20, మే 2011, శుక్రవారం

తెలంగాణ కావాలో... పార్టీ కావాలో తేల్చుకో

'ఏడాదిన్నర క్రితం కళింగ భవన్‌లో తెలంగాణ జెఎసి ఏర్పాటైన రోజు అన్ని పార్టీలు జెండాలు పక్కనబెట్టి కలిసి పోరాడాలని టిఆర్ఎస్ అధ్యక్షుడు కెసిఆర్ తానే అందరికీ విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు దానిని గాలికి వదిలి తన జెండా పట్టుకొని తిరుగుతూ తెలంగాణలో తన పార్టీ ఒక్కటే ఉండాలని...మిగిలిన పార్టీలు ఉండకూడదని ప్రయత్నం చేస్తున్నారు. కెసిఆర్ తన రాజకీయ లబ్ధి కోసమే చూస్తే ఏనాటికీ తెలంగాణ రాదు. తనకు తెలంగాణ కావాలో...తన పార్టీ కావాలో ఆయన తేల్చుకోవాలి' అని తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకరరావు డిమాండ్ చేశారు. 'ఉద్యమాన్ని అడ్డుపెట్టుకొని తన కుటుంబ ఆస్తులు పెంచుకోవడం ఒకటే ఆయన చేశారు. తెలంగాణ పరువు పోతుందని మేం కెసిఆర్ విషయంలో మౌనం వహిస్తున్నాం. మేం నోరు తెరిస్తే తెలంగాణ ప్రజలు ఆయనను తరిమికొడతారు' అని ఆయన వ్యాఖ్యానించారు.