19, సెప్టెంబర్ 2012, బుధవారం

అపోహలు మధ్య సమంత

వివాదాలు, అనుమానాలు, అపోహలు వీటి మధ్య నటి సమంత కెరీర్‌ కొనసాగుతోంది. ఐదు నెలలుగా 'ముఖం చాటేసిన సమంత ఇటీవల చెన్నైలో మీడియా ముందు ప్రత్యక్షమయింది. కొద్దిరోజులుగా కారణాలు చెప్పకుండానే సినిమాలు వదిలేసుకున్న సమంత ఆరోగ్యంపై రకరకాల వదంతుల షికారు చేశాయి. ఆమె అనారోగ్యంతో ఉన్నారని, కాదు స్కిన్‌ సమస్య వల్ల ముఖంపై మచ్చలు వచ్చాయని ఈ కారణం చేతనే సినిమాలు వదిలేసుకుందని అంటున్నారు. అగ్రదర్శకుడు శంకర్‌, మణిరత్నం చిత్రాలను సైతం సమంత వదులుకుంది. ఇద్దరు పెద్ద దర్శకుల సినిమాలు కూడా కాదనుకోవడంతో ఆమె ఇప్పుడు తీవ్ర సమస్యతో బాధపడుతోందని వదంతులు పుట్టుకొచ్చాయి. వీటిని సమర్థిస్తున్నట్లుగా తన వ్యక్తిగత సిబ్బందికి సైతం ఆమె కొద్దిరోజులు సెలవు మంజూరు చేశారు. ఈ ఐదు నెలలూ సమంత మీడియా ముందుకు రాలేదు. అయితే పక్షం రోజుల నుండి ఆమె షూటింగ్‌ చేస్తున్నట్లుగా సమాచారం అందింది. పూర్తి ఆరోగ్యవంతురాలుగా తిరిగివచ్చి తన పాత కమిట్‌మెంట్‌ను పూర్తి చేయడానికి సిద్ధమైంది. సమంత వెనకడుగు వేయడంతో ఆమె పోటీదారులు 'కాజల్‌, తమన్నా' కొంత రిలాక్స్‌ అయ్యారు అని చెన్నైవర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో గౌతమ్‌ మీనన్‌ చిత్రం చెన్నైలో జరిగిన ఆడియో విడుదల వేడుకలో సమంత పాల్గొని అపోహలకు తెరదించారు.