16, ఆగస్టు 2011, మంగళవారం

కార్పొరేట్ల గుప్పిట్లో పిఎంవో, సిఎంవోలు

లోక్‌పాల్‌ బిల్‌ పరిధిలోకి ప్రధానిని కూడా చేర్చాలంటూ పౌరసమాజ నేత అన్నాహజారే పట్టుబడుతున్నారు. ఇందుకోసం ప్రాణత్యాగానికైనా సిద్ధపడుతున్నారు.
మరోవైపు కృష్ణా జిల్లా రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులంతా బందరు పోర్టు నిర్మాణానికి సుమారు 15 వేల ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేటు సంస్థ నవయుగ కనస్ట్రక్షన్స్‌కు వెంటనే అప్పగించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇందుకోసం శాసనసభ్యత్వాల్ని వదులుకునేందుక్కూడా వారు వెనుకాడటంలేదు. పరస్పర వైరుధ్యమున్న ఈ రెండు అంశాలు దేశంలో పెరిగిన క్రోని కేపిటలిజంకు అద్దం పడుతున్నాయి. జగన్‌ అవినీతిపై ప్రాథమిక సాక్ష్యాలున్నట్లు తేల్చిన హైకోర్టు తన తీర్పునిస్తూ దీన్ని క్రోని కేపిటలిజంగా పేర్కొంది. అప్పట్నుంచి క్రోని కేపిటలిజంపై దేశవ్యాప్తంగా చర్చసాగుతోంది. పెట్టుబడిదారీ వ్యవస్థలో ప్రభుత్వానికి, కార్పొరేట్‌ యజమాన్యాలకు మధ్య సాన్నిహిత్యం ఏర్పడటం, వీరంతా కార్పొరేట్‌ మాఫియాగా రూపొంది సంయుక్తంగా ప్రభుత్వ సంపదను దోపిడీ చేయడమే క్రోని కేపిటలిజం. ఈ విధానంలో వ్యాపార, పారిశ్రామికవేత్తలకు మార్కెట్లో తమ ఉత్పత్తుల్ని విక్రయించడం ద్వారా కంటే తమ ప్రయోజనాలకనుగుణంగా ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ చేయించడం ద్వారానే ఎక్కువ లాభపడతారు. ఇందులో వ్యాపారం, ఉత్పత్తులు ఉండవు. వీటి పేరిట ప్రభుత్వ ఆస్తులను దోచేస్తారు. ప్రభుత్వానికి కట్టాల్సిన పన్నులపై రాయితీలు పొందుతారు. ప్రభుత్వం నుంచి అదనంగా సాయం అందుకుంటారు. ఇంతవరకు భారత ప్రజలకు రాజకీయనేతల అవినీతి గురించి తెలుసు.. ఉద్యోగుల అవినీతిపైనా అవగాహన ఉంది. ప్రభుత్వం, ప్రభుత్వంలోని మంత్రులు,
ముఖ్యమంత్రులు, ప్రధాని కూడా కాంట్రాక్టులు, కొనుగోళ్ళ వ్యవహారాల్లో ముడుపులు తీసుకుంటారన్నదీ వారికి అవగతమే. కానీ క్రోని కేపిటలిజంపై భారతీయులకింకా పూర్తిస్థాయి అవగాహన రాలేదు. గత దశాబ్దకాలంగా క్రోని కేపిటలిజం విస్తృతమైనప్పటికీ దీనిపై బహిరంగచర్చ జరగడం జగన్‌ వ్యవహారం తర్వాతే మొదలైంది.
90వ దశకంలో భారత రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థల్లో అనూహ్య మార్పులొచ్చాయి. ఆర్థిక సంస్కరణలు అమలయ్యాయి. డబ్ల్యుటిఓలో భారత్‌ భాగస్వామైంది. అంతర్జాతీయ మార్కెట్‌లకు భారత్‌ తలుపుల్ని బార్లా తెరిచింది. ప్రపంచీకరణ, అంతర్జాతీయకరణంటూ ఆర్థికాంశాల్లో అనేక మార్పులు ప్రవేశపెట్టారు. దీని ఫలితంగా గత రెండు దశాబ్దాల్లో సంపద పెరిగింది. ఆదాయ అవకాశాలు మెరుగయ్యాయి. అదే సమయంలో దేశంలో నయా సంపన్నవర్గం పుట్టుకొచ్చింది. కార్పొరేట్‌ వ్యవస్థ బలీయంగా మారింది. అది ప్రభుత్వాల్నే శాసించగల స్థాయికెదిగింది. జవహర్‌లాల్‌ నెహ్రూ, ఇందిరాగాంధీల కాలంలో మిశ్రమ ఆర్థిక వ్యవస్థను అమలు చేసేవారు. అంతర్జాతీయ పరిణామాలకనుగుణంగా ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించినప్పటికీ అది ప్రభుత్వ అజమాయిషీలోనే కొనసాగేది. కీలక రంగాలన్నీ ప్రభుత్వ అధీనంలోనే ఉండేవి. కంట్రోలింగ్‌ వ్యవస్థ పకడ్బందీగా అమలయ్యేది. రాజీవ్‌ కాలం నుంచి ప్రభుత్వానికి, వ్యాపారులకు మధ్య సత్సంబంధాలు పెరిగాయి. పివి కాలంలో ఇవి మరింత ఊడలేసాయి. ఇదే క్రోని కేపిటలిజానికి దారితీసింది. గత రెండు దశాబ్దాల్లో పుట్టుకొచ్చిన కొత్తతరం కార్పొరేట్‌ వ్యవస్థ ఉత్పత్తి, వ్యాపార రంగాలకంటే రాజకీయ పార్టీలు, నేతలతో సాన్నిహిత్యానికే ప్రాధాన్యతనిచ్చింది. ఎవరు అధికారంలో ఉంటే వారి ద్వారా తమ ప్రయోజనాల్ని నెరవేర్చుకుంటోంది. క్రోని కేపిటలిజం గతంలో నియంతల పాలనలో ఉన్న దేశాల్లోనే ఎక్కువగా కనిపించేది. రెండో ప్రపంచ యుద్దానంతరం జపాన్‌లో క్రోని కేపిటలిజం మొదలైంది. సౌత్‌ కొరియాలో ఇది విస్తరించింది. లాటిన్‌ అమెరికాలో కొన్ని కుటుంబాలు ప్రభుత్వాన్ని గుప్పెటపట్టి దేశంపై అజమాయిషీ వహించేవి. ఇండోనేషియా, అర్జెంటీనా, బ్రెజిల్‌, మలేషియాల్లో కూడా క్రోని కేపిటలిజం విస్తృత స్థాయిలోనే ఉంది. పీపుల్స్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ చైనా, సోవియట్‌ యూనియన్‌లో కమ్యూనిస్ట్‌ నియంతృత్వ ప్రభుత్వాలు కొంత మంది కార్పొరేట్లను చేరదీసేవారు. వారి పోటీదార్లను ప్రభుత్వమే అణగదొక్కడం ద్వారా సొంతవర్గానికి మేలు చేకూర్చేవారు. ప్రభుత్వ నిర్మాణాల కాంట్రాక్టులన్నీ వారికే దక్కేవి. పాలకులు, అధికారులు, కార్పొరేట్లు కలసి ప్రజాధనాన్ని దోచుకునేవారు. హంగేరి, రుమేనియా, అల్బేనియా, పోలెండ్‌, బల్గేరియాల్లో కూడా ఇది విస్తృత స్థాయిలోనే సాగింది. తూర్పు జర్మనీ ఉన్న సమయంలో అక్కడి ప్రభుత్వం కార్పొరేట్ల గుప్పెట్లోనే ఉండేది.
క్రోని కేపిటలిజం కారణంగా ప్రభుత్వాల ఆర్థిక వ్యవస్థలే కుప్పకూలాయి. అగ్రరాజ్యం అమెరికా ఎదుర్కొంటున్న ఆర్థిక మాంద్యానికి క్రోని కేపిటలిజం కూడా ఓ కారణం. మార్పుతెస్తానంటూ ఎన్నికల బరిలో దిగిన ఒబామా అధికారం చేపట్టగానే జెపి మోర్గాన్‌, లాయిడ్‌బ్లాంక్‌ ఫియన్‌ పరిశ్రమలకు భారీగా రాయితీలిచ్చారు. ఈ సంస్థలు అమెరికాలో పెద్దసంఖ్యలో ఉద్యోగావకాశాలు కల్పించగలవన్న ఆశాభావంతో ఆయన వారడిగిన అన్ని ప్రయోజనాలు చేకూర్చిపెట్టారు. జనరల్‌ మోటార్స్‌, క్రిస్‌లర్‌లు ప్రభుత్వానికి చెల్లించాల్సిన బిలియన్ల డాలర్లను మాఫీ చేసేశారు. ప్రస్తుతం హెల్త్‌కేర్‌ పరిశ్రమపై ఒబామా దృష్టి పెట్టారు. దీంతో ఈ పరిశ్రమ లాబీయిస్టుల్తో వైట్‌హౌస్‌ నిండిపోతోంది. పవర్‌ సెక్టార్‌కు కూడా భారీ రాయితీలు ప్రకటిస్తున్నారు. తనకనుకూలంగా ఉన్న ఈ పరిశ్రమలకు ప్రభుత్వ నిధుల్ని అందజేస్తున్నారు. వీటివల్ల అదనంగా ఉద్యోగావకాశాలు సమకూరకపోగా దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. తిరిగి రెండో ప్రపంచ యుద్దకాలానంతర పరిస్థితుల్ని అమెరికా ఎదుర్కొంటోంది. రష్యా ఆర్థికంగా పుంజుకుంటున్న తరుణంలో ఆ దేశాన్ని కూడా క్రోని కేపిటలిజం ముంచెత్తింది. టెలి కమ్యూనికేషన్స్‌ రంగాన్ని ప్రైవేటీకరణ చేయడానికీ క్రోని కేపిటలిజమే కారణం. భారత్‌లో కూడా ఇదిప్పుడు ఊడలేస్తోంది. క్రిందిస్థాయి కంటే పైస్థాయిలోనే అవినీతి జాఢ్యం పెరిగింది. పెద్ద కార్పొరేట్‌ వ్యవస్థలేవీ ఎమ్మెల్యేలు, ఎమ్‌పిలు, మంత్రుల్తో వ్యాపార సంబంధాలు నెరపడంలేదు. ముఖ్యమంత్రులు, ప్రధానుల్నే అవి తమ గుప్పెట పట్టాయి.
తమ ప్రయోజనాల కోసం రాజకీయ పార్టీలకు, నాయకులకు విస్తృతంగా విరాళాలిస్తున్నాయి. దీంతో కార్పొరేట్లు ఆడమన్నట్లల్లా రాజకీయ నేతలు ఆడుతున్నారు. వారి ప్రయోజనాల పరిరక్షణ కోసం, లాభాల కోసం, వారి ఆస్తులు వందలు, వేల రెట్లు పెంచడం కోసం వారికనుకూలంగా ఉత్తర్వులిమ్మంటూ ప్రభుత్వాలపై ఒత్తిళ్ళు తెస్తున్నారు. పౌరసమాజం ఈ విషయాన్ని గుర్తించే లోక్‌పాల్‌ పరిధిలోకి ప్రధానిని తేవాలంటూ డిమాండ్‌ చేస్తోంది. భవిష్యత్‌ పరిణామాల్ని ఊహించిన కాంగ్రెస్‌ ఇందుకు అభ్యంతరం చెబుతోంది. హజారే బృందం ఆలోచనలో ప్రధానంటే మన్మోహన్‌సింగ్‌ కాదు. ఆ పీఠంపై ఎవరుంటేవారే పౌరసమాజానికి లక్ష్యం. ప్రధాని స్థాయిలో వేలు, లక్షల కోట్ల అవినీతి సాగుతోంది. ప్రభుత్వ నిర్ణయాలకు ప్రస్తుతం మంత్రుల్ని బాధ్యులుగా చేస్తున్నారు. 2జి స్పెక్ట్రమ్‌లో జరిగిందదే. రాజా, కనిమొళి లాంటివారిని బలేసి ప్రభుత్వ పెద్ద తనకు సంబంధంలేదంటూ తప్పించుకున్నారు. ప్రభుత్వ నిర్ణయాలన్నీ సమష్టిగానే జరుగుతాయి. ఇందుకు ప్రధానే బాధ్యత వహిస్తారు. ఆయన సూచించిన ఎమ్‌పిలకే మంత్రి పదవులు లభిస్తాయి. తనకనుకూలమైన వ్యక్తుల్ని ప్రధాని కేబినెట్‌ సహచరులుగా ఎన్నుకుంటారు. తీరా భారీ అవినీతి విషయాలొచ్చేసరికి ఈ విషయాలన్నింటినీ పక్కనబెడుతున్నారు. ఒకరిద్దర్ని బలేసి చేతులు దులుపుకుంటున్నారు. ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న ప్రధానిని లోక్‌పాల్‌ బిల్‌ పరిధిలోకి తీసుకురాగలిగితే దేశంలో క్రోని కేపిటలిజం తగ్గుతుంది. అలాగే రాష్ట్రాల స్థాయిలో ముఖ్యమంత్రుల్ని ఈ బిల్‌ పరిధిలోకి తెస్తే భారీ అవినీతికి అడ్డుకట్టవేయగలిగే అవకాశాలుంటాయి.