6, ఏప్రిల్ 2013, శనివారం

పెద్దలను తప్పించి, యువకులకు పట్టం

 కాంగ్రెస్ పార్టీని యువరక్తంతో నింపేందుకు రంగం సిద్ధమైంది. పార్టీ మండల అధ్యక్షులుగావున్న పెద్దలను తప్పించి, యువకులకు పట్టం కట్టేందుకు  నిర్ణయించారు. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆలోచన మేరకు 45 ఏళ్లలోపు వయసున్న వారిని పార్టీ మండలాధ్యక్షులుగా నియమిస్తారు. రెండుసార్లు పదవి చేపట్టిన వారిని ఆ స్థానం నుంచి తప్పించి, నామినేటె డ్ పదవుల్లో భర్తీ చేస్తారు. ఈ మేరకు జిల్లా అధ్యక్షులకు ఆదేశాలందాయి. ఇవి అమలైతే జిల్లాలో 70 శాతం మంది పదవులను కోల్పోతారు. మంత్రులు, ఎమ్మెల్యేలతో చర్చించి పేర్లను సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. పార్టీ అనుబంధ సంస్థల నియామకాలకూ ఇదే సూత్రాన్ని వర్తింపజేయనున్నారు.

ప్రతి పంచాయతీకి ఐదుగురు చొప్పున, మండలానికి 150 మంది క్రియాశీల కార్యకర్తలను గుర్తించి జాబితాను రూపొందిస్తున్నారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు యువకులను, మహిళలను రంగంలోకి దించేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ ఉండడంతో వారిని పార్టీలో చేర్పిస్తున్నారు.