19, ఏప్రిల్ 2011, మంగళవారం

సాక్షి వార్తలకు రేటు కట్టి జగన్ ఖాతాలోకి..?

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కడప పార్లమెంటరీ స్థానం అభ్యర్థి జగన్‌కు చెందిన దినపత్రిక, ఛానల్‌లలో జగన్‌కు అనుకూలంగా వస్తున్న వార్తలన్నింటినీ పెయిడ్ న్యూస్‌గా పరిగణించి, ఎన్నికల ఖర్చులో లెక్కించాలని టీడీపీపీ నేత నామా నాగేశ్వరావు చేసిన ఫిర్యాదుపై ఈసీ స్పందించింది. ఈ మేరకు త్వరలోనే స్పష్టమైన విధివిధానాలను రూపొందిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం డైరెక్టర్ జనరల్(డీజీ) అక్షయ్ రావత్ వెల్లడించారు. దేశంలో చాలా మంది రాజకీయ నేతలకు సొంత ఛానెళ్లు, పత్రికలు ఉన్నాయని, మరికొందరికి అనుకూల మీడియా ఉందని ఈ అంశంపై ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో స్పష్టమైన విధానాలను రూపొందించి, చర్యలు తీసుకుంటామని తెలిపారు. సాక్షి కథనాలను తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని ఓ ప్రశ్నకి సమాధానంగా చెప్పారాయన . దీంతో సాక్షిలో వస్తున్న జగన్ అనుకూల వార్తలు పైడ్ న్యూస్ గా పరిగణిస్తే.. ఇబ్బందులు తప్పవని జగన్ వర్గం తలలు పట్టుకోంటోంది .