19, మే 2011, గురువారం

విభజిస్తే ఒక ప్రాంతంలోనయినా మనుగడ

మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కడప ఎంపీ వైఎస్ జగన్మోహనరెడ్డి కోవర్టు అని సీనియర్ నేత పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి ఆరోపించారు... ఎంపీ రాజగోపాల్‌రెడ్డి కూడా జగన్‌కు ధన సాయంతో పాటు మనుషులను కూడా సరఫరా చేస్తూ అన్నివిధాలా సాయపడుతున్నారని ఈ ఇరువురి వల్ల జగన్‌కు బలమే తప్ప అధిష్ఠానానికి కాదన్నారు. విభజిస్తే ఒక ప్రాంతంలోనయినా మనుగడ సాగిస్తుందని పాల్వాయి అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రులను మార్చి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే తప్పుచేసిందని, ఉన్న వారి ద్వారానే సమర్థంగా పనిచేయించుకోవాలని ఆయన సూచించారు.

కేంద్ర రైల్వేశాఖ మంత్రిగా ముకుల్ రాయ్

నూతన కేంద్ర రైల్వేశాఖ మంత్రిగా ముకుల్ రాయ్ నియమితులయ్యారు. కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ పదవికి రాజీనామా సమర్పించడంతో మమత బెనర్జీ స్థానంలో ముకుల్ రాయ్‌కి స్థానం కల్పించారు. బెంగాల్ పదకొండవ ముఖ్యమంత్రిగా మమత బెనర్జీ శుక్రవారం ప్రమాణస్వీకారం చేయనుండటంతో ఆమె కేంద్ర మంత్రి పదవికి రాజీనామా సమర్పించారు.

మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో మరో పొరపాటు

కేంద్ర హోంశాఖ పాకిస్థాన్‌కు అందించిన మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో తప్పిదం దొర్లింది. 1993 ముంబై పేలుళ్ల కేసులో శిక్ష అనుభవిస్తున్న ఫిరోజ్ అబ్దుల్‌ఖాన్ పేరును లిస్ట్‌లో ఉంచింది. ముంబై జైలులో ఉన్న ఫిరోజ్ పేరును సీబీఐ మోస్ట్ వాంటెడ్ లిస్ట్ నుంచి తొలగించడం మర్చిపోయిందని హోం మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు.

ఆయన రాజీనామా ఎవరికిచ్చారు?

తెలంగాణ పాదయాత్ర చేపట్టిన మంత్రి జూపల్లి కృష్ణారావును తన నియోజకవర్గం గద్వాలలో అడుగు పెట్టనిచ్చేది లేదని మరో మంత్రి డికె అరుణ స్పష్టం చేశారు. నా అనుమతి లేకుండా రావడానికి వీలు లేదు, వస్తే అడ్డుకుంటాం అన్నారు. ఈ విషయాన్ని సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి దృష్టికి సైతం తీసుకెళ్లానని మంత్రి వివరించారు. ఎవరితోనూ కలవకుండా, ఎవరినీ సంప్రదించకుండా, వ్యక్తిగత ఎజెండాతో యాత్ర చేపట్టి, జిల్లాలో గ్రూపులు ప్రోత్సహిస్తున్నారంటూ.... మంత్రిగానే ఆయన పర్యటిస్తున్నారని విమర్శించారు. ఆయన రాజీనామా ఎవరికిచ్చారు? ఎవరు ఆమోదించారని ఆమె ప్రశ్నించారు.

రాష్ట్రంలో వ్యవసాయం పండగ

రైతుల సమస్యల పేరిట తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు చేస్తున్న ఆందోళనలు, ధర్నాలు రాజకీయ డ్రామా కార్యక్రమాలుగా రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి డి శ్రీధర్‌బాబు అభివర్ణించారు. తెలుగుదేశం అధినేత రైతుల గురించి మాట్లాడితే ప్రజలు నమ్మే స్థితిలో లేరని,, తికిలపడిన తెలుగుదేశం పార్టీని తిరిగి నిలబెట్టుకునేందుకే సమస్యలను భూతద్దంలో చూపుతూ ఆందోళనలు చేస్తున్నారని విమర్శించారు. ధాన్యం సేకరణ విషయంలో విపక్షాలు చేస్తున్న ఆందోళనలు రైతుల మనోధైర్యాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత విద్యుత్, పావలా వడ్డీ రుణాలు, 13 వేల కోట్ల రుణ మాఫీ, కౌలురైతులకు రుణ సౌకర్యం, అందుబాటులో ఎరువులు, పొలంబడి కార్యక్రమాల ద్వారా రాష్ట్రంలో వ్యవసాయాన్ని పండగలా మార్చిందన్నారు.

వ్యవసాయమే దండగ అన్న చంద్రబాబు

కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతి అని రైతులకు ఏ సమ్యల వచ్చినా సత్వరమే పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నా...రైతుల కోసం టీడీపీ అధినేత చంద్రబాబు చేస్తున్న కార్యక్రమాలు అర్థం లేనివని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి పితాని సత్యనారాయణ ఎద్దేవా చేశారు. వ్యవసాయమే దండగ అన్న చంద్రబాబుకు రైతాంగం, వ్యవసాయం గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. త డిసెంబరులో సంభవించిన అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఇన్‌పుట్ సబ్సిడీని ప్రభుత్వం విడుదల చేసిందని తెలిపారు. మరో వారం రోజుల్లో ఈ ఇన్‌పుట్ సబ్సిడీని రైతులకు అందజేయడం జరుగుతుందని మంత్రి తెలిపారు.

చైనాలో తెలుగు విద్యార్థి ఆత్మహత్య

చైనాలో ఎంబీబీఎస్ చదువుతున్న తెలుగు విద్యార్థి సత్య శ్రీనివాసరెడ్డి ఓ చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం తెలుసుకున్న కుటుంబసభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. మరో నాలుగు నెలల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసుకుని తిరిగి వస్తాడని ఎదురు చూస్తున్న తల్లిదండ్రులు కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడన్న విషయాన్ని తట్టుకోలేకపోతున్నారు.

ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద తెలంగాణ జర్నలిస్టుల ధర్నా

వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ప్రత్యేక తెలంగాణపై బిల్లు పెట్టాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రాంత జర్నలిస్టులు గురువారం ఉదయం ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ధర్నాకు దిగారు. జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ నివేదికలోని 8వ చాఫ్టర్‌ను బహిర్గతం చేయాలని వారు డిమాండ్ చేశారు. జర్నలిస్టుల ఆందోళనకు పలు ప్రజాసంఘాలు మద్దతు తెలిపాయి.

రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్న చంద్రబాబు

రైతు సమస్యల పరిష్కారం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచే నిమిత్తం గురువారం తెలుగుదేశంపార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు, ధర్నాలు చేపట్టింది. రైతు సమస్యలను పరిష్కరించాలంటూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు మహబూబ్‌నగర్‌జిల్లాలోని మరికల్‌లో రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లాలోని దేవరకద్ర మార్కెట్‌యార్డును పరిశీలించి, అక్కడి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్

మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లా బాంబ్రాగడ్ పోలీస్ స్టేషన్‌పరి«ధిలో గురువారం మధ్యాహ్నం మారంఘడ్- నారగొండ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు అమర్చిన మందుపాతరలు పేలి సీ-60 బలగాలకు చెందిన నలుగురు పోలీస్‌కానిస్టేబుళ్లు అ క్కడికక్కడే మృతిచెందగా, మరో ఇద్దరు కానిస్టేబుళ్లు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటనతో వెంటనే తేరుకున్న పోలీసులు మావోయిస్టులను వెంబడించి ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పులలో 15 మంది మావోయిస్టులు మృతిచెంది ఉంటారని అనుమానిస్తున్నారు.