26, సెప్టెంబర్ 2012, బుధవారం

మార్చ్‌లో హింసకు అవకాశం

ఈనెల సెప్టెంబర్ 30న జరిగే తెలంగాణ మార్చ్‌లో హింస జరిగే అవకాశం ఉన్నట్లు నిఘావర్గాల నుంచి సమాచారం ఉందని లా అండ్ ఆర్డర్ డీజీ హుడా పేర్కొన్నారు. బుధవారం ఉదయం తెలంగాణ మార్చ్, వినాయక నిమజ్జనంపై డీజీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ మార్చ్‌కు పోలీసులు అనుమతి ఇవ్వలేదన్నారు.

ప్రజల ఆస్తులకు రక్షణ కల్పిస్తామని, ప్రజల ఆస్తులపై దాడికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తెలంగాణ మార్చ్‌కు వచ్చే వారంతా కేసులు లేని వారన్నారు. మతఘర్షణలు,తీవ్రవాదుల చొరబాటుకు అవకాశం ఉన్నట్లు హుడా తెలిపారు. హైదరాబాద్‌కు కేంద్ర బలగాలు వస్తున్నారని, ప్రజలకు ఎలాంటి హానీ జరగకుండా చూస్తామని హుడా పేర్కొన్నారు.

జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ ఏరియాలో మార్చ్ నిర్వహించే అవకాశం ఉంద న్నారు. అసెంబ్లీ, ట్యాంక్‌బండ్, నెక్లస్‌రోడ్డు పైనా దాడుల చేస్తారనే సమాచారం ఉందని హుడా చెప్పారు. జేఏసీ ఆయుధాలను అడ్డు కట్టేందుకు తమ వద్ద ఆయుధాలు ఉన్నాయన్నారు. దాడులు జరిగినా రబ్బరు బుల్లెట్లు ఉపయోగించబోమని, ముందస్తు అరెస్ట్‌లు తప్పవని హుడా ప్రకటించారు.

ఎంపీలు, ఎమ్మెల్యేలను సైతం అరెస్ట్ చేస్తామని పేర్కొన్నారు. హైదరాబాద్ చుట్టూ చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామని, మిలియన్ మార్చ్ అనుభవంతో కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తున్నట్లు డీజీ హుడా తెలియజేశారు.