21, సెప్టెంబర్ 2012, శుక్రవారం

ఆ డబ్బు ఎక్కడనుండి తేవాలి ?

ప్రజలకు ఇబ్బంది కలిగించే నిర్ణయాలను ఏ ప్రభుత్వమూ తీసుకోదని ప్రధాన మంత్రి డాక్టర్ మన్‌మోహన్ సింగ్ వ్యాఖ్యానించారు. దేశ ఆర్థిక, రాజకీయ పరిస్థితులను ప్రజలకు వివరించడానికై ప్రధాని శుక్రవారం రాత్రి 8 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రత్యేకంగా ప్రసంగించారు. ప్రస్తుతం దేశ ఆర్థిక పరిస్థితి చాలా క్లిష్టంగా మారిందని, ఇటువంటి పరిస్థితులలో క్లిష్టమైన నిర్ణయాలను కఠినంగా అమలు చేయకపోతే దేశం పరిస్థితి ఇంకా తీవ్రంగా మారే ప్రమాదం ఉందని ఆయన చెప్పారు. యు.పి.ఎ. ప్రభుత్వానికి ఇప్పుడు వచ్చిన ముప్పు ఏమీ లేదని చెబుతూ ప్రభుత్వం కొనసాగింపునకు ఎటువంటి అవరోధాలూ లే వని ఆయన చెప్పారు.

రిటైల్ రంగంలో విదేశీ పెట్టుబడులవల్ల రైతులకు మేలు జరుగుతుందంటూ మాల్స్ వంటివి రావడంవల్ల ఉపాధి అవకాశాలు బాగా పెరుగుతాయని ప్రధాని విశ్వాసం వ్యక్తం చేశారు. వైద్య, విద్య, తదితర ఉపాధి రంగాలలో అవకాశాలు పెరగడానికి వీలుగా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటున్నదని ఆయన చెప్పారు. సంస్కరణలను అమలు చేస్తున్నది ఇందుకోసమేనని ఆయన చెప్పారు. సబ్సిడీల భారం ప్రభుత్వానికి పెరిగిపోతున్నదంటూ, ఖరీదైన కార్లు వినియోగించేవారికి డీజిల్‌పై సబ్సిడీ ఇవ్వవలసిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు.


ఆంధ్రజ్యోతి సౌజన్యంతో