19, డిసెంబర్ 2013, గురువారం

ఎవరీ సోనియా? - 1

కాంగ్రెస్‌వారికి 'మేడమ్'
చాలామందికి 'అమ్మ'
కొందరికి 'దేవత'
మరి సోనియా గురించి మీకేం తెలుసు?
సి.నరసింహారావు రాసిన సోనియా గాంధీ వ్యక్తిత్వ విశ్లేషణ ఈ రోజు నుంచి 'ఆంధ్రజ్యోతి'లో!
ఎడ్‌వైజ్ ఆంటోనియో అల్‌బైనా మైనో... ఈమె ఎవరో మీకు తెలుసా??? పోనీ... సోనియా గాంధీ? ఈమె ఎవరో తెలియని వారు కచ్చితంగా ఉండరు. సోనియా గాంధీ అసలు పేరు... ఎడ్‌వైజ్ ఆంటోనియో అల్‌బైనా మైనో! తొమ్మిదేళ్లకుపైగా దేశాన్ని పాలిస్తున్న అధికార కూటమికి ఆమె అధినేత్రి. ప్రపంచంలోని అత్యంత శక్తిమంతమైన మహిళల్లో ఆమెది తొమ్మిదో స్థానం. ఎక్కడో ఇటలీలో సాధారణ అతివగా పుట్టిన సోనియా... ఇండియాలో అత్యంత శక్తిమంతమైన మహిళగా ఆవిర్భవించడం ఒక్కసారిగా జరిగిపోలేదు. అనేక సంఘటనలు ఆమెపై ప్రభావం చూపాయి. సోనియా జీవితంలోని ముఖ్యమైన, ఆసక్తికరమైన ఘట్టాలను ఇప్పటికే పలువురు ప్రముఖులు అక్షరాల్లో నిక్షిప్తం చేశారు. ఆ ఘట్టాలను విశ్లేషిస్తే ఆమె వ్యక్తిత్వం ఏమిటో అర్థమవుతుంది. ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు, మానసిక విశ్లేషకుడు సి.నరసింహారావు ఆ పని చేశారు. గతంలో ఆయన వైఎస్, చంద్రబాబు, జగన్ వ్యక్తిత్వాన్ని విశ్లేషిస్తూ రాసిన వ్యాసాలను 'ఆంధ్రజ్యోతి' ప్రచురించింది. ఇప్పుడు... సోనియా జీవన విశ్లేషణనూ ప్రచురిస్తోంది. సోనియా గురించి ఎందుకు తెలుసుకోవాలంటారా? తొమ్మిదేళ్లుగా దేశ దిశను నిర్దేశిస్తున్న, ఇప్పుడు రాష్ట్ర గతిని శాసిస్తున్న ఆమె గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మరి... తెలుసుకోండి!
ఎవరీ సోనియా?...ఈ ప్రశ్న అడిగితే జనం ఫక్కున నవ్వొచ్చు. కానీ... ఇదే ప్రశ్నను 1999 మే 15వ తేదీన లోక్‌సభ మాజీ స్పీకర్ పీఏ సంగ్మా అడిగారు. "సోనియా గురించి నిజంగా నాకేమీ తెలియదు. తెలిసిన వారు ఇక్కడగానీ, మనదేశంలోగాని ఒక్కరయినా ఉన్నారా?'' అని సంగ్మా ప్రశ్నించారు. అంతే... అక్కడ నిశ్శబ్దం రాజ్యమేలింది. సోనియాకు భారత్ గురించి ఏం తెలుసు? 'ఇండియా' అనగానే ఆమెకు గుర్తొచ్చిన విషయాలు ఏమిటి? రాజీవ్ గాంధీతో పెళ్లి ఎలా జరిగింది? మనమూ తెలుసుకుందాం! ప్రశ్నలతోనే మొదలుపెడదాం!
"అసలెవరీ సోనియా? ఆమె గత చరిత్ర ఏమిటి? అమెకున్న విద్యార్హతలేమిటి? భారతదేశంపట్ల అమెకున్న అవగాహన ఏమిటి? ఇక్కడి ప్రజలు, ఈ భిన్న సంస్కృతులు, విభిన్న భాషల గురించి ఆమెకేం తెలుసు? భారత గ్రామీణ పరిసరాలను గురించి ఆమెకేమయినా తెలుసా? భారత రాజ్యాంగం అమె ఎప్పుడయినా చదివారా? అసలు చదవగలరా? మన స్వాతంత్య్ర పోరాటం గురించి అమెకు లేశమాత్రమయినా తెలుసా? వందకోట్ల ప్రజల ఆశలు, అభిలాషలు, విద్యాసంపద, శక్తి సామర్థ్యాలు, మనందరి ఆత్మగౌరవం, హుందాతనం, నాగరికతా పరిణామ క్రమం ఈ నేలతో అనుసంధానమై ఉన్నాయి. ఇక్కడ పుట్టనివారికి ఈ దేశంలో ఉన్నత పదవిని అలంకరించే అర్హత ఉండదు'' అంటూ 1999వ సంవత్సరం మే 15వ తేదీన బొంబాయిలో పీఏ సంగ్మా కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. శరద్‌పవార్, తారిఖ్ అన్వర్, పీఏ సంగ్మా కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్లి నేషనలిస్టు కాంగ్రెసు పార్టీని స్థాపించడానికి సిద్ధమైన రోజులవి. అక్కడి కార్యకర్తలు అరుపులు, కేకలతో సోనియాను విమర్శించడం పట్ల తమ మద్దతును, సమ్మతిని తెలియజేస్తున్నారు. అప్పుడు సంగ్మా తిరిగి ఇలా అన్నారు. "సోనియాను వివర్శించడంకోసం నేనా మాటలు అనలేదు. సోనియాను గురించి నిజంగా నాకేమీ తెలియదు. తెలిసిన వారు ఇక్కడగాని, మనదేశంలోగాని ఒక్కరయినా ఉన్నారా?'' ఈ ప్రశ్నతో అక్కడ అందరిలో గంభీరతతో కూడిన నిశ్శబ్దం నెలకొంది.
ఆశ్చర్యం ఏమిటంటే, సోనియాగాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టిన పదిహేను సంవత్సరాల తరువాత కూడా.. ఆ గంభీర నిశ్శబ్దం అలానే కొనసాగుతోంది. ఈ పదిహేనేళ్ల కాలంలో ఆమె సొంతంగా ఒక్కటంటే ఒక్క పత్రికాగోష్టి నిర్వహించలేదు. ఒక్క పత్రికకు గానీ, ఒక్క ఛానల్‌కు గానీ ఇంటర్వ్యూ ఇవ్వలేదు. లోక్‌సభలో చదవడం కాకుండా ఒక్కసారి కూడా తనంతట తానుగా ప్రసంగించలేదు. ఈమెపై రాణి సింగ్ రాసిన పుస్తకంలో కూడా, సోనియా ఒక్క పుస్తకం చదివినట్లు అసలు ప్రస్తావించలేదు. కంప్యూటర్‌ను వినియోగించడం అసలామెకు తెలియదు. ఆమెను ఇంతకాలంగా వందలాది మంది కాంగ్రెసు నాయకులు కలిసి అనేక విన్నపాలు విన్నవించుకొన్నారు. అన్నిటికీ తల ఊపడం, ముక్త సరిగా అవును కాదు అని చెప్పడమే తప్ప ఏ నాయకుడు కూడా ఆమె తనతో విపులంగా సంభాషించినట్లు చెప్పడం జరగలేదు. ఇంతటి విశాల భారతదేశంలో, సంక్లిష్ట ప్రజాస్వామ్య వ్యవస్థలో వివిధ కీలక అంశాలపై ఆమెకున్న అభిప్రాయాలు, ఆమె విశ్వసించే విధానాలు, సిద్ధాంతాలు అసలేమయినా ఉన్నాయా? ఇంత కాలంగా బహిరంగంగానే కాదు. పార్టీ ముఖ్యుల వద్ద కూడా, తాను విశ్వసించే రాజకీయ విలువలు, విధానాల గురించి ఆమె ప్రస్తావించిన దాఖలాలేదు. అందుకే సోనియా గాంధీకి ఏ కీలక అంశం పట్ల ఎటువంటి కనీస అవగాహన లేదని నిర్ణయించుకోవచ్చు.
యాభైఏళ్ల వయసు వచ్చే వరకూ, మన దేశంలో ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండి, పైగా రాజకీయాలను చీదరించుకొంటూ, రాజకీయాలకు దూరంగా ఉందామని తన భర్తను ఒప్పించి, జీవితకాలంలో రాజకీయాల జోలికి వెళ్లగూడదని నిర్ణయించుకొన్న సోనియాగాంధీ, అసలు రాజకీయాలపట్ల అవగాహనను ఏర్పరచుకోవడానికీ ఎప్పుడూ ప్రయత్నించలేదు. అంతేకాదు! ఈ దేశస్థితిగతులపట్ల కనీస పరిచయంలేని వ్యక్తికి మనదేశంలో అమలయ్యే ప్రజాస్వామ్యంపట్ల, ఇక్కడి పరిపాలనా వ్యవస్థ, న్యాయవ్యవస్థ, చట్టాలపట్ల అవగాహన ఎలా ఏర్పడుతుంది? అన్నింటికీ మించి క్రమబద్ధమైన విద్యాభ్యాసం లేని సోనియాగాంధీ స్వీయ అవగాహన, ఆలోచనలే నేటి రాజకీ య విశేషాలు గా తనకు తాను పరిగ ణించుకొంటుంటారు.
బాల్యం, విద్యాభ్యాసం
రెండో ప్రపంచ యుద్ధం మొదలయ్యే రోజుల్లో లూసియానా అనే గ్రామం నుంచి ఇటలీ సైన్యంలో జేరిన నిరుపేద యువకుల్లో 'స్టెఫినోమైనో' ఒకరు. సైన్యంలో చేరిన ఆరునెలలకే స్టెఫినోతో సహా చాలామంది రష్యన్ సైన్యానికి పట్టుబడ్డారు. వారందరినీ యుద్ధ క్యాంపులో బంధించి, యుద్ధం ముగిసిన తరువాత రష్యన్ ప్రభుత్వం విడుదల చేసింది. అలా విడుదల అయిన స్టెఫినోమైనో లూసియానా గ్రామంలో తాపీ వృత్తిలో స్థిరపడి పవోలా ప్రెడెబెన్‌ను వివాహమాడాడు. వారి పెద్ద కూతురి పేరు అలెగ్జాండ్రియా. ఆమెను 'అనుష్క' అనే ముద్దుపేరుతో పిలిచేవారు. 1946 డిసెంబరు 9వ తేదీన రెండో కూతురు జన్మించింది. ఆమె పేరు 'ఎడ్‌వైజ్ ఆంటోనియా అల్‌బైనా మైనో'. ఆమెను 'సోనియా' అనే ముద్దుపేరుతో పిలిచేవారు. మూడో కూతురు పేరు నాడియా మైనో. లూసియానా బాగా వెనుకబడిన గ్రామం. అక్కడ పాఠశాల లేదు. రోడ్లు లేవు. ఆ గ్రామంలో దాదాపు అందరూ నిరక్షరాస్యులే! తాపీపని చేసి, వచ్చే కొద్దిపాటి ఆదాయంతో తమ కుటుంబం గడవడం దుర్లభమని గుర్తించిన స్టెఫినో 'అర్‌బస్సానో' అనే చిన్నపట్టణానికి తన కుటుంబంతో సహా 1950లో తరలి వెళ్లారు. అక్కడకు వెళ్లాక ఆయన ఆదాయం పెరిగింది. కానీ, పిల్లలు చదువుకోవడానికి పాఠశాల లేదు. ప్రతివారం స్టెఫినో, ఆయన భార్య క్రమం తప్పకుండా అక్కడ చర్చికి వెళ్లేవారు. ఇంట్లో కఠినంగా, నిరంకుశంగా వ్యవహరించే స్టెఫినో, చర్చి ఫాదర్ వద్ద అతి వినమ్రంగా ఉండేవారు. అన్నిటికీ ఆయన సలహాలు తీసుకొనేవారు. అక్కడ పాఠశాల లేకపోవడంతో ఆ చర్చి ఫాదరే వారానికి ఒకటి రెండు రోజులు అక్కడి పిల్లలను పోగుచేసి అక్షరాలు, చిన్న చిన్న వాక్యాలు రాయడం, చదవడం నేర్పేవారు. అనుష్క అక్షరాలు నేర్చుకోవడంపట్ల ఏమాత్రం ఆసక్తి కనపరిచేది కాదు. కానీ, సోనియా మాత్రం ఆ ఫాదర్ దగ్గరకు క్రమం తప్పకుండా వెళ్లి అక్షరాలు నేర్చుకొంది.
1960లో స్టెఫినో తన ఒక్కడి సంపాదన కుటుంబం గడవడానికి సరిపోవడంలేదని, ఇద్దరు పెద్ద పిల్లలకు పదిహేను సంవత్సరాల వయస్సు వచ్చిందని, వారిని ఎక్కడైనా ఉద్యోగంలో పెట్టించమని చర్చి ఫాదర్‌ను కోరాడు. "ఇటలీలో ఉద్యోగాలు దొరికే సమస్యే లేదు. ఈ దేశం ఆర్థిక పరిస్థితి అధ్వానంగా ఉంది. ఉద్యోగాలు పొరుగు దేశాలైన బ్రిటన్, ఫ్రాన్సులలోనే లభిస్తాయి. అనుష్కకు అక్షరజ్ఞానం లేదు గనుక ఆమెకు ఎక్కడా ఉద్యోగం లభించదు. సోనియా ఇటలీ భాష బాగానే నేర్చుకొంది. కానీ, పొరుగు దేశాలలో చిన్న ఉద్యోగం దొరకాలన్నా ఆయా భాషలు నేర్చుకోవాలి. ఆ భాషలు నేర్చుకొంటే అప్పుడేమయినా ప్రయత్నించవచ్చు'' అని ఆ చర్చి ఫాదర్ వివరించి చెప్పారు.
ప్రస్తుతం నివసిస్తున్న అర్‌బస్సానో పట్టణానికి ముప్పై కిలోమీటర్ల దూరంలో టురిన్ అనే పట్టణంలో క్రైస్తవ సన్యాసినుల (నన్స్) కోసం ఉద్దేశించిన 'ఇస్టిట్యూటో సాంతా తెరిసా' అనే ఒక ప్రాథమిక పాఠశాల ఉంది. చుట్టుప్రక్కల గ్రామాలకు చెందిన యువతులు అక్కడ హాస్టల్లో ఉండి ఐదో తరగతి వరకూ చదువుకొని, తరువాత క్రైస్తవ సన్యాసినులుగా వివిధ ప్రాంతాలకు వెళ్లి జీవనం గడిపేవారు. 1962లో మాధ్యమిక పాఠశాలను, ప్రక్క దేశాలలో ఉపాధికోసం వెళ్లే యువతులకోసం ఇంగ్లీషు, ఫ్రెంచి భాషలను నేర్పే కోర్సులను కూడా ప్రవేశపెట్టారు. చర్చి ఫాదర్ సలహా మేరకు సోనియా ఆ స్కూలులో 1962లో చేరారు. అక్కడ హాస్టల్‌లో ఉంటూ 1964లో విదేశీ భాషల కోర్సును పూర్తి చేశారు. సోనియా ఆ కోర్సు పూర్తి చేసి ఇంటికి వచ్చిన తరువాత ఆమె తండ్రి స్టెఫినో చర్చి ఫాదర్ దగ్గరకు వెళ్లి ఎక్కడైనా ఉద్యోగం ఇప్పించమని కోరారు. ఉద్యోగ ప్రకటనలు చూసి బ్రిటన్, ఫ్రాన్సులలో ఉద్యోగం కోసం చర్చి ఫాదర్ దరఖాస్తులు పంపసాగారు.
ఇంగ్లండులోని కేంబ్రిడ్జి పట్టణంలో ఒక క్రెష్‌లో (పగటి పూట తల్లిదండ్రులు ఉద్యోగాలకు వెళుతూ తమ పిల్లల్ని వదిలిపెట్టి వెళ్లే కేంద్రం) సోనియాకు ఉద్యోగం వచ్చింది. ఆమెకు వచ్చే జీతం బొటాబొటీగా సరిపోయేది. ఇంటికేమీ పంపించలేకపోతున్నానని, ఇంకేదయినా మంచి ఉద్యోగం కావాలంటే ఏంచేయాలని సోనియా తన సహ ఉద్యోగినిని అడిగింది. అప్పుడామె మొహమాటం లేకుండా చెప్పింది. 'నీకు సరైన ఇంగ్లీషు రాదు. ఇంగ్లీషులో చక్కగా మాట్లాడగలిగితే తప్ప ఇక్కడ ఉద్యోగాలు దొరకవు. ఇక్కడ ఒక రిటైర్డు ఇంగ్లీషు ప్రొఫెసరు రోజూ రెండు గంటల చొప్పున ఆరు వారాల్లో ఇంగ్లీషు నేర్పుతున్నాడు. ఆ 'లెనాక్స్‌కుక్ స్కూల్'లో చేరితే నీకు ఇంగ్లీషు వస్తుంది. అప్పుడు మంచి ఉద్యోగం పొందగలవు'' అని తెలిపింది. ఇంగ్లీషు మాట్లాడే వాతావరణం, స్కూలులో క్రమబద్ధమైన బోధనతో చిన్నచిన్న వాక్యాలతో ఇంగ్లీషులో సంభాషించగల చాతుర్యం సోనియాకు అలపడింది. ఆ స్కూల్‌లో సర్టిఫికెట్ రాగానే చాలా ఉద్యోగాల కోసం దరఖాస్తు చేశారు. ఒక నెల లోనే కేంబ్రిడ్జి యూనివర్సిటీలోని ట్రినిటీ కాలేజీలోని కాలేజ్ బార్‌లో ఆమెకు వెయిట్రెస్ ఉద్యోగం వచ్చింది.
అప్పట్లో.. సోనియా దృష్టిలో ఇండియా!
సోనియా తన అక్క అనుష్కకు రాసిన ఒక లేఖను లండన్‌లోని టైమ్స్ పత్రిక చాలాకాలం తరువాత ప్రచురించింది. "ఆయనను మొదటిసారి చూడగానే నా గుండె వేగంగా కొట్టుకోసాగింది. తొలి చూపులోనే ప్రేమంటే ఏమిటో నా అనుభవంలోకి వచ్చింది. ఒక రాకుమారుడు నన్ను వివాహమాడతాడని చిన్నప్పటి నుంచి కన్న కలలు నిజమయ్యాయి. వాళ్ల అమ్మ ఇండియా అనే దేశానికి ప్రధాని. ఇండియా ఎక్కడుందో నాకు తెలియదు. పాములు, ఏనుగులు, అడవులతో నిండిన దేశంగా నాకో అభిప్రాయం ఉంది. నాకా దేశం గురించి ఏదీ స్పష్టంగా తెలియదు'' అంటూ సోనియా రాసిన లేఖ పత్రికలో ప్రచురితమైంది. రాజీవ్ తన ప్రేమ గురించి తల్లితో చెప్పాడు. సోనియాకు సంబంధించిన వివరాలు చెప్పగానే ఇందిరాగాంధీ గట్టిగా తిరస్కరించింది. "ఆ అమ్మాయి అసలేమీ చదువుకోలేదు. తండ్రేమో తాపీ పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తాడు. పుట్టిపెరిగింది ఇటలీలోని మారుమూల గ్రామం. ఇంగ్లీషు కూడా సరిగ్గా రాదు. అటువంటి అమ్మాయి నీకు భార్యగా ఎలా సరితూగుతుంది? మన ఇంట్లో ఎలా సర్దుకోగల్గుతుంది?'' అని ప్రశ్నించారు. తల్లిని ఒప్పించడానికి రాజీవ్ ఏ ప్రయత్నమూ చేయలేదు. లండన్ వెళ్లిన తరువాత, తన తల్లి తమ వివాహానికి అంగీకరించలేదని, నెమ్మదిగా అంగీకరించవచ్చని సోనియాతో చెప్పారు. సోనియా, రాజీవ్ కలిసి లండన్‌లోని అన్ని రెస్టారెంట్లకు వెళుతుండేవారు. భారతదేశం నుంచి వచ్చిన ప్రముఖులు రాజీవ్ ఒక యువతితో కలిసి తరచుగా లండన్‌లో కన్పిస్తున్నట్లు ఇందిరాగాంధీతో చెప్పసాగారు. "రాజీవ్‌గాంధీ అంతర్వర్తనుడు. ఎవరితోనూ కలిసేవాడు కాదు. ఎప్పుడు ముభావంగా, ఒంటరిగా ఉండేవాడు. నేను మొదట్లో ఇటలీ అమ్మాయితో పెళ్ళికి అంగీకరించలేదు. కానీ, వారి మధ్య బలమైన అనుబంధం నెలకొందని గుర్తించాక వారి వివాహానికి అంగీకరించాను'' అని ఇందిరాగాంధీ తన సన్నిహితురాలు పాపుల్ జయకర్‌తో చెప్పారు. ఇందిరాగాంధీ తన అంగీకారాన్ని తెలపగానే సోనియా ఇండియాకు వచ్చారు. ఇందిరాగాంధీ కుటుంబ మిత్రులు అమితాబ్ బచ్చన్ ఇంట్లో సోనియా 1968 జనవరి మొదటివారం నుంచి రాజీవ్‌తో నిశ్చితార్థం జరిగే 25 ఫిబ్రవరి 1968 వరకు ఉన్నారు. తరువాత ప్రధాని నివాసంలోనే వివాహం జరిగింది. మరుసటి రోజు అత్యంత వైభవోపేతంగా హైదరాబాద్ హౌస్‌లో రిసెప్షన్ ఏర్పాటు చేశారు.
"రాజీవ్‌ను మొదటిసారి చూడగానే నా గుండె వేగంగా కొట్టుకోసాగింది. తొలి చూపులోనే ప్రేమంటే ఏమిటో నా అనుభవంలోకి వచ్చింది. ఒక రాకుమారుడు నన్ను వివాహమాడతాడని చిన్నప్పటి నుంచి కన్న కలలు నిజమయ్యాయి. వాళ్ల అమ్మ ఇండియా అనే దేశానికి ప్రధాని. ఇండియా ఎక్కడుందో నా కు తెలియదు. పాములు, ఏనుగు లు, అడవులతో నిండిన దేశంగా నా కో అభిప్రాయం ఉంది. నాకా దేశం గురించి ఏదీ స్పష్టంగా తెలియదు!''
- తన సోదరికి సోనియా రాసిన లేఖ
రాజీవ్ పరిచయం.. వివాహం
అప్పటికి... ట్రినిటీ కాలేజీలో రాజీవ్‌గాంధీ రెండు సంవత్సరాలుగా ఇంజనీరింగ్ చదువుతున్నాడు. క్లిష్టతరమైన ఆ కోర్సు చదవడం పట్ల ఆయనకు ఆసక్తి ఉండేది కాదు. ప్రొద్దున్నే కాలేజీలో ఓ గంట గడిపి బయటకు వచ్చేసేవారు. కాలేజ్ బార్‌లో కూర్చుని కాలక్షేపం చేసేవారు. పొద్దున్న పదిన్నర తరువాత ఆ బార్‌లో విద్యార్థులుగాని, అధ్యాపకులుగానీ ఎవరూ ఉండేవారు కాదు. అక్కడే రాజీవ్‌కు, సోనియాతో పరిచయం ఏర్పడింది.
పేద కుటుంబాలలో బాలికలందరికీ చిన్నతనంలో తల్లులు చెప్పే కథలు ఒకేలా ఉంటాయి. రాకుమారుడు గుర్రంపై వెళుతూ, ఓ పేద యువతి అందం చూసి నిర్ఘాంతపోయి, ఆమెను వివాహమాడడానికి నిర్ణయించుకుంటాడు. ఒక్కసారిగా పేద యువతి యువరాణి అయిపోతుంది. సోనియాకు కూడా చిన్నతనంలో తల్లి, ఇతరులు ఇటువంటి కథలే చెప్పేవారు. తానే ఇలా యువరాణిని అయినట్లు సోనియా కలలు కనేది. సోనియాతో రాజీవ్‌కు బలమైన ప్రేమానుబంధం ఏర్పడిన తరువాత ఆమెకు వివాహమాడతానిని అతను వాగ్దానం చేశారు. ఇంతలో ఆయన కేంబ్రిడ్జి యూనివర్సిటీ విడిచి వెళ్లాల్సి వచ్చింది. అప్పటికి ఇందిరాగాంధీ భారత దేశ ప్రధానమంత్రి. కేంబ్రిడ్జిలో కఠినతరమైన బోధనా నిబంధనలకు రాజీవ్ తట్టుకోలేకపోయాడని గుర్తించి.. లండన్‌లోని ఇంపీరియల్ కాలేజీలో ఆయనను చేర్పించింది. కేంబ్రిడ్జి కాలేజ్ బార్‌లో ఉద్యోగం వదిలి సోనియా కూడా లండన్‌లోని పాకిస్థాన్‌కు చెందిన ఎగుమతి దిగుమతి వ్యాపారి సల్మాన్ తస్సీర్ వద్ద కార్యాలయ కార్యదర్శిగా ఉద్యోగంలో చేరింది. ఈమె తన వద్ద ఉద్యోగానికి పనికిరాదని భావిస్తూ "నీకు వివాహమైందా?'' అని చివరిగా సల్మాన్ ప్రశ్నించారు. 'భారత ప్రధాని కొడుకుతో నా వివాహం నిశ్చయమైంది' అని ఆమె చెప్పగానే, అతను మరో మాట మాట్లాడకుండా ఆమెకు ఉద్యోగం ఇచ్చారు.
(ఒక సాధారణ విదేశీ మహిళ... భారత దేశానికి 'యువరాజు' వంటి రాజీవ్ గాంధీకి జీవిత భాగస్వామిగా మారారు! దేశం కాని దేశంలో, పూర్తిగా కొత్తదైన వాతావరణంలో, అన్నింటికీ మించి... ఒక దేశ ప్రధానమంత్రి కోడలిగా సోనియా గాంధీ ఎలా ఇమడగలిగారు? తనను తాను ఎలా మలచుకున్నారు? అప్పటిదాకా ఆమె ఆలోచనలు ఎలా ఉండేవి? అవి ఎలా మారాయి? ఆమె మాటల్లో వినిపించే 'అమాయకత్వం' గురించి అంతా ఏమనుకునే వాళ్లు?
- See more at: http://www.andhrajyothy.com/node/34753#sthash.Im03UUtN.dpuf