19, డిసెంబర్ 2013, గురువారం

ఎవరీ సోనియా? 5

'తెలుగు వాళ్లంటే' సోనియాకు కోపమా? అది... పీవీ నరసింహారావు నుంచే మొదలైందా? లేక... అంతకుముందు నుంచేనా? ఆమె కోపానికి కారణమేమిటి? రాష్ట్రాన్ని విభజించి తీరాల్సిందే అన్న పట్టుదల ఎక్కడి నుంచి వచ్చింది? సి.నరసింహారావు రాసిన 'సోనియా జీవన విశ్లేషణ'లో చివరి భాగం...
రాజీవ్‌గాంధీ ప్రధాని అయిన తరువాత లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టే సభ్యులెవరని అడిగితే... దక్షిణాదిన తెలుగు అనే భాష మాట్లాడే రాష్ట్రం నుంచి వచ్చిన ఎంపీలని సోనియాకు తెలిసింది.
కాంగ్రెస్ పార్టీ ఇతర మిత్రపక్షాలతో కలసి 2004లో ప్రభుత్వం ఏర్పరచగానే సోనియాగాంధీ జాతీయ సలహామండలి (ఎన్ఏసీ) ఏర్పరిచారు. రాజకీయవాదులెవరికీ అందులో స్థానం కల్పించకుండా ఉన్నత విద్యావంతులు, సమాజసేవలో దీర్ఘకాలంగా పాల్గొన్నవారికే సభ్యత్వం ఇచ్చారు. వివిధ విధానాలకు ఆ సలహామండలి రూపకల్పన చేస్తుంది. ప్రభుత్వం వాటిని చేపడుతుంది. పది సంవత్సరాలుగా మన్మోహన్ సింగ్ ప్రభుత్వం అనేక విధాన నిర్ణయాలు తీసుకున్నప్పుడు కొందరు సిద్ధాంతకర్తలు మాత్రమే వాటితో విభేదించారు. కానీ, లక్షలాదిగా ప్రజలు వీధుల్లోకి వచ్చి, అతి తీవ్రస్థాయిలో విభేదించిన నిర్ణయం ఒకే ఒక్కటి తీసుకోవడం జరిగింది. అదే... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన. సోనియా చొరవతో, పట్టుదలతో తీసుకున్న నిర్ణయం ఇది. ఆమె సొంతంగా తీసుకున్న నిర్ణయం ఇది తప్ప మరొకటి లేదని చెప్పవచ్చు. సోనియాకు రాజకీయాలపైగల ఏవగింపువల్ల అసలు దినపత్రికలను ముట్టుకోరు. తన చుట్టుపక్కల ఉన్నవాళ్లు మాట్లాడే హిందీ తప్ప... భారతదేశంలోని ఇతర ప్రధాన భాషల గురించి ఆమెకు ఇసుమంతయినా తెలియదు. రాజీవ్‌గాంధీ ప్రధాని అయిన తరువాత లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టే సభ్యులెవరని అడిగితే... దక్షిణాదిన తెలుగు అనే భాష మాట్లాడే రాష్ట్రం నుంచి వచ్చిన వారని ఆమెకు తెలిసింది.
సోనియా 1983లో పౌరసత్వం తీసుకోవడం గురించి, పౌరసత్వం తీసుకోకుండానే 1980లో ఆమె ఓటరుగా చేరడం గురించి లోక్‌సభలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఉపేంద్ర చాలా ఘాటుగా విమర్శించారు. ఆ విమర్శలతో ఆమె ఎంతగా గాయపడ్డారంటే... హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో ఉపేంద్ర ఎదురుపడినప్పుడు 'నీ అంతు చూస్తా' అని హెచ్చరించారట! దీనిపై లోక్‌సభలో గందరగోళం జరిగింది. తరువాత బోఫోర్స్ కుంభకోణం గురించి తెలుగుదేశం సభ్యులే ప్రధానంగా లోక్‌సభలో లేవనెత్తారు. సోనియా పాత్రను ప్రస్తావించారు. అసలు ఖత్రోకీ ఎవరని ప్రశ్నించారు. తెలుగుదేశం ఆనాడు లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్షంగా ఉండేది. సభలో మాట్లాడే అవకాశం వారికే ఎక్కువగా వచ్చేది. వారితో ఇతర ప్రతిపక్షాలు జత కలిసేవి. ప్రతిపక్షంలో ఉన్న జైపాల్‌రెడ్డి (ఇప్పుడు కాంగ్రెస్ ఎంపీ, కేంద్రమంత్రి) బోఫోర్స్‌పై తీవ్ర విమర్శలు గుప్పించగా... రాజీవ్‌గాంధీ అమిత క్రోదంతో 'మీకు శారీరక వైకల్యమే కాదు, మానసిక వైకల్యం కూడా ఉంది' అని మండిపడ్డారు.
దీనిపై పార్లమెంటులో పెద్ద దుమారం చెలరేగింది. వి.పి.సింగ్ కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్లడం, ప్రతిపక్షాలన్నీ కలసి కూటమిగా ఏర్పడడం, ఆ కూటమి ఏర్పాటుకు తెలుగుదేశం చొరవ తీసుకోవడం వంటివి సోనియాకు తెలుగువారిపై తీవ్ర ఆగ్రహం కలగడానికి కారణమయ్యాయి. దానికి తగ్గట్టే, ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపికైన ఒక మహిళా ఎంపీ రాజీవ్‌కు అతి సన్నిహితంగా ఉంటుందన్న వార్తలు సోనియాను అమితంగా కలచివేశాయి. సోనియా జాతీయ సలహా మండలి చైర్మన్‌గా లాభదాయక పదవిలో ఉన్నందున... ఆమె లోక్‌సభ సభ్యత్వం రద్దుచేయాలని టీడీపీ నేత ఎర్రన్నాయుడు గళమెత్తారు. ఇతర విపక్ష సభ్యులూ ఈ అంశాన్ని లేవనెత్తారు. దీంతో జాతీయ సలహామండలి అధ్యక్ష పదవితోపాటు లోక్‌సభ సభ్యత్వానికీ 2006లో రాజీనామా చేయాల్సి రావడం సోనియాను తీవ్రంగా కలచివేసింది. ఆ తర్వాత ఆమె తిరిగి లోక్‌సభకు పోటీచేసి ఎన్నికయ్యారు.
ఇక 1991లో విధిలేని పరిస్థితుల్లో పి.వి.నరసింహారావును తాను ప్రధానిని చేస్తే, ఆయన తననేమాత్రం ఖాతరు చేయకపోవడంతోపాటు తనగురించి చులకనగా మాట్లాడుతున్నట్లు తెలుసుకుని ఆమె ఖిన్నురాలయ్యారు. తన పట్ల ఎన్నడూ కృతజ్ఞతాభావం చూపలేదనే కోపంతో పీవీపై ఆమెలో ద్వేషం పెరిగింది. తాము కేంద్రంలో, రాష్ట్రంలో తిరిగి అధికారానికి వచ్చిన తరువాత రాష్ట్రానికి రాజశేఖర రెడ్డిని ముఖ్యమంత్రిని చేయగా... ఆయన ఎవరినీ ఖాతరు చేయకుండా స్వతంత్రంగా వ్యవహరించడం, అనేక ఆరోపణలు రావడం, 2009 ఎన్నికలకు ముందు రాష్ట్రాన్ని రెండుగా విభజించాలని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టాలని ఆమె ఆదేశించినా ఖాతరు చేయకుండా రోశయ్య కమిటీని ఏర్పాటు చేయడం వంటి అనుభవాలతో తెలుగువారి పట్ల సోనియాకు తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. 'నిజాయతీగల క్రైస్తవులు తాము ఇచ్చిన మాటకు ఎప్పటికీ కట్టుబడి ఉంటారు' అని సోనియాకు తన చిన్నతనం నుంచి తల్లి, తండ్రి చెప్పేవారు.
"ఆంధ్రప్రదేశ్‌ను విభజించి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇస్తానని నేను వాగ్దానం చేశాను. రాష్ట్రంలో రెండోసారి అధికారానికి వచ్చిన తరువాత అయినా ఆ మాట నిలబెట్టుకోవాలి'' అని సోనియా పార్టీలో కీలకమైన వ్యక్తులకు రెండుమూడు సార్లు చెప్పారు. ఆమె ఈ అంశానికి ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో దీనిద్వారా వారికి అర్థమైంది. 2009లో తాను తీసుకొన్న విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరాహార దీక్ష చేసిన ఆంధ్రా ఎంపీకి అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆమె అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు. ఆయన రాజీవ్‌గాంధీ ఫౌండేషన్‌కు పెద్ద మొత్తం విరాళంగా పంపితే దాన్ని తిప్పికొట్టారు. రాష్ట్ర విభజనపై ఆమె ఎంత పట్టుదలగా ఉన్నారో ఇంతకన్నా వేరే చెప్పనవసరం లేదు.
తెలివితక్కువ వ్యక్తులు కీలక స్థానాల్లో ఉన్నా, కీలక నిర్ణయాలు తెలివి తక్కువగా తీసుకుంటున్నా ఈ ప్రభుత్వం, ప్రజాస్వామ్య వ్యవస్థ ఎలా ముం దుకు సాగుతున్నాయన్న అనుమానం ప్రతి ఒక్కరికీ కలుగుతుంది. ఆ సందేహాన్ని నివృత్తి చేస్తూ ప్రఖ్యాత చరిత్రకారుడు అర్నాల్డ్ టాయన్‌బీ తన 'స్టడీ ఆఫ్ హిస్టరీ' గ్రంథంలో ఇలా చెబుతారు. "మానవ చరిత్రలో వేలాది సంవత్సరాలు కొనసాగిన రాచరిక వ్యవస్థలో, అత్యధిక శాతం రాజులు అవివేకులే అయి ఉండేవారు. అయినా ఆయా రాజ్యాల పురోగతికి ఆ రాజుల అవివేకం అడ్డుకాలేదు''.
ఇదీ చదువు...
సోనియా స్వయంగా అంగీకరించిన ప్రకారం... ఆమె కళాశాల, విశ్వవిద్యాలయ స్థాయి చదువులేవీ చదవలేదు. పదో తరగతి, ఇంటర్, డిగ్రీవంటి అర్హతలు ఆమెకు లేవు. ఆమె పూర్తి చేసింది... సాంతా తెరెసా ఇన్‌స్టిట్యూట్‌లో మూడేళ్ల విదేశీ భాషల (ఇంగ్లిషు, ఫ్రెంచ్) కోర్సు. కేంబ్రిడ్జిలోని లెనాక్స్ కుక్స్ స్కూలులో ఇంగ్లిషుపై సర్టిఫికెట్ కోర్సు. పొరుగు దేశాలలో ఉపాధికోసం వెళ్లే యువతుల కోసం సాంతా తెరెసాలో ఇంగ్లిషు, ఫ్రెంచి భాషలను నేర్పే కోర్సులు ప్రవేశపెట్టారు. ఇక.. కేంబ్రిడ్జిలోని లెనాక్స్‌కుక్ స్కూల్‌ను రిటైర్డ్ ప్రొఫెసర్ ఒకరు నడిపేవారు. ఇంగ్లిషు, ఫ్రెంచి భాషలను సోనియా ఇతర దేశాల్లో తన ఉద్యోగావకాశాలను మెరుగుపరచుకునేందుకే నేర్చుకున్నారు.
భాషా వ్యాసంగం..
మొదట్లో... సోనియా సాధారణ విషయాలను, తన మదిలోని భావాలను ఇంగ్లిషులో సరిగ్గా వ్యక్తం చేయలేకపోయేవారు. ఆమె చెప్పిన అంశాలను అర్థం చేసుకోవడానికి ఇందిరాగాంధీ ఇంకో రెండుమూడు ప్రశ్నలు అడగాల్సి వచ్చేది. ఇది ఆమెకు చాలా చికాకు కలిగించేది. అందుకే పనివారితో, ఇతరులతో మాట్లాడడానికి వీలుగా హిందీ నేర్చుకోవాలని సోనియాను ఇందిర ఆదేశించారు. అతి ప్రవీణురాలైన ఒక టీచరును కూడా ఇందుకోసం నియమించారు. ఆ అధ్యాపకురాలు, సోనియాకు హిందీ అక్షరాలు నేర్పడానికి నెల రోజులపాటు ప్రయత్నించింది. అయినా, సోనియా మనస్సుకెక్కలేదు. సోనియా కూడా ఇలా నేర్చుకోవడం తనవల్ల కాదని తేల్చేశారు. ఇతరులతో వచ్చీరాని హిందీలో మాట్లాడడం మొదలుపెడితే, క్రమంగా ఆ భాష వచ్చేస్తుందని సోనియా ఒక నిర్ణయానికి వచ్చి, ఆ ఉపాధ్యాయురాలిని మాన్పించి వేశారు.
సోనియాగాంధీ విపరీత మనస్తత్వం గలవారు కాదు. అపసవ్య ఆలోచనా ధోరణిగలవారు అసలేకాదు. అయితే ఆమెకెందులోనూ కించిత్ పరిజ్ఞానం లేదు.ఏ అంశాన్నీ అవగతం చేసుకోలేరు. పైగా భారత సమాజం గురించి కనీస అవగాహన లేదు. ఎటువంటి విలువలకూ కట్టుబడి ఉండాలన్న నిబద్ధత లేదు. ఎవరికైనా... అసలు అవగాహనే కనీస స్థాయిలో ఉన్నప్పుడు అవగాహనను పెంచుకోవాలన్న కాంక్ష అంతకంటే కనీస స్థాయిలో ఉంటుంది.
- See more at: http://www.andhrajyothy.com/node/36059#sthash.V84JwTmq.dpuf