8, నవంబర్ 2010, సోమవారం

దాడుల నుంచి కాపాడుకోవాడానికే సైనిక సేవా దళ్‌

రాయలసీమ ప్రాంత ప్రజల సంక్షేమం, సీమేతరుల దాడుల నుంచి కాపాడుకోవాడానికే గ్రేటర్ రాయలసీమ సైనిక సేవా దళ్‌ను ఏర్పాటు చేశామని రాయలసీమ హక్కుల వేదిక కన్వీనర్, కర్నూలు ఎమ్మెల్యే టీజీ వెంకటేష్ స్పష్టం చేశారు.

రాయలసీమ ప్రజలకు ఎల్లవేళలా అండగా ఉంటూ వారి క్షేమాన్ని కోరుతూ సైనిక సేవా దళ్ ముందుకు పోతుందని.. క్రమశిక్షణ, సేవా భావం దళ్ సభ్యులు ప్రధానంగా ఆచరిస్తూ గ్రేటర్ రాయలసీమ ప్రజల అభిమానం, ఆశీస్సులతో వారికి సేవలందిస్తూ రక్షణ కల్పిస్తుందని ఆయన స్పష్టం చేశారు.

రాయలసీమ వాసులు సమైఖ్య రాష్ట్రం కోసం రాజధానిని త్యాగం చేశారని .... కృష్ణా జలాల పంపకంలో రాయలసీమకు ప్రాధాన్యత ఇచ్చేందుకు ఒప్పందం కుదిరినా ఇంత వరకు అమలుకాలేదని అన్నారు. రాయలసీమకు చెందిన పలువురు నాయకులు ముఖ్యమంత్రులు అయిన సీమ లబ్ధి పొందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణకు చెందిన పివి నరసింహారావు రాయలసీమ నుండి లోక్‌సభకు ఎన్నికై ప్రధానమంత్రి అయ్యారన్న విషయాన్ని తెలంగాణ వాసులు గుర్తుచేసుకోవాలని టీజీ వెంకటేష్ అన్నారు.

పల్లెబాట పొడగించిన టిఆర్‌ఎస్

ఇతర పార్టీల నుండి వలసలను ప్రొత్సహించడానికి తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు చేసిన పల్లెబాట కార్యక్రమాన్ని టిఆర్‌ఎస్ పొడగించింది. గత నెల 21 నుండి ఈ నెల 4వ తేదీ వరకు సాగుతుందని తొలుత ప్రకటించినా ఇతర పార్టీ కార్యకర్తలు, నేతలు నుండి అనూహ్య స్పందన లభించడంతో పల్లెబాట కార్యక్రమాన్ని 14వ తేదీ వరకు పొడగించింది.

గతంలో కార్యకర్తలు టి ఆర్ ఎస్‌లో చేరాలంటే కేవలం తెలంగాణ భవన్‌కు వెళ్లి మాత్రమే పార్టీ తీర్థం పుచ్చుకోవాల్సి వచ్చేది. అయితే స్వయంగా టి ఆర్ ఎస్ పార్టీ నేతల నుండి, కార్యకర్తల నుండి, ఇతర తెలంగాణ వాదుల నుండి వస్తున్న విమర్శలను తొలగించడానికి స్వయంగా కెసి ఆర్ పల్లెబాట కార్యక్రమంలో భాగంగా జిల్లాల్లో పర్యటిస్తూ అన్ని పార్టీల వారికీ ఆహ్వానాలు పంపిస్తున్నారు. కెసిఆర్ పర్యటన సందర్భంగా తెలుగుదేశం, కాంగ్రెస్ , పిఆర్‌పి పార్టీలకు చెందిన కార్యకర్తలు భారీ సంఖ్యలో టిఆర్‌ఎస్‌లో చేరుతున్నారు.

మరో వైపు ఆ పార్టీ మహిళ నేత మెదక్ పార్లమెంట్ సభ్యురాలు విజయశాంతి కూడా జిల్లాలో పల్లెబాట కార్యక్రమంలో భాగంగా విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇతర పార్టీల నుండి శ్రేణులను ఉత్సాహపరిచి పార్టీలో చేర్చుకోవడానికి గతంలో తనకు బిజెపి పార్టీతో నెలకొన్న సంబంధాలను ఉపయోగించి తీవ్రతరం చేస్తున్నారు. మొత్తంగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలోపు జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో పార్టీని ఏదొక విధంగా బలోపితం చేయాలిన పార్టీల నేతలు భావిస్తున్నారు.

డిసెంబర్ 17 న తేదీన ఖమ్మం జిల్లాకు వీరప్పమొయిలీ

కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి, కేంద్రమంత్రి వీరప్పమొయిలీ డిసెంబర్ 17 న తేదీన ఖమ్మం జిల్లాకు రానున్నారు. ఆయన హైదరాబాద్ నుంచి నేరుగా భద్రాచలం చేరుకొని అక్కడ శ్రీ సీతారామచంద్ర స్వామిని దర్శించుకున్న అనంతరం గాంధీపధం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జరిగే శ్రీ రామాయణ జాతీయ మహాసదస్సును ఆయన ప్రారంభించి ప్రసంగించనున్నారు.

భారత్‌, కివీస్‌ తొలి టెస్ట్‌ డ్రా

భారత్‌, న్యూజిలండ్‌ జట్ల మధ్య జరుగుతున్న మొదటి మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. 6 వికెట్ల నష్టానికి 82 పరుగులతో ఓవర్‌నైట్‌ స్కోర్‌తో చివరిరోజు ఆట ప్రారంభించిన భారత్‌ 266 పరుగులకు అలౌట్‌ అయ్యింది.

లక్ష్మణ్‌ ( 91), హర్భజన్‌ సింగ్‌ (115) జహీర్‌ఖాన్‌ 0, శ్రీశాంత్‌ 4 పరుగులు చేశారు. అనంతరం 294 పరుగల లక్ష్మంతో బరిలోకి దిగిన కివీస్‌ 10 ఓవర్లు ఆడిన 22 పరుగులు చేసింది. 22/1 స్కోరు వద్ద ఇరు జట్లు కెప్టెన్ల అంగీకారం మేరకు చివరి రోజు 15 ఓవర్లు ఉండాగానే అంపైర్లు మ్యాచ్‌ను డ్రాగా ప్రకటించారు.

ఖేల్ రత్నా అవార్డును అందుకున్న సైనా నెహ్వాల్!

భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ ఖేల్ రత్నా అవార్డును అందుకున్నారు. ప్యారిస్‌లో జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొనేందుకు వెళ్లిన కారణంగా ఆగస్టు 29వ తేదీ జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో సైనా నెహ్వాల్‌ పాల్గొనలేకపోయింది.

తద్వారా సోమవారం సైనా నెహ్వాల్‌కు రాజీవ్ గాంధీ ఖేల్ రత్నా అవార్డును కేంద్ర క్రీడా శాఖా మంత్రి ఎం.ఎస్. గిల్ అందజేశారు. ఖేల్ రత్న పతకంతో పాటు రూ. 7.5లక్షల నగదును కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణ పతక విజేత సైనా నెహ్వాల్‌కు గిల్ అందజేశారు.

ఉత్తరాంధ్రలో ఎలక్షన్‌ ఫీవర్‌ మొదలైంది....

శాసనమండలికి ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికల్లో తాము బలపరిచిన అభ్యర్థులను గెలుపించుకోవడం కోసం ప్రధాన పార్టీల్లో ఫీవర్‌ మొదలైంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ నియోజకవర్గానికి ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడే అవకాశాలు ఉన్నాయి.

ఈ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్న ఎం.వి.శర్మ పదవీ కాలం 2011 మార్చి 29తో ముగుస్తున్నందున ఇప్పటికే అధికార, ప్రతిపక్ష పార్టీలు ముందస్తు వ్యూహంతో గెలుపునకు పావులను కదపడం ప్రారంభించాయి. ఈ నెల 11వ తేదీతో పట్టభద్ర ఓటర్ల నమోదు కార్యక్రమం ముగుస్తుంది.

ఆటకేక్కుతున్న ఆశయ సాధన

దేశ ప్రగతి ప్రజలు విద్యాభివృద్ధిపై ఉందని గ్రహించిన ప్రభుత్వాలు విద్యాభివృద్ధికి ఎన్నో కోట్లు ఖర్చుచేసి వయోజన విద్యా కేంద్రాలు, నిరంతర విద్యా కేంద్రాలు, సాక్షర భారత్‌ లాంటి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి కృషి చేస్తున్నా పథకాల్లో ఉన్న ఆశయ సాధనకానరావడం లేదు.

తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు అమలుకు సొంత రాజకీయ నాయకులే కారణమని .. తమ పార్టీకి చెందిన వారు.. తమ వర్గానికి చెంది ఉండపోతే ప్రభుత్వ పథకాలకు మోకాలడ్డు వేస్తున్న స్వార్ధ రాజకీయాలకు పాల్పడుతున్న నాయకులు ఉన్నంత వరకు ప్రభుత్వ ఆశయానికి గండి తప్పడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.

సంపూర్ణ అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు ఉద్దేశించి కేంద్ర ప్రభుత్వం సదాశయంతో సాక్షర భారత్‌ను ప్రవేశపెట్టింది. రాజకీయ నాయకుల కారణంగా ఇప్పటికీ బాలారిష్ట దశ నుంచి ఇది అధిగమించలేదు. గత పథకాల మాదిరిగానే ఈ పథకం నీరుగారిపోతోందని పలువురు విశ్లేస్తున్నారు.

ఆరు నెలల్లో ఈ కార్యక్రమం పూర్తి చేయాలన్నది అధికారుల లక్ష్యం. నాలుగు నెలల్లో ఒకటో వాచకం, రెండు నెలల్లో రెండో వాచకం నేర్పించేందుకు రాత పుస్తకం, పెన్సిల్‌, రబ్బరు, మెండర్‌ ప్రతి నిరక్షరాస్యునికీ అందించారు. ఈ పరికరాలు గ్రామ సమన్వయకర్త ఇళ్లల్లో మూలుగుతున్నాయని ఆరోపనలున్నై.

గౌరవ భృతి పొందిన వారికి రాజకీయ అండదండలు ఉండడంతో సాక్షర భారత్‌ కేంద్రాలు చీకట్లోనే నిద్రపోతున్నాయి. నిబంధనల మేరకు నాలుగు నెలల్లో వాచకం పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ రెండు నెలలు గడిచిపోయింది. అంటే ఎనిమిదో వంతు పుస్తకం పూర్తవ్వాలి. కానీ పూర్తయినట్లు గ్రామ, మండల కో-ఆర్డినేటర్లు నమోదు చేస్తున్నారు. మండల కో-ఆర్డినేటర్‌ ఆఫీసుకే పరిమితమవడం పర్యవేక్షణ లేకపోవడంతో, ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. వీరిపైన చర్యలు తీసుకోవడానికి కూడా అధికారులు వెనకడుగు వేస్తున్నారు.

రాజకీయ నాయకుల సిఫార్సుపై పని చేస్తున్నా వీరు ప్రభుత్వ ఆశయాన్ని నెరవేరుస్తారా అన్నది శేష ప్రశ్నగా మిగిలిందని ప్రజలు పేర్కొంటున్నారు.

ప్రభుత్వానికే పంగనామాలు పెడుతున్నా పట్టించు కోరా ?

ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే వివిధ శాఖలు ప్రతి ఏడాది ఆదాయ మార్గాలను వృద్ధిపరచుకోవడం ద్వారా ప్రభుత్వానికి ఏ ఏడాదికి ఆ ఏడాది ఆదాయంలో పెరుగుదలను చూపిస్తాయి. ఇలా పలు శాఖల నుంచి వచ్చిన ఆదాయాన్ని క్రోడీకరించి రాష్ట్ర బడ్జెట్‌ను తయారు చేస్తారు.అయితే డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్‌ కార్యాలయాలు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరి స్తున్నట్లు ఆరోపణలు వస్తునా ప్రభుత్వానికి పట్టదు.

ఇటీవల కాలంలో రాష్ట్రంలో వాహనాలు, ఇతర వాహనాల కొనుగోళ్లు ఊహించిన దానికంటే ఎక్కువగా జరుగుతున్నా... వీటి ద్వారా రిజిస్ట్రేషన్‌ ఫీజు, లైఫ్‌ టాక్స్‌ వంటి రాబడులు రవాణా కార్యాలయానికి చేరాల్సి ఉంది. అదేవిధంగా ప్రతిఏటా ఆటోలు, బస్సులు, ట్రాక్టర్లు, లారీలు వంటి వాహనాల రెన్యువల్స్‌ సందర్భంగా కూడా ఆదాయం వస్తోంది. ఇవన్నీ ఒక ఎత్తయితే పలు ప్రాంతాల్లో వాహన తనిఖీ సమయంలో వచ్చే ఆదాయానికి లెక్క ఉండదు.

నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులకు భారీ ఎత్తున జరిమానాలు విధించాల్సి ఉన్నా .. జరిమానాలు విధించి అధిక మొత్తాన్ని ఆమ్యామ్యాల రూపంలో నొక్కేస్తున్నారని బహిరంగంగానే ఆరోపణలు వినిపిస్తున్నాయి.కొందరు ఏకంగా నకిలీ చలానా పుస్తకాలు ఉపయోగించి బినామీ రసీదుల ద్వారా ప్రభుత్వానికి రావాల్సిన సొమ్ముకు కూడా పంగనామాలు పెట్టి అడ్డదారిలో స్వాహా చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి.

రాత్రి సమయాల్లో జరిగే తనిఖీల్లో ఇటువంటి మతలబు వ్యవహారాలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయని సమాచారం. ఈ కారణంగా అక్రమ రవాణా పెచ్చుమీరుతుండగా ప్రభుత్వాదాయానికి భారీగా గండిపడుతోంది. ఇప్పటికైనా నిఘా విభాగాలు రవాణా కార్యాలయాల కలాపాలపై కన్ను వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది

ఇందిరాగాంధీ, ఎన్టీరామారావు లే ఓడిపోయారు నేనెంత

అధికారం, పదవిలోనున్న లేకున్న తన ఈస్థాయిలో వుంచిన నగర ప్రజల పక్షానే వుంటూ వారికి సేవ చేయడం తన కర్తవ్యమని పిసిసి అధ్యక్షులు ధర్మపురి శ్రీనివాస్‌ స్పష్టం చేశారు.

తన రాజకీయ ఎదుగుదలకు నియోజక వర్గ ప్రజలే కారణమని తన ఏ స్థాయిలో ఉన్న నియోజక వర్గ ప్రజలను మరువనన్నారు. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమన్నా డియస్‌ గతంలో ఇందిరాగాంధీ, ఎన్టీరామారావు, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులు సైతం ఓటమిపాలైన సందర్భలున్నాయని అన్నారు.

తన షష్టి పూర్తి సందర్భంగా స్వర్గీయ రాజశేఖర్‌రెడ్డి నిజామాబాద్‌ జిల్లాకు మంజూరు చేసిన మెడికల్‌ కళాశాల తరగుతులు వచ్చే జూన్‌ నాటికి ప్రారంభం కావాలని ఆశభావం వ్యక్తం చేశారు.

కేంద్రం నియమించిన శ్రీ కృష్ణ కమిటి డిసెంబర్‌ 31న కేంద్రానికి నివేదిక అందిస్తుందని నివేదిక అనుసారం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తదనంతర పరిణామాల్లో ఉద్యమంలో భాగస్వాములవుతారని ప్రశ్నించగా ఆయన దాటా వేశారు.

9 నుండి శ్రీ సద్గురు సంగీత సభ వార్షిక మహోత్పవాలు

సద్గురు సంగీత సభ పదిహేడవ వార్షిక సంగీత మహోత్సవాలు ఈనెల తొమ్మిదవ తేదీ నుండి 13 వ తేదీ వరకు నిర్వహింపబడతాయని సంస్థ కార్యదర్శి పోపూరి గౌరినాథ్‌ తెలిపారు.

విజయవాడ ఘంటశాల వెంకటేశ్వరరావు సంగీత,నృత్య కళాశాల ప్రాంగణంలో కార్యక్రమాలు జరుపనున్నట్లు పేర్కొన్నారు. ప్రతి రోజు సాయంత్రం విశేషమైన సంగీత కచేరీలు నిర్వహింపబడతాయని అన్నారు.

ఈ మహోత్సవాలలో భాగంగా సంగీత రంగంలో ప్రతిభ కనబరిచిన వారికి ప్రతి ఏటా ఇచ్చే సంగీత విద్వన్మణి బిరుదును ప్రియా సిస్టర్స్‌గా ప్రసిద్ధులైన షణ్ముఖప్రియ, హరిప్రియలకు అందచుయబడతాయని తెలిపారు.

జై తెలంగాణ అంటే దోస్తి చేస్తాం....

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కొనసాగు తున్న ఉద్యమం స్ట్రీట్‌ ఫైట్‌ కాదు స్టేట్‌ ఫైట్‌. ఉద్యమంలో ఎంతో మంది ఆత్మ బలిదానాలు చేశారు. వారి త్యాగం వృధా కానివ్వం. డిసెంబర్‌ 31 తరువాత తెలంగాణకు అనుకూలంగా శ్రీకృష్ణ కమిటీ నివేదిక లేకపోతే ఉద్య మాన్ని ఉదృతం చేస్తామని సిద్దిపేట ఎమ్మెల్యే టి. హరీష్‌ రావు పేర్కొన్నారు.

తెలంగాణలో అపారమైన వనరులు ఉన్నాయని అయిన ఈ ప్రాంతం అభి వృద్దికి నోచుకోవడం లేదని అన్నారు. వనరులు ఇక్క డ ఉన్న అభివృద్ది మాత్రం ఆంధ్రా ప్రాంతంలో జరు గుతుందని అన్నారు. మన వనరులను, ఉద్యోగ ఉ పాధిని మనమే ఉపయోగించుకొని తెలంగాణ ప్రాం తాన్ని అభివృద్ది చేసుకోవాలని కోరారు. జై తెలంగాణ అంటే దోస్తి చేస్తాం..నై తెలంగాణ అంటే తరిమి కొడ తామని హెచ్చరించారు.

‘అంతం’ లోగో, ఆడియోలను ఆవిష్కరించిన పవన్‌ కళ్యాణ్‌

త్రిభాషా చిత్రం ‘అంతం’ చిత్రలోగోను సినీనటుడు పవన్‌కళ్యాణ్‌ ఆవిష్కరించారు. ఆదివారం రాత్రి అబిడ్స్‌లోని మెర్క్యురీ హోటల్‌లో ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. బాలీవుడ్‌ యాక్షన్‌ స్పెషలిస్ట్‌ టినువర్మ ఈ చిత్రానికి దర్శకుడు.

‘అంతం’ లోగో, ఆడియోలను ఆవిష్కరించిన అనంతరం పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడుతూ ‘పులి..షూటింగ్‌ టైంలో టినువర్మ పరిచయమై మంచి మిత్రుడయ్యారని, ఆ స్నేహంతో ఈ సినిమాలోని యాక్షన్‌ దృశ్యాల గురించి చెప్పారన్నారు. ఈచిత్ర కధ ఆసక్తికరంగా అనిపించింద ని, ఈ చిత్రం మంచి విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు.

జలవిహార్‌లో హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌ వనభోజనాలు

నిత్యం విధి నిర్వహణలో మునిగితేలే పాత్రికేయులు ఆదివారం సకుటుంబ సమేతంగా వనభోజనాల్లో పాల్గొని ఆటపాటలతో గడిపారు. హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌ ఆధ్వర్యంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకొని జలవిహార్‌లో పాత్రికేయుల కుటుంబాలకు పిక్నిక్‌ ఏర్పాటు చేసింది. ఈ పిక్నిక్‌లో పాల్గొన్న హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌ సభ్యులు తమ కుటుంబ సభ్యులతో జలవిహార్‌లో విహరించారు.తంబోలా తదితర ఆటల్లో మునిగితేలారు.

'అనంత' కవులకు సాహితీ కవితా పురస్కారం

రాష్టస్థ్రాయిలో విజయవాడ మానస సాహిత్య సాంసృ్కతిక అకాడమీ వారు నిర్వహించిన సి.హెచ్‌.వి. సుబ్బారావ్‌ స్మారక కవితల పోటీలో అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణా నికి చెందిన కవి ఎల్‌.ప్రపుల్లచంద్ర వ్రాసిన మట్టి మహాభాగ్యం అన్న కవితకు ఈ ప్రత్యేక పురస్కారం లభించింది.

ఈ మేరకు విజయవాడ మానస సాహితీ సంస్థ అధ్యక్షులు సి.హెచ్‌. వి.యస్‌ బ్రహ్మానందరావ్‌ నుండి ఆహ్వానం అందింది నవంబర్‌ 7న విజయవాడ చండ్ర రాజేశ్వర్‌రావ్‌ స్మారక గ్రంథాలయం నందు జరిగే ప్రత్యేక ఉత్సవంలో ఈ పురస్కారం పలువురు కవులుకు అందజే స్తారు. కాగా అనంతపురం జిల్లా గోరంట్లకు చెందిన రామకృష్ణకు సైతం ఈ పురస్కారం లభించింది.

బూట్లు ధరించి గుస్సాడి నృత్యం చేస్తావా ?

ఆదివాసి గోండు గిరిజనుల సంస్కృతిని ఎల్లవేళలా కాపాడుతూ వారికి అండగా నిలుస్తానని ఎప్పటికప్పుడు ప్రకటన చేసే ఓ నాయకుడు వారి సంస్కృతిని కించ పర్చిన సంఘటనతో నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇటీవల ఉట్నూరు మండలంలోని రాజుగూడాలో జరిగిన గుస్సాడి దండారి కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా పార్లమెంట్‌ సభ్యులు రాథోడ్‌ రమేష్‌ సాంప్రదాయాలను పట్టించుకోకుండా వారి ఆచార వ్యవహారాలను కించపర్చే విధంగా బూట్లు ధరించి తలకు నెమలిపించం టోపీ వేసుకొని గుస్సాడి నృత్యం చేయడం సహించరాని చర్య అని ఆదివాసి హక్కుల పోరాట సమితీ తుడుందెబ్బ ఆరోపించింది

ఆదివాసుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తించినందుకు ఆదివాసులందరికి రాథోడ్‌ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

వారికి సోనియా భజన తప్ప వారికేమీ తెలియదు

కాంగ్రెస్‌ ఎంపీలు చేతకాని దద్దమ్మలని, వారికి సోనియా భజన తప్ప వారికేమీ తెలియదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయడు విమర్శించారు. తమ హక్కులకోసం పోరాటం చేయలేని ఎంపీలు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటేనన్నారు. స్వామినాథన్‌ కమిటీ సిఫారసులు అమలు చేస్తే రైతులకు లాభం చేకూరుతుందని బాబు అభిప్రాయపడ్డారు. గుంటూరులో హైకోర్టు బెంచ్‌ కోరుతున్న న్యాయవాదుల డిమాండ్‌ సరైందేనని బాబు అన్నారు.

అహ్మదాబాద్ టెస్ట్‌లో హర్భజన్ సెంచరీ

బంతితో మాయాజాలం చేసే భార త స్పిన్నర్ హర్భజన్ సింగ్ బ్యాటింగ్‌లోనూ సత్తా చాటాడు. టెస్ట్‌ల్లో తొలి సెంచరీ సాధించాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో హర్భజన్ ఈ ఘనత సాధించాడు. 170 బంతుల్లో 10 ఫోర్లు, రెండు సిక్సర్లతో సెంచరీ పూర్తి చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లోనూ భజ్జీ బ్యాట్ ఝుళిపించి 69 పరుగులు చేశాడు.

రెండో ఇన్నింగ్స్‌లో కష్టాల్లో పడిన టీమిండియాను లక్ష్మణ్ (94), హర్భజన్(110) ఆదుకున్నారు. భజ్జీకి తోడుగా ఓజా(7) క్రీజ్‌లో ఉన్నాడు. భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 255/8 స్కోరుతో ఆటకొనసాగిస్తోంది. ఇప్పటివరకు కివీస్‌పై భారత్‌కు 283 పరుగుల ఆధిక్యం లభించింది.