6, అక్టోబర్ 2012, శనివారం

కేసీఆర్‌ను ఇంతవరకు కలవని కోదండరాం

తెలంగాణ మార్చ్ విజయవంతమైన నేపథ్యంలో జేఏసీ చైర్మన్ కోదండరాం ఆ కార్యక్రమానికి సహకరించిన వారిని కలుస్తూ కృతజ్ఞతలు చెబుతున్నారు. కానీ, టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌ను ఇంతవరకు కలవలేదు. ఉద్యమ నేతలిద్దరూ కలవని వైనం ఇటు టీఆర్ఎస్, అటు జేఏసీ వర్గాల్ల్లో చర్చనీయాంశమైంది. కేసీఆర్ గతనెల 5న ఢిల్లీ వెళ్లారు. అంతకంటే ముందే ప్రకటించిన షెడ్యూల్ మేరకు జేఏసీ సెప్టెంబర్ 30న మార్చ్ నిర్వహించింది. కేసీఆర్ ఢిల్లీలో ఉండగానే.. ఆయన పాల్గొనకుండానే కోదండరాం ఆధ్వర్యంలో మార్చ్ విజయవంతమైంది. ఈనెల 3న కేసీఆర్ హైదరాబాద్ వచ్చారు.

మార్చ్ జయప్రదానికి సహకరించిన భాగస్వామ్య పక్షం బీజేపీతోపాటు, సంఘీభావం ప్రకటించిన సీపీఐ, తెలంగాణ నగారా సమితి నేతలను కోదండరాం బృందం రెండు రోజులుగా కలిసి కృతజ్ఞతలు చెబుతున్నారు. మిగిలిన వారిని కలిసినట్టే టీఆర్ఎస్ అధ్యక్షుడినీ కలవటానికి కోదండరాం బృందం ప్రయత్నించినట్టు సమాచారం. "కోదండరాం, ఇతర ముఖ్య నేతలందరం నివాసానికి వస్తామం''టూ జేఏసీ కన్వీనర్ కె.స్వామిగౌడ్ గు రువారం కేసీఆర్ తోడల్లుడి తనయుడు జోగిన్‌పల్లి సంతోష్‌కుమార్ ద్వా రా కేసీఆర్‌కు కబురు చేశారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. కేసీఆర్ "కలుద్దాంలే'' అని బదులిచ్చారు.

కేసీఆర్ అపాయింట్‌మెంట్ స మాచారం టీఆర్ఎస్ శిబిరం నుంచి జేఏసీకి శుక్రవారం రాత్రి వరకు అం దలేదు. మరోవైపు ఆయన మధ్యాహ్నమే మెదక్ జిల్లా ఫామ్ హౌస్‌కి వెళ్లారు. ఈమేరకు ఏం జరుగుతుందనేది ఆసక్తిగా మారింది. "కేసీఆర్‌ను కలవటానికి టైం అడిగాం. ఇంతవరకు ఇవ్వలేదు. ఆయనే కలుస్తారులే అని ఊరుకున్నాం'' అని జేఏసీ ముఖ్య నేత ఒకరు చెప్పారు. మరోవైపు కోదండరాం, కొంత మంది జేఏసీ నేతలపై టీఆర్ఎస్‌లో ఆగ్రహం చల్లారలేదనే సంకేతాలు వెలువడుతున్నాయి.

జేఏసీ చైర్మన్ పదవి నుంచి కోదండరాంను తప్పించి స్వామిగౌడ్‌ను కూర్చోబెట్టాలనే కేసీఆర్ వ్యూహం.. జేఏసీలోని మిగిలిన పక్షాల ప్రతి వ్యూహంతో బెడిసికొట్టింది. పరకాల ఉప ఎన్నికలతో వారి మధ్య వైరుధ్యాలు పరాకాష్టకు చేరుకున్నాయి. కోదండరాం, కేసీఆర్ ముఖాముఖి కలుసుకోలేని పరిస్థితి ఏర్పడింది. అనివార్య పరిస్థితుల్లో గులాబీ నేతలు తెలంగాణ మార్చ్‌కు చివరి దశలో మద్దతు ప్రకటించారు. మార్చ్‌కు జన సమీకరణ చేసిన టీఆర్ఎస్ నేతలకు వేదికపై తగిన ప్రాధాన్యం లభించకపోవటం కోపం తెప్పించింది.

హరీశ్‌రావును ఉద్దేశించి ఉద్యోగ సంఘాల నేత శ్రీనివాస్‌గౌడ్ చేసిన వ్యాఖ్యలు, కేసీఆర్ పై విమలక్క చేసిన వ్యాఖ్యలు ఆగ్రహం తెప్పించాయి. దీంతో వారు మా ర్చ్ మధ్యలోనే వెనుదిరిగారు. ఈక్రమంలో జేఏసీ భాగస్వామి అయిన న్యూడెమోక్రసీ నేతలను కేసీఆర్ గురువారం తన నివాసానికి పిలిపించుకొని మాట్లాడినప్పుడు కూడా.. కోదండరాం తీరుపై ఆగ్రహం, అసంతృప్తి వ్యక్తంచేసినట్లు చెబుతున్నారు. అయినా కోదండరాం, కేసీఆర్ రాబోయే రోజుల్లో ముఖాముఖి సమావేశమవుతారా? లేదా? కనీసం జేఏసీలోని మిగిలిన నేతలతో అయినా కలిసి వారిద్దరు భేటీ అవుతారా ? అనేది కచ్చితంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది.