస్తారని వార్తలొచ్చినా, తాజాగా ఈ ప్రాజక్టును రామ్ పెదనాన్న స్రవంతి రవికిషోర్ నిర్మిస్తున్నారు. ఇందులో తమన్నా హీరోయిన్ గా నటిస్తునన్
ఈ సినిమాకి 'ఎందుకంటే...' అనే టైటిల్ పరిశీలిస్తున్నారు.


ప్రియమణి ఐటమ్ సాంగ్

ఆఫర్స్ ఏమీ లేక చివరకు ప్రియమణి ఐటమ్ సాంగ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాణా, జెనీలియా కాంబినేషన్ లో రూపొందుతున్న నా ఇష్టం చిత్రంలో ప్రియమణి ఐటమ్ సాంగ్ చేస్తున్నట్లు సమాచారం. మలేషియాలో షూటింగ్ జరుపుతున్న ఈ చిత్రం రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది. యునైటెడ్ మూవీస్ పతాకంపై ప్రకాష్ తోలేటిని దర్శకుడిగా పరిచయం చేస్తూ, సక్సస్ ఫుల్ యువనిర్మాత పరుచూరికిరీటి నిర్మిస్తున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ చిత్రం 'నాఇష్టం'. ఈ చిత్రంలో హీరో రాణా పాత్ర అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైనింగ్ గా ఉంటుందని సమాచారం.ఇక జెనీలియా పాత్ర కూడా అందుకు తక్కువేమీ కాదని తెలిసింది. జెనీలియాకు కూడా ప్రస్తుతం ఈ సినిమా హిట్టవటం చాలా అవసరం. ఇటీవల రాణా హీరోగా, ఇలియానా హీరోయిన్ గా, పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో, నల్లమలపు బుజ్జి నిర్మించిన "నేను- నా రాక్షసి" చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఇక ప్రియమణి ఐటం సాంగ్ ఈ చిత్రానికి ఏ మేరకు ఉపయోగపడనుందో చూడాలి.

పవన్ కల్యాణ్ సినిమాలో శృతి హాసన్

తొలి సినిమా ఫ్లాప్ అయితే, ఇక చాలా మంది కెరీర్ ముందుకు సాగదు. ఇందుకు భిన్నంగా శృతి హాసన్ కెరీర్ దూసుకుపోతోంది. ఆమె తొలి సినిమా 'అనగనగా ఓ ధీరుడు' ఫ్లాప్ అయినప్పటికీ, ఆమెకు ఆఫర్లు మాత్రం బాగానే వస్తున్నాయి. అటు తమిళంలోనూ, ఇటు తెలుగులోనూ కూడా సినిమాలు చేస్తూ బిజీగానే వుంది.
తెలుగులో సిద్ధార్థ్ తో 'ఓ మై ఫ్రెండ్', యన్టీఆర్ తో బోయపాటి శ్రీను సినిమాలోనూ నటిస్తోంది. ఇప్పుడు తాజాగా మరో భారీ ఆఫర్ తన సొంతం చేసుకుంది. పవన్ కల్యాణ్ సినిమాలో హీరోయిన్ గా నటించే అవకాశాన్ని పొందింది. ఆ సినిమా ఏదనేది మాత్రం ఇంకా వెల్లడికాకపోయినప్పటికీ, రాజు సుందరం డైరెక్షన్ లో పవన్ కల్యాణ్ నటించే సినిమా అని అంటున్నారు. ఏమైనా, శ్రుతీకి తెలుగులో కెరీర్ బాగుందనే చెప్పాలి!

అలేషియన్ ఐలాండ్స్‌లోభారీ భూకంపం

అమెరికా అలస్కాలోని అలేషియన్ ఐలాండ్స్‌లోభారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత 7.4గా నమోదు అయ్యింది. పసిఫిక్ మహా సముద్ర గర్భంలో భూకంప కేంద్రం ఏర్పడింది. అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు

పేలుళ్లతో దద్దరిల్లిన బాగ్దాద్

బాగ్దాద్ నగరం శుక్రవారం వరుస బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. నాలుగు కారు బాంబు పేలుళ్లలో సుమారు 40మంది మృతి చెందగా, మరో వందమంది గాయపడ్డారు. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలిస్తున్నారు.

లగడపాటికి పొన్నం సవాల్

కాంగ్రెస్ ఎంపీలు లగడపాటి రాజ్‌గోపాల్‌కు, పొన్నం ప్రభాకర్‌ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. పొన్నం తాజాగా లగడపాటికి సవాల్ విసిరారు. తాను ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని, దమ్ముంటే కరీంనగర్‌లో పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు.

ధన, కుల అహంకారంతోనే లగడపాటి తనను విమర్శిస్తున్నారని పొన్నం మండిపడ్డారు. తాను అవినీతికి పాల్పడినట్లు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. తెలంగాణ సమస్యను త్వరగా పరిష్కరించాలని సీడబ్ల్యూసీని కోరతామని ఆయన తెలిపారు.

బామ్మతో యువకుడి సెల్‌పోన్ ప్రేమాయణం,

సెల్ ఫోన్ ప్రేమాయణం ఓ యువకుడిని ఆత్మహత్యకు ప్రేరేపించింది. ఈ సంఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. ధర్మపురి జిల్లా పారాపట్టికి చెందిన తిరుపతి అనే 35 ఏళ్ల యువకుడికి రెండేళ్ల క్రితం విలుపురం జిల్లా తిరక్కోవిలూరుకు చెందిన మేరి అనే మహిళతో పరిచయం ఏర్పడింది. దీంతో ఇరువురు తరుచూ ఫోన్లో మాట్లాడుకునే వారు. నిత్యం మేరీతో మాట్లాడుతున్న తిరుపతి ఆమె ప్రేమలో పడి పోయాడు. ఆమెతో నిత్యం కబుర్లు చెప్పేవాడు. అయితే రెండేళ్లుగా మేరీతో మాట్లాడుతూ ప్రేమలో మునిగి పోయిన తిరుపతికి తన ప్రేయసి ఎలా ఉందో చూడాలనిపించింది. అంతే తడవుగా ఇటీవల మేరీ చిరునామాను కనుక్కొని ఆమె ఇంటికి వెళ్లాడు.

తీరా అక్కడకు వెళ్లాక ఆమె వయసు అరవై సంవత్సరాలు అని తెలిసి తిరుపతి ఖంగు తిన్నాడు. దీంతో అతను తీవ్ర నిరాశకు గురయ్యాడు. జీవితంపై విరక్తి కలిగి ఆత్మహత్యకు పూనుకున్నాడు. అదే జిల్లాలోని హోగినెకల్ శివారులో గురువారం సాయంత్రం పోలీసులు గస్తీ నిర్వహిస్తుండగా తిరుపతి ఓ చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు. గస్తీ పోలీసులు దానిని గమనించి తిరుపతిని అదుపులోకి తీసుకొని విచారించారు.

సత్యసాయి ట్రస్టు కార్యదర్శికి నోటీసులు

పుట్టపర్తి ప్రశాంతి నిలయం నుండి సత్యసాయి ట్రస్టుకు చెందినదిగా భావిస్తున్న నగదు తరలింపు వ్యవహారంలో ట్రస్టు కార్యదర్శి చక్రవర్తికి పోలీసులు శుక్రవారం నోటీసులు జారీచేశారు. పోలీసులు చక్రవర్తికి ఓ లేఖ కూడా రాశారు. యజుర్వేద మందిరం నుంచి వచ్చి వెళ్లే వాహనాల వివరాలు తెలిపే రిజిస్టర్ ఇవ్వాలని పోలీసులు ఆయనకు లేఖలో సూచించారు. ఇప్పటికే ఇద్దరు ట్రస్టు సభ్యులకు నోటీసులిచ్చిన పోలీసులు తాజాగా కార్యదర్శికి సైతం అందజేశారు. నోటీసు అందుకున్న ట్రస్టు సభ్యుడు శ్రీనివాసన్‌ అనారోగ్య కారణాల రీత్యా శనివారం విచారణకు రాలేనని సోమవారం వరకు గడువు కోరగా పోలీసులు అనుమతించారు. రత్నాకర్‌ శనివారం పోలీసుల ముందు హాజరు కానున్నారు. శుక్రవారం రత్నాకర్ డిఎస్పీని కలిశారు. కాగా మరో వ్యక్తి సదాశివన్‌ కోసం పోలీసులు బెంగుళూరులో గాలిస్తున్నారు.

ఇక కొడికొండ చెక్‌పోస్టు వద్ద పట్టుపడిన నగదుని తమకు స్వాధీనం చేయాలని ఆదాయపు పన్ను శాఖ అధికారులు హిందుపురం కోర్టులో నేడు పిటిషన్‌ దాఖలు చేయనున్నారు. అలాగే డబ్బు తరలిస్తూ పట్టుపడిన ముగ్గురు నిందితులు పెట్టుకున్న బెయిల్‌ పిటిషన్‌ ఇవాళ అదే కోర్టులో విచారణ రానుంది. శ్రీనివాసన్ వ్యక్తిగత సహాయకుడు వెంకటేషన్‌ను పోలీసులు నేడు ప్రశ్నించనున్నారు.

హోం > వివరాలు ట్రస్ట్‌తో నాకు సంబంధం లేదు: సత్యజిత్

సత్యసాయి ట్రస్ట్‌పై వస్తున్న ఆరోపణలతో తనకు సంబంధం లేదని సత్యసాయిబాబా ఆంతరంగిక శిష్యుడు సత్యజిత్ స్పష్టం చేశారు. ఆయన శుక్రవారం తొలిసారి మీడియా ముందు నోరు విప్పారు. తాను కేవలం బాబా భక్తుడిని మాత్రమేనని, ఆయనకు సేవ చేసుకునేందుకు మాత్రమే వచ్చానన్నారు. ట్రస్ట్ వ్యవహారాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని సత్యజిత్ అన్నారు.

చంద్రబాబుకి మరో షాక్

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి మరో షాక్ తగులబోతోంది. పార్టీ పోలిట్‌బ్యూరో సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు వైయస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీ నాయకులే స్వయంగా ఆ విషయాన్ని చెబుతున్నారు. తాను జగన్‌తో చర్చలు జరపలేదని, తన కుమారుడికి జగన్‌తో వ్యాపార సంబంధాలు లేవని ఉమ్మారెడ్డి నెత్తీనోరు కొట్టుకుని చెప్పినా వారు వినడం లేదు. చంద్రబాబుపై అలిగిన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు సరిగా పార్టీ కార్యాలయానికి రావడం లేదు.

తన బాధేమిటో తెలుసుకోవడానికి చంద్రబాబు కనీసం మాట్లాడడం లేదని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే, పోయేవాడితో మాటలేమిటని తెలుగుదేశం నాయకులు అంటున్నారు. ఇతర నాయకుల పట్ల వ్యవహరించినట్లుగానే చంద్రబాబు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విషయంలో వ్యవహరిస్తున్నారు. అంటే, అసంతృప్తితో ఉండిపోయే నాయకులను పట్టించుకోకపోవడమన్న మాట.