19, సెప్టెంబర్ 2012, బుధవారం

30 సంవత్సరాల 'మేఘసందేశం'

చక్కని నాటకీయత, వినసొంపైన పాటలతో, కుటుంబం పరువు ప్రతిష్ఠలు గురించి ఆలోచించే వ్యక్తులు, సెంటిమెంట్స్‌తో అక్కినేని దాసరి నారాయణరావు కాంబినేషన్లో రూపుదిద్దుకుని కళాత్మక చిత్రం 'మేఘసందేశం'. దాసరి నారాయణరావు గానీ, కె. రాఘవేంద్రరావు గానీ సంగీత ప్రధానమైన కళాత్మక చిత్రం ఏదైనా తీసారా అని అభిమానులు విజయవాడలో ఓ సినిమా పంక్షన్‌ తర్వాత వాదోపవాదాలకి తీవ్రంగా దిగడంతో ఇది విన్న తర్వాత దాసరి, రాఘవేంద్రరావు ఆ దిశగా ఆలోచించే ప్రయత్నం చేసారు. కొంతకాలానికి దాసరి అక్కినేని నాగేశ్వరరావుతో మేఘసందేశం'. చాలా కాలం తర్వాత నాగార్జునతో కె. రాఘవేంద్రరావు 'అన్నమయ్య' చిత్రాలు రూపొందించడం ఈ రెండు చిత్రాలు విశేష ఆదరణ పొందడం విశేషం.
4-9-82న సెన్సార్‌ శాఖ నుంచి 'యు' సర్టిఫికెట్‌ని కట్స్‌ లేకుండా లభించగా సెప్టెంబర్‌ 1982లో విడుదలైన 'మేఘసందేశం' 24వ తేదీతో 30 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.
అక్కినేని నాగేశ్వరరావు, జయసుధ, జయప్రద, జగ్గయ్య, మంగళంపల్లి బాలమురళికృష్ణ, సుభాషిణి ముఖ్యతారాగణం. తారక ప్రభు ఫిలింస్‌ పతాకాన దాసరి పద్మ నిర్మించగా సంగీతం రమేష్‌నాయుడు, ఛాయాగ్రహణం పి.ఎన్‌.సెల్వరాజ్‌ సమకూర్చారు. కథ మాటలు స్క్రీన్‌ప్లే దర్శకత్వం దాసరి నారాయణరావు సమకూర్చారు. 2 జయదేవ్‌ గీతాలు, 4 దేవులపల్లి కృష్ణశాస్త్రి గీతాలు, 4 వేటూరి పాటలు రాయగా, జేసుదాస్‌, సుశీల, మంగళంపల్లి బాలమురళికృష్ణ ఆలపించారు.
జేసుదాస్‌ పాడిన 'ఆకాశ దేశాన ఆషాడ మాసానా.... ప్రియే చారుశీలే... నవరస సుమ మాలికా.... బాల మురళీకృష్ణ ఆలపించిన 'పాడనా వాణి కళ్యాణిగా... పి సుశీల పాడిన ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై... ముందు తెలిసినా ప్రభూ...సిగలో అవి విరులో... శీతవేళ రానీయకు శిశిరానికి చోటీయకు... నిన్నటి దాకా శిలనైనా... జేసుదాస్‌, సుశీల కలసి ఆలపించిన రాధికా కృష్ణా రాధికా... గీతాలు హిట్‌ కావడమే కాక పలు ప్రశంసలు పొందాయి. జాతీయస్థాయిలో ఉత్తమ ప్రాంతీయ చిత్రం, ఉత్తమ సంగీత దర్శకత్వం, ఉత్తమ నేపథ్య గాయని, ఉత్తమ నేపథ్య గాయకుడు అవార్డులు సాధించింది 'మేఘసందేశం'. రాష్ట్రస్థాయిలో ఉత్తమ చిత్రంగా, ఉత్తమ నటుడు (అక్కినేని) ఉత్తమనటి (జయసుధ), ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ ఛాయాగ్రాహకుడు, ఉత్తమ గీత రచయిత (దేవులపల్లి), ఉత్తమ గాయకుడు (జేసుదాస్‌), ఉత్తమ గాయని, ఉత్తమ ఆడియో గ్రాఫర్‌ అవార్డులు లభించాయి. ఇండియన్‌ పనోరమ, మాస్కో అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలోనూ ప్రదర్శితమై ప్రముఖుల ప్రశంసలు పొందింది.
చక్కగా సంసార జీవితాన్ని గడిపే రవీంద్రబాబు (అక్కినేని నాగేశ్వరరావు) కవి, మంచి మనసున్న వ్యక్తి. ఈయన భార్య జయసుధ, బావమరిది జగ్గయ్య. ఒకానొక సందర్భంలో దేవదాసి (జయప్రద) కనిపించడంతో రవీంద్రబాబులో కవితావేశం, సృజనాత్మక భావాలు మరింత పెంపొందుతాయి. జయప్రదతో వుండడం, ఆ తర్వాత కుటుంబ పరంగా మనస్పర్థలు రావడంతో కథ మలుపులు తిరుగుతుంది.