18, డిసెంబర్ 2011, ఆదివారం

భగవద్గీత తీవ్రవాద సాహిత్యం!

హిందువులు అమితంగా గౌరవించే ఆరాధించే భగవద్గీతను రష్యా ప్రభుత్వం నిషేధించేందుకు రంగం సిద్ధం చేసింది. టామ్‌స్క్‌ లోని న్యాయస్థానంలో భగవద్గీతను తీవ్రవాద సాహిత్యంగా గుర్తించి రష్యా ప్రభుత్వం నిషేధించిన వివిధ పుస్తకాల జాబితాలోకి దీన్ని చేర్చి ప్రచారంలో లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ యేడాది జూన్‌లో ఒక పిటిషన్‌ దాఖలైంది. దీన్ని ఎఫ్‌ఎస్‌బి, రష్యన్‌ ఆర్థోడాక్స్‌ చర్చి కలిసి దాఖలు చేశాయి. టామ్‌స్క్‌ ప్రాంతంలో హిందువులు సంఖ్యాపరమైన మైనార్టీలు. ఈ ప్రాంతంలో తమ మూలాలు పెంచుకోడానికి, చాప కింద నీరులా విస్తరించడానికి ఇస్కాన్‌ ప్రయత్నిస్తోందని అక్కడి సంప్రదాయవాద క్రైస్తవులు ఆరోపిస్తున్నారు. ఇస్కాన్‌ ఆటలు కట్టించేందుకు, విస్తరించకుండా అడ్డుకునేందుకు కేసు దాఖలు చేశారు. ఈ ఆరోపణలు వచ్చాక భగవద్గీతను నిపుణుల కమిటీకి పంపించారు. ఆ కమిటీని యూనివర్శిటీ ప్రొఫెసర్లతో ఏర్పాటు చేశారు. ఆ ప్రొఫెసర్లు గీతను చదివి ఈ గ్రంథం 'మత, లింగ, జాతి, జాతీయతా, భాషా ద్వేషాలను రెచ్చగొట్టేదిగా ఉందని అభిప్రాయపడింది. రష్యా ప్రభుత్వం ఆరోపించింది. ఈ పుస్తకాన్ని, అచ్చువేసినా, కలిగిఉన్నా, పట్టుకుతిరిగినా, పంచినా ప్రమాద కరమైన నేరంగా భావించి దారుణంగా శిక్షించాలని సిఫారసులు అందాయి. అందుకు అనుగుణంగా రష్యా
ప్రభుత్వం నిషేధపుటుత్తర్వులు జారీచేసేందుకు రంగంసిద్ధం చేస్తోంది.
మన న్యాయస్థానాలు అతిపవిత్రమైన గ్రంథంగా భావించి ప్రమాణ గ్రంధంగా గుర్తించి సాక్ష్యులతో ప్రమాణాలు చేయిస్తుంటే అది మత విద్వేషాలను రెచ్చగొట్టేదిగా ఉందని, మనుషుల మధ్య చిచ్చురేపేదిగా ఉందని రష్యా ప్రభుత్వం భావిస్తోంది. సార్వకాలీన సత్యాలకు ఆటపట్టుగా, మానవత్వాన్ని ప్రబోధించే పుస్తకంగా హిందువులు నమ్ముతుంటే అది జాతి విద్వేషాన్ని, భాషాద్వేషాలను పురికొల్పుతోందని అక్కడి ప్రభుత్వం భావిస్తోంది. ఇస్కాన్‌ వాళ్ళు చేస్తున్న కృష్ణచైతన్య ప్రచారాలను అడ్డుకోవడానికి ఈ చర్య తోడ్పడుతుందని హిందువుల మనోభావాలను గాయపరిచేదిగా ఉందని ఇస్కాన్‌ కార్యకర్తలు, నాయకులు ఆందోళన చెందుతున్నారు. భారత ప్రభుత్వం త్వరగా మేలుకుని భగవద్గీతపై నిషేధం వేటుపడకముందే రష్యన్‌ ప్రభుత్వంతో మాట్లాడి దిద్దుబాటు, సర్దుబాటు చర్యలు చేపట్టాలని ఇస్కాన్‌ వారు కోరుతున్నారు. ప్రపంచదేశాలు రెండోమాటలేకుండా ఆదరించి అక్కున చేర్చుకున్న ఆ అద్భుత వ్యాఖ్యాన గ్రంథాన్ని ఇస్కాన్‌ వ్యవస్థాపక గురువు భక్తివేదాంత స్వామి ప్రభుపాద రచించారు. ఏ దేశంలో ఎవ్వరూ పెట్టని వంకలన్నీ రష్యన్లు ప్రభుపాద రచించిన గీతకు ఆపాదించారు. ఈ పుస్తకాన్ని అన్ని దేశాల నాయకులు కళ్ళకద్దుకుని మహాప్రసాదంగా స్వీకరిస్తుంటే రష్యా ప్రభుత్వం విపరీతంగా పరిగణించడం వివాదాస్పదమైంది. కృష్ణభక్తులను, ప్రపంచ వ్యాప్తంగా ఉండే హిందువుల మనోభావాలను గాయపరుస్తోంది. ఇటీవలే బ్రిటన్‌ ప్రధానమంత్రి డేవిడ్‌ కేమరాన్‌కు ఈ పుస్తకాన్ని బహుమానంగా అందిస్తే ఆయన ఎంతో సంతోషపడిపోయి దాన్ని తన ఆఫీసు లైబ్రరీలో దాచుకున్నారు. వేదవ్యాసముని రచించిన భగవద్గీతను రష్యా భాషలోకి అనువదించి ఇస్కాన్‌ అక్కడ గీతను ప్రచారం చేస్తోంది. 1989లో ఈ రష్యాభాషలో ఉన్న భగవద్గీత కాపీని అప్పటి ప్రధానమంత్రి రాజీవ్‌గాంధీకి బహూకరించారు కూడా! ఆగస్ట్‌ లో ఈ కేసుపై తొలి విచారణ జరిగింది. ఫెడరల్‌ కోర్టు న్యాయమూర్తి గలీనా బటెన్కో ఈ వాదనలు విన్నారు. ఈ పుస్తకాన్ని నిషేధించాలని సిఫారసు చేసిన నిపుణుల కమిటీ చేసిన వాదనలో పసలేదని, దాన్ని నిషేధించాలనడానికి బలమైన సాక్ష్యాలు చూపలేకపోయారని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. కమిటీలోని నిపుణులు కూడా ఆ పుస్తకాన్ని పూర్తిగా చదవలేదని, అభ్యంతరాలు వ్యక్తం చేసిన పార్టీల వాదనలతో ఏకీభవించి సిఫారసులు చేశామని అంగీకరించారు. దాంతో న్యాయమూర్తి కామెరోవో వర్శిటీకి చెందిన ప్రొఫెసర్లతో నిపుణుల కమిటీని ఏర్పాటుచేసి భగవద్గీతయథాతథం పుస్తకంపై అభిప్రాయాన్ని ఇవ్వవలసిందిగా కోరారు.
ఈ కమిటీలో ఒక్క హిందువు కూడా లేకపోవడంతో ఇస్కాన్‌ ప్రతినిథులు ఆందోళన చెందుతున్నారు. ఈ కేసును సాకుగా తీసుకుని ఇస్కాన్‌ కార్యకలాపాలకు చెక్‌ చెబుతారేమోనని వారు భయపడుతున్నారు. నార్వేకు చెందిన మైనార్టీల మతహక్కుల పరిరక్షణ సంస్థ 'ఫోరమ్‌-18 తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. దీనిపై మన ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌కు విజ్ఞప్తులు అందాయి. దీనిపై సీరియస్‌గా స్పందించి రష్యా ప్రభుత్వంతో మాట్లాడి కేసు ఉపసంహరించుకోడానికి లేదా కేసు వీగిపోయేలా చేయడానికి అవసరమైన చర్యలు తీసుకునేలా చూడాలని మాస్కోలోని భారత రాయబారకార్యాలయానికి సూచించారు. ఈ కేసుపై సోమవారంనాడు తదుపరి విచారణ జరగనుంది.