19, సెప్టెంబర్ 2012, బుధవారం

సీనియార్టీకి ఏదీ గౌరవం!

ఏదైన ఉద్యోగానికి సంబంధించిన ప్రకటన చదివితే అందులో అనుభవం ఉన్నవారికే తొలి ప్రాధాన్యత అని తప్పకుండా ఉంటుంది. అనుభవం వల్ల సంస్థ పనితీరు బావుంటుందనేది వారి అభిప్రాయం. ఏ రంగంలో అయినా సరే అనుభవానికే పెద్దపీట వేస్తారు. చివరికి డ్రైవర్‌ ఉద్యోగానికి సైతం అనుభవం కావాలి. అయితే ఎలాంటి అనుభవం అవసరం లేని రంగం ఒకటుంది. అదే చిత్రరంగం. ఇక్కడ అనుభవం కంటే కొత్తవారికే ప్రాధాన్యత ఎక్కువ. కళారంగంలో కొత్తవారికి అవకాశాలు ఇవ్వడం సబబే అయినప్పటికీ, సీనియర్లను పక్కన పెట్టడం సరికాదు. నేటి స్టార్లు, సూపర్‌స్టార్లు, మెగాస్టార్లు ఇలాంటి సీనియర్ల చలువ వల్లే నేడున్న స్థానాన్ని పొందగలిగారనేది అందరూ అంగీకరించేదే. చరిత్ర చెప్పుకునే చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన పలువురు సీనియర్‌ దర్శకులు ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటున్నారు. అపారమైన వారి అనుభవం దేనికీ ఉపయోగపడడం లేదు. నాడు కొత్తవారిని ప్రోత్సహించి, వారు నిలబడడానికి దోహదం చేసిన వారున్నారు. అలాగే కొత్తగా వచ్చిన వారికి స్టార్‌ ఇమేజ్‌ తెచ్చిపెట్టిన పాత్రలను ఇచ్చినవారున్నారు. మహిళా ప్రేక్షకులను కంట తడిపెట్టించిన చిత్రాలను, మాస్‌ ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించిన సినిమాను, విమర్శకులను సైతం ఆలోచింపజేసిన చిత్రాలను అందించిన మహనీయ దర్శకుల అనుభవం ఎందుకు ఉపయోగపడకుండా పోతోంది. పరిశ్రమ బాగుకోసం, మంచి సినిమాల నిర్మాణం కోసం వారి సలహాలు తీసుకునే ఆలోచనే పరిశ్రమకు లేదు. ఆధునిక పరిజ్ఞానం పాతవారికి తెలియదని చులకనగా చూసే వారికి, నేటి కంప్యూటర్లు లేనప్పడే మాయలు, మంత్రాల చిత్రాలను అందించిన ఘనత వారిదని గ్రహించలేకపోతున్నారు. కేవలం ఒకటి రెండు సక్సెస్‌లు అందించి కొత్త నిర్మాతలకు నిర్మాణంలో మెళకువలు నేర్పిస్తామంటూ ఆర్భాటంగా ప్రకటించుకునే నిర్మాతలు సీనియర్లను కేవలం ట్రంకు పెట్టెలో దాచిపెట్టే ఆస్థిగానే చూస్తున్నారు. మరికొందరైతే వారి సేవలకు గౌరవం కల్పించాలి ముఖ్య కో డైరక్టర్‌ అంటూ ప్రత్యేక పోస్ట్‌ను సృష్టించి వాడుకుంటున్నారు.
సినిమా అంటేనే కల్పితం ఇక్కడ అనుబంధాలు, ఆప్యాయతలు అన్నీ తెరపైనే చూపిస్తారు కానీ, నిజ జీవితంలో ఉండవని అంటారు. తమ కెరీర్‌కు అద్భుతమైన పునాదులు వేసిన దర్శకులను చివరి రోజుల్లో పలకరించడానికి సైతం హీరోలు ఇష్టపడరు. తమ తొలిచిత్రం దర్శకుడని చెప్పడానికి ఆసక్తి చూపించరు. ఈ రంగం గురించి విపులంగా తెలిసిన వారంతా ఇదంతా మామూలే అని తేలిగ్గా కొట్టిపారేస్తారు.
సీనియర్ల సేవలను దూరం చేసుకోవడం వల్ల తెలుగులో అద్భుత చిత్ర రాజాలు వస్తున్నాయా అంటే లేదనే సమాధానం వస్తుంది. ఇప్పటికీ ఘనంగా చెప్పుకునే పాత చిత్రాల సృష్టికర్తలు మనముందే ఉన్నప్పటికీ వారికి ఏ విధంగానూ గౌరవించలేకపోతున్నారు.
పరిశ్రమనే కాదు సీనియర్లకు ప్రభుత్వ పరంగా లభిస్తున్న గౌరవం కూడా తక్కువే. దాసరి నారాయణరావు, కె.రాఘవేంద్రరావు వంటి దర్శకులకు ఇప్పటికీ పద్మశ్రీ పురస్కారం లభించలేదంటే ఆశ్చర్యం కలిగిస్తుంది. పొరుగు రాష్ట్రాల్లో తప్పటడుగులు వేస్తున్న వారికి సైతం ఇలాంటి గౌరవం దక్కింది. ఇలాంటి అనేక విషయాల్లో తెలుగు సీనియర్లకు జరుగుతున్న అన్యాయం గురించి పరిశ్రమ పెద్దలు మాట్లాడితే బావుంటుంది.
శతాధిక చిత్రాల సృష్టికర్తలు దర్శకరత్న దాసరి నారాయణరావు, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు పరిశ్రమకు రెండు కళ్ళలాంటివారు. నేటి యువదర్శకుల చిత్రాలకు వారి చిత్రాలే ప్రేరణ. కొత్తతరం సాధిస్తున్న విజయాలు చూస్తూ పాతతరం కూడా వారితో పోటీపడడానికి ముందుకు రావడానికి ఉత్సాహపడుతుంది. మధ్యతరగతి జీవితాల్లోని సంఘర్షణకు వెండితెర రూపం ఇచ్చి అనేక చిత్రాలను సృష్టించి భారతీయ సినిమా రంగానికే ఆదర్శంగా నిలిచిన దాసరి నారాయణరావు ఏడాదిగా మెగా ఫోన్‌ పట్టడం లేదు. ఆయన శిష్యగణంలో కొందరు మాత్రం చిత్రాలు తీస్తూ వస్తున్నారు.
మాస్‌ ప్రేక్షకుల పల్స్‌ పట్టుకుని, హీరోలకు గ్లామర్‌ నగిషీలు చెక్కిన కమర్షియల్‌ చిత్రాల సృష్టికర్త కె.రాఘవేంద్రరావు పదేళ్ళ క్రితమే తన పంథా మార్చేశారు. రక్తి చిత్రాల నుండి భక్తి చిత్రాలకు మారారు. అయినప్పటికీ స్టార్‌ హీరోలతో భక్తిని ప్రేక్షకులకు చూపిస్తూ 'అన్నమయ్య, శ్రీరామదాసు', తాజాగా 'శిరిడిసాయి' అందించారు. మధ్యలో 'గంగోత్రి, ఝమ్మందినాదం' అంటూ తనదైన తరహా చిత్రాలు అందించినప్పటికీ, భక్తి చిత్రాలు ఆయన సెకండ్‌ ఇన్నింగ్‌లో మంచి పేరు తెచ్చిపెట్టాయి. దర్శకుడిగా గ్యాప్‌ తీసుకోకుండా సినిమాలు చేస్తూ వస్తున్నారు.
కళాత్మక చిత్రాల సృష్టికర్తలు బాపు, కె.విశ్వనాథ్‌ అడపాదడపా తమ తరహా సినిమాలు తీస్తూనే ఉన్నారు. ఇటీవలే బాపు 'శ్రీరామరాజ్యం' చిత్రం ద్వారా నేటి యువతరం ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్నారు. కె.విశ్వనాథ్‌ ఆ మధ్య 'శుభప్రదం' అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఇది సంగీతం, నాట్యం ప్రధానాంశాలుగా తీసిన సినిమానే.
దక్షిణాదిలో పలు అద్భుత చిత్రాలు తీసిన సింగీతం శ్రీనివాసరావు ఇటీవల గ్యాప్‌ తీసుకున్నారు. 'ఘటోత్కచ' యానిమేషన్‌ సినిమా నిరాశపరిచింది. అయితే ఆయన గతంలో తీసిన 'ఆదిత్య 369' చిత్రానికి సీక్వెల్‌ తీస్తారని ప్రచారం జరుగుతోంది. క్రీస్తుకు సంబంధించిన చిత్రంలో కొంతవర్క్‌ జరిగింది.
ఇటీవలే 'అరుంధతి' వంటి విజయవంతమైన చిత్రాన్ని అందించిన కోడిరామకృష్ణ తదుపరి చిత్రం కోసం వెతుక్కోవాల్సి వచ్చింది. గ్రాఫిక్స్‌ సినిమాలను అందించిన ఘనత ఆయనది. శతాధిక చిత్రాలు తీసినా అలుపెరుగని ఉత్సాహంతో చిత్రాలు రూపొందిస్తుంటారు. తాజాగా పుట్టపర్తి సాయిబాబు జీవిత చరిత్రను తెరకెక్కిస్తున్నారు. గ్రామీణ చిత్రాలంటే పి.సి.రెడ్డి సినిమా చూడాల్సిందే. ఎందరో శిష్యులను తయారుచేసి పరిశ్రమకు అందించిన పి.సి.రెడ్డి అనుభవానికి తగిన చిత్రం చేసే అవకాశం చాలాకాలంగా రావడం లేదని చెప్పవచ్చు. ఈ మధ్య తీసిన రెండు చిత్రాలు నిలబడలేదు.
కామెడీ చిత్రాలకు కేరాఫ్‌ రేలంగి నరసింహారావు సినిమాలు. 'నేను మా ఆవిడ' నుండి వరుసగా ఆయన ఈ తరహా చిత్రాలే అందించిన తన ఇంటిపేరును సార్థకం చేసుకున్నారు. ఇతర దర్శకులకు భిన్నంగా సినిమాలు ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తారు. కామెడీ చిత్రాలు తీసేవారికి ప్రేరణగా నిలిచారు. రేలంగి కొంతకాలంగా కొత్త చిత్రాలేవీ చేయడం లేదు. ఆయన సేవలనూ పరిశ్రమ ఉపయోగించుకోవడం లేదు.
'పవిత్రబంధం, పెళ్ళిచేసుకుందాం' విమర్శకుల ప్రశంసలు పొందిన అభ్యుదయ చిత్రాలు. చిరంజీవితో 'అన్నయ్య, హిట్లర్‌' చిత్రాలు అందించిన చరిత్ర ఉన్న దర్శకుడు ముత్యాల సుబ్బయ్య. సెంటిమెంట్‌ పండించడంలో దిట్ట. మధ్యతరగతి కథలతో ఆయన తీసిన 'అమ్మాయి కాపురం, కలికాలం' వంటి చిత్రాలు ఆలోచింపజేసేవే. కొంతకాలంగా 'ముత్యాల సుబ్బయ్య' విరామం తీసుకున్నారు.
తెలుగు సినిమా చరిత్రలో తొలి బిగ్గెస్ట్‌ హిట్‌ సినిమా 'పెదరాయుడు'. సంచలన విజయం సాధించిన 'చంటి, యుముడికి మొగుడు', కంటతడి పెట్టించిన 'పుణ్యస్త్రీ' వంటి చిత్రాల దర్శకుడు రవిరాజా పినిశెట్టి చాలా కాలంగా మెగాఫోన్‌కు దూరంగా ఉన్నారు. తరం మారడమే ఇందుకు కారణమా?.
దర్శకురాలిగా గిన్నిస్‌ బుక్‌లో స్థానం సంపాదించుకున్న విజయనిర్మల ఎందరో మహిళలకు ప్రేరణ కలిగించిన దర్శకురాలు. నవలా చిత్రాలను, గ్రామీణ కథాంశం ఉన్న సినిమాలను ఆమె అందించారు. విజయం సాధించారు. కొద్దిరోజుల క్రితమే 'నేరము- శిక్ష' పేరుతో చిత్రం తీశారు. ఆమె ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. మంచి కథ లభిస్తే సినిమా చేయడానికి సిద్ధమే అంటున్నారు.
'న్యాయంకావాలి' చిత్రం తర్వాత ఎ.కోదండరామిరెడ్డి తీసిన 'ఖైదీ' ఘనవిజయం సాధించింది. చిరంజీవిని స్టార్‌ని చేసింది. అప్పటి నుండి కోదండరామిరెడ్డి పేరు చెబితే కమర్షియల్‌ సినిమాకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారారు. క్షణం తీరిక లేకుండా అందరి హీరోలతో చిత్రాలు తీసిన కోదండరామిరెడ్డి శత చిత్రాలకు చేరువలో ఉన్నారు. ఇప్పుడాయన చేతిలో సినిమాలే లేవు. నాడు ఆయన డేట్స్‌ కోసం వెంటపడిన హీరోలు ఇప్పుడు ముఖం చాటేస్తున్నారు.
ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా అనేకమంది ఉన్నారు. కొత్తతరం వస్తే పాతతరం పక్కకి తప్పుకోవాలనేది నిజమే అయినప్పటికీ, వారి సేవలను ఉపయోగించుకుంటే పరిశ్రమలో మరిన్ని ఆరోగ్యవంతమైన చిత్రాలు రావడానికి దోహదపడినట్టు అవుతుంది. నేటి చిత్రాల ఫలితాలు ఎలా ఉంటున్నాయనేది తెలిసిందే. నేటి ఆధునిక యువత మెచ్చే చిత్రాలు పాతతరం దర్శకులు తీయలేనేది అపోహ మాత్రమే. కె.రాఘవేంద్రరావు తీసిన 'ఝుమ్మందినాదం', 'అన్నమయ్య'. 'శిరిడిసాయి', బాపు తీసిన 'శ్రీరామరాజ్యం', కోడి రామకృష్ణ అందించిన 'అరుంధతి' వంటి చిత్రాలు ఎలాంటి సంచలన విజయం సాధించాయో తెలిసిందే. నేటితరం దర్శకులకు తెలిసింది కేవలం ఖర్చు పెట్టడమే. ఆ తరానికి తెలిసింది పెట్టిన ఖర్చు తెరపై కనిపించేలా చేయడం. ఇలాంటి వ్యత్యాసం ఉంది కాబట్టి ఆ తరం సినిమాలను ఇప్పటికీ ఉదాహరణగా చెప్పుకుంటున్నాం. అందువల్ల ఎవరిగౌరవం వారిదే.

- రామనారాయణరాజు