5, అక్టోబర్ 2012, శుక్రవారం

ప్యాకేజీ కోసం కేసీఆర్ ఆరాటం:ఎర్రబెల్లి

టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు కాంగ్రెస్ పార్టీ ఇచ్చే ప్యాకేజీ కోసం ఆశపడి ఇన్ని రోజులుగా ఢిల్లీలో మకాం వేశారని టీ-టీడీపీ ఫోరం కన్వీనర్,   ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆరోపించారు.   టీఆర్ఎస్, కాంగ్రెస్ కుమ్మక్కై తెలంగాణ ప్రాంతంలో టీడీపీని రాజకీయంగా దెబ్బతీయడానికి కుట్రలు పన్నారని, తెలంగాణ కోసం కాంగ్రెస్ పార్టీతో చర్చలు జరిపానని కేసీఆర్ ప్రకటించుకోవడం తగదని విమర్శించారు.
టీఆర్ఎస్‌లో కాంగ్రెస్‌తో చర్చించే సీనియర్ నాయకులే లేరా ? కేవలం కేసీఆర్, ఆయన కుటుంబీకులు చర్చలు జరపడంలో ఆంతర్యం ఎమిటన్నారు. కాంగ్రెస్‌నేతలు తాము ఎవ్వరిని పిలువలేదని ప్రకటించినా కేసీఆర్ మాత్రం కాంగ్రెస్ నాయకులే ఆహ్వానించారని ప్రకటించుకోవడం సిగ్గుచేటన్నారు.  కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వదలచుకుంటే సీమాంధ్ర, రాయలసీమ నాయకులతో చర్చలు జరపాలి, కానీ కేసీఆర్‌తో చర్చలు జరుపడంలో రహస్యం ఏమిటన్నారు. గతంలో సకల జనుల సమ్మె   నీరు గార్చడానికి కేసీఆర్ కాంగ్రెస్ పార్టీతో రూ.500కోట్ల ఒప్పందం కుదుర్చుకొన్నారని ,  తెలంగాణ మార్చ్‌ను నీరుగార్చడానికి యత్నించాడని ఎర్రబెల్లి ఆరోపించారు.  మార్చ్‌కు సంఘీభావం తెలిపినట్లుగా నటించి ఆ పార్టీ నాయకులు మధ్యలోనే వెళ్లిపోయారన్నారు.
పరకాల ఉప ఎన్నిక సమయంలో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తే మూడు నెలల్లో తెలంగాణ ఏర్పడుతుందని కే సీఆర్, హరీష్‌రావు ప్రకటించి ఓట్లు దండుకున్నారని నేడు తెలంగాణ ఎందుకు తీసుకురాలేదని ప్రశ్నించారు.