6, ఏప్రిల్ 2013, శనివారం

ప్రతి జిల్లా కూడా ప్రత్యేక రాష్ట్రం కావాలంటుంది...

తెలంగాణ డిమాండ్ న్యాయమైనది కాదని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(పీసీఐ) చైర్మన్ జస్టిస్ మార్కండేయ కట్జూ అన్నారు. అది సమంజసం కాదని వ్యాఖ్యానించారు. చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు తాను వ్యతిరేకమని స్పష్టంచేశారు. దక్షిణాది మీడియా సంబంధిత కేసుల విచారణ కోసం హైదరాబాద్ వచ్చిన జస్టిస్ కట్జూ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణపై పలు వ్యాఖ్యలు చేశారు. 

'ఇది న్యాయమైన డిమాండ్ కాదు. కొందరు నేతలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఈ డిమాండ్‌ని ముందుకు తెస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సాధ్యం కాదు. ఒకవేళ తెలంగాణ రాష్ట్రం ఇస్తే, ప్రతి జిల్లా కూడా ప్రత్యేక రాష్ట్రం కావాలంటుంది. దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఇలాంటి డిమాండ్లే వినిపిస్తాయి. ఇలాంటి పరిస్థితులు దేశ సమగ్రతను దెబ్బతీస్తాయి' అని జస్టిస్ కట్జూ వ్యాఖ్యానించారు. 

తెలంగాణలో గతంలో ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవన్నారు. ఆర్థిక అసమానతలు తగ్గాయన్నారు. తాను ఇంతవరకు ఓటు హక్కు వినియోగించుకోలేదని జస్టిస్ కట్జూ ఈ సందర్భంగా తెలిపారు. పార్లమెంట్ సభ్యుల్లో మూడో వంతు మంది నేర చరితులేనని, దేశ ప్రజలు కూడా కులాలవారీగా చీలిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. పాకిస్థాన్‌ను భారత్‌లో కలపాల్సిందేనన్నారు.