26, సెప్టెంబర్ 2012, బుధవారం

మార్చ్ వాయిదాపై సీఎం ఫోన్‌ మంతనాలు

తెలంగాణ మార్చ్ వాయిదాపై ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఇందులో భాగంగా కొందరు తెలంగాణ మంత్రులతో సీఎం కిరణ్ ఫోన్‌లో సంభాషణలు జరిపారు. తెలంగాణ జేఏసీ నేతలతో చర్చలు జరిపే బాధ్యతలను డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, మంత్రి జానారెడ్డి, సీనియర్ నేత కేకేలకు అప్పగించారు.

తెలంగాణ పొలిటికల్ జేఏసీతో మాట్లాడి మార్చ్ వాయిదా వేసేలా చూడాలని తెలిపారు. జీవవైవిద్య సదస్సు తర్వాత మార్చ్ జరిగేలా జేఏసీ నేతలను విజ్ఞప్తి చేయాలని ఆయన మంత్రులకు సూచించినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై సీఎం తనతో చర్చించారని,అటు మార్చ్‌కు అనుమతి ఇప్పించాల్సిందిగా జేఏసీ నేతలు కూడా కోరారని ఈ విషయాలన్నింటిపైనా పార్టీ నేతలు సీఎం చర్చిస్తారని జానారెడ్డి తెలిపారు.

అటు సీఎం ప్రతిపాదనపై సీనియర్ నేత కేకే అసంతృప్తి వ్యక్తపరిచారు. కాశ్మీర్‌లో 45 మంది సర్పంచ్‌లు రాజీనామా చేస్తే దీనిపై రాహుల్ గాంధీ సీడబ్ల్యూసీలో ప్రస్తావించారని, అయితే తెలంగాణ కోసం 118 మంది ప్రజాప్రతినిధులు రాజీనామా చేసినా మాట్లాడినవారు లేరని, ఇది ఎంతో ఆవేదన కల్గిస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత కే.కేశవరావు సంచలన వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ మార్చ్‌పై సీఎం, హోమంత్రి తనతో మాట్లాడారని అయితే ఇప్పటికే ఆలస్యమైందని, మార్చ్ వాయిదా వేయలేమని తేల్చి చెప్పినట్లు కేకే తెలిపారు. తాను మధ్యవర్తిత్వం జరిపే ప్రసక్తే లేదన్నారు. మార్చ్ వాయిదా ప్రయత్నం చేస్తున్నామని కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. తెలంగాణ ప్రాంత మంత్రులమంతా కలిసి మార్చుకు అనుమతి ఇప్పించేందుకు ప్రయత్నిస్తున్నామని కేకే పేర్కొన్నారు.

మరోవైపు తెలంగాణ మార్చ్ నేపథ్యంలో వరంగల్, మహబూబ్‌నగర్ జిల్లాలో పోలీసులు ముందస్తు అరెస్ట్‌లు, ప్రధాన రహదారుల్లో ముమ్మర తనిఖీలు నిర్వహించారు. పలువురు టీఆర్ఎస్, జేఏసీ, విద్యార్థి జాక్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. వరంగల్‌లో 16 ప్రత్యేక చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా హైదరాబాద్‌కు వెళ్లే మార్గంలో పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహించారు.