6, ఏప్రిల్ 2011, బుధవారం

అన్నా హజారేకు మేథా మద్దతు

అన్నా హజారే చేపట్టిన నిరాహారదీక్షకు ప్రముఖ సామాజిక కార్యకర్త మేథాపాట్కర్ తన మద్దతును ప్రకటించారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో, దేశంలో అడ్డూఅదుపు లేకుండా పెరుగుతున్న అవినీతిని రూపుమాపడానికి వెంటనే జన్‌లోక్‌పాల్ బిల్లును అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో ప్రధాని మన్మోహన్‌సింగ్ చొరవ తీసుకోవాలన్నారు.

అన్నాహజారే దీక్షకు దేశ వ్యాప్త మద్దతు

ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నాహజారే మంగళవారం నుంచి దేశరాజధాని న్యూఢిల్లీలో చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షకు దేశ వ్యాప్తంగా మద్దతు లభించింది. జన్‌లోక్‌పాల్ బిల్లును అమలు చేయాలని అన్నా ప్రారంభించిన దీక్షకు మద్దతుగా పెద్దఎత్తున ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. యోగా గురువు బాబా రాందేవ్, ఆధ్యాత్మిక గురువు రవిశంకర్, మాజీ క్రికెటర్ కపిల్‌దేవ్, ఐపీఎస్ మాజీ అధికారిణి కిరణ్ బేడీ, జనతాదళ్(యునెటైడ్) నాయకుడు శరద్ యాదవ్ తదితర ప్రముఖులు ఆయనకు మద్దతు ప్రకటించారు.

రజని విజయ రహస్యం ఇదీ..

పనిపై ఆసక్తి, అలుపెరుగని శ్రమే సూపర్‌స్టార్ రజనీకాం త్ విజయ రహస్యమని దర్శకుడు ఎస్‌పీ.ముత్తురామన్ పేర్కొన్నారు. ఇప్పుడొస్తున్న చాలా మంది దర్శకులు, నటులు ఐదారు చిత్రాలతోనే తెరమరుగవుతున్నారన్నారు.

అందుకు కారణం స్క్రిప్ట్‌లపై పూర్తిగా దృష్టి సారించకపోవడమేనని అభిప్రాయపడ్డారు. అప్పట్లో ఏవీఎం.మెయ్యప్పన్ లాంటి నిర్మాతలు పూర్తి స్క్రిప్ట్ సిద్ధమైతేనే సెట్‌పైకి వెళ్లేవారన్నారు. రజనీకాంత్ నేటికి సూపర్‌స్టార్‌గా వెలుగొందుతున్నారం టే అందుకు ఆయన పడే శ్రమ, పనిపై ఆసక్తే కారణమని ముత్తురామన్ వ్యాఖ్యానించారు.

పెళ్లికి ముందు సెక్స్ కి ఓకే అన్న ఖుష్బూ మాటలు వింటే అంతే

హిందీ భాషా వ్యతిరేకినని చెప్పుకునే కరుణానిధి ఏ మొహం పెట్టుకుని ఉత్తరాదికి చెందిన ఖుష్బూను ఎన్నికల ప్రచారానికి పిలిచారని ప్రముఖ హాస్యనటుడు సెంథిల్‌ప్రశ్నించారు. కరుణానిధి కలర్ టీవీలను ఉచితంగా ఇచ్చి, కేబుల్ కనెక్షన్‌ల ద్వారా ఏడాదికి రూ. 500 కోట్లను తన ఇంటికి తరలిస్తున్నారని ఆరోపించారు. పెళ్లికి ముందు సెక్స్ ఆమోదయోగ్యమే అంటూ సంచలన వ్యాఖ్యలు చేసినప్పుడు ఖుష్బూను తూర్పారబట్టిన పీఎంకే, వీసీకే పార్టీ నేతలు ఇప్పుడు ఆమె ప్రచారం చేస్తున్న పార్టీకి ఎలా మద్దతుగా నిలిచారని నిలదీశారు. పెళ్లికి ముందు సెక్స్ కి ఓకే అన్న ఖుష్బూ మాటలు వింటే అంతే కపట రాజకీయాలు ఆడే పార్టీలన్నీ ఒకే గొడుగుకిందకి చేరాయని, వాటిని తరిమికొట్టే సమయం ఆసన్నమైందని ఓటర్లకు పిలుపునిచ్చారు.

చెన్నైలో ‘పీపుల్ ఫర్ జగన్’ కి శ్రీకారం

తమిళనాడులోని వైఎస్.రాజశేఖరరెడ్డి అభిమానులను ఏకం చేసేందుకు జగన్ యూత్ ఫోర్స్ నేతృత్వంలో ‘పీపుల్ ఫర్ జగన్’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చెన్నైలో జగన్ యూత్ ఫోర్స్ అధ్యక్షుడు రంజిత్‌రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి భారీగా యువత హాజరయ్యారు. తమిళనాడులో ఉన్న అపారమైన యువశక్తిని, తెలుగు వారిని ఒక గొడుగు కిందికి తీసుకురావచ్చ ని, జగన్ స్ఫూర్తితో నవ సమాజ నిర్మించాలని, ప్రజలను భాగస్వామ్యం చేసి సేవా కార్యక్రమాల్ని విస్తృత పరచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు అధ్యక్షుడు రంజిత్‌రెడ్డి తెలిపారు. తన వంతుగా తమిళనాడులోని యువశక్తిని సంఘటిత శక్తిగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానన్నారు.

సాయి కిరణ్ ఇంటర్వ్యూ

మొదటి సినిమా ‘నువ్వే కావాలి’తో మెగాహిట్ సాధించినా తొలి ప్రాధాన్యం మాత్రం బుల్లితెరకేనంటూ వర్ధమాన టీవీ, సినీ నటుడు సారుుకిరణ్ స్పష్టం చేశారు. ప్రముఖ సినీగాయకుడు రామకృష్ణ కుమారుడే సాయికిరణ్. నటుడిగానే కాకుండా గాయకుడుగా కూడా రాణిస్తున్నారు. ప్రత్యేకించి కొన్ని పాత్రలకు మాత్రమే పరిమితం కాకుండా వైవిధ్యంతో కూడిన పాత్రలను పోషించి ప్రేక్షకుల మనసులో చిరకాలం గుర్తుండి పోవాలనే ఆకాంక్ష వెలిబుచ్చారు. బుల్లితెరను తన మజిలీగా మలచుకున్న సాయికిరణ్ న్యూస్‌లైన్‌తో తన అభిప్రాయాలను పంచుకున్నారు.

సినీరంగంలోకి రాకముందు..
హోటల్ మేనేజ్‌మెంట్‌లో డిగ్రీ చేసి చెన్నైలో ఉద్యోగంలో చేరా. పనిలో పనిగా సినిమా అవకాశాల కోసం ప్రయత్నించా. సినిమా రంగంలో అవకాశం రావడంతో ఉద్యోగాన్ని వదిలేశాను. నటుడిగా ప్రయాణం ప్రారంభించా.
మొదటి సినిమా గురించి..
నేను నటించిన మొదటి సినిమా ‘నువ్వే కావాలి’. ఆ సినిమా విడుదలైన కొద్దిరోజులకే మంచి టాక్ వచ్చింది. ఆ చిత్రం సూపర్‌డూపర్ హిట్ కావడం తెలిసిందే. ఆ సినిమాలో నేను పాడిన ‘అనగనగా ఆకాశం ఉంది’ పాట కూడా నాకు మంచి పేరు తె చ్చి పెట్టింది. ఆ తర్వాత మరో రెండు సినిమాల్లో పాడా. ‘ప్రేమించు’వంటి మరికొన్ని చిత్రాల్లో నటించా.

పాటలు పాడడం గురించి..
మా నాన్న వీ రామకృష్ణ ప్రముఖ సినీగాయకులుగా మీకందరికీ తెలిసిందే. ఆయన ప్రభావం నాపై ఉంది. పాటలు, పౌరాణిక పద్యాలంటే నాకు చాలా ఇష్టం. అయితే సినిమాల్లో పాటలు పాడే అవకాశం ఇవ్వాలని నిర్మాత, దర్శకులను బలవంతం చేయను. వారు పాడమంటే అందుకు సిద్ధం.
ఏ తరహా పాత్రలు ఇష్టమంటే..
వైవిధ్యంతో కూడిన పాత్రలంటే నాకిష్టం. ఒకే తరహా పాత్రలు చేయడం వల్ల అవి తప్పితే వేరేవి చేయలేరనే ముద్ర పడుతుంది. అందుకే వైవిధ్యంతో కూడిన పాత్రలను, నెగటివ్ షేడ్‌లు ఉండే పాత్రలైనా చేయడానికి సిద్ధం

బుల్లి తెర గురించి..
నేడు సినిమాలకంటే బుల్లితెరకే ఎక్కువ ప్రాధాన్యత ఉంది. టీవీ సీరియల్స్‌ద్వారా ప్రతి ఇంట్లో మన గురించి తెలుస్తుంది. ఎక్కువ ప్రచారం కూడా వస్తుంది. పైగా ఎక్కువ సీరియల్స్‌తోపాటు వైవిధ్యంతో కూడిన పాత్రలను చేసే వీలుంటుంది. బుల్లితెరకే నా మొదటి ప్రాధాన్యత.

ప్రస్తుతం నటిస్తున్న సీరియల్స్..
సుందరకాండ సీరియల్‌లో నటిస్తున్నా. మే నెలలో మహాభారతం సీరియల్ ప్రారంభమవుతుంది.

ఇక నా వ్యక్తిగతానికి వస్తే.. బాపు, రామానాయుడువంటి వారిని ఆదర్శంగా తీసుకుంటా. వారితో కలిసి పనిచేయడం వల్ల క్రమశిక్షణ, అంకితభావం పెంపొందుతాయి. సినీరంగంలో నేను అమితంగా అభిమానించే నటుడు రజనీకాంత్. నేను ఆయన అభిమానిని. నటుడిగా గొప్ప అవకాశాల కోసం ఎదురుచూస్తూనే ఉంటా. 55 సంవత్సరాలు దాటాక ప్రశాంతంగా ఆధ్యాత్మిక జీవితాన్ని గడుపుతా.