26, సెప్టెంబర్ 2012, బుధవారం

విజయసాయితో లింకేంటి?

తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పైన కావాలనే ఉద్దేశ్య పూర్వకంగా ఎబికె ప్రసాద్ అసత్య కథనాలు రాస్తున్నారని తెలుగుదేశం పార్టీ నేత, మాజీ పార్లమెంటు సభ్యులు ఎర్రన్నాయుడు బుధవారం అన్నారు. ఐఎంజి భూములను దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి రద్దు చేశాక ఇప్పుడు పిటిషన్ వేయడమేమిటని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబును దెబ్బతీసేందుకు ఐఎంజి భూముల వ్యవహారం తెర పైకి తీసుకు వచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

విజయ సాయి రెడ్డితో ఎబికె ప్రసాద్‌కు ఉన్న సంబంధం ఏమిటని ఆయన ప్రశ్నించారు. విజయ సాయి రెడ్డి తరఫున ఎబికె ప్రసాద్ ప్రమాణం చేయాల్సిన అవసరమేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఐఎంజి కేసులో అవతవకలు లేవని కోర్టు ఉత్తర్వులు ఉన్నాయని గుర్తు చేశారు. ఎలాంటి అక్రమాలు లేవని ఎసిబి కోర్టు కేసును కొట్టేసినప్పటికీ ఇదే విషయంపై పిటిషన్ వేయడం, కొట్టి వేసిన అంశాన్ని ఆ పిటిషన్‌లో ప్రస్తావించక పోవడం అందరూ గుర్తించాలన్నారు. పదవి ఇచ్చారు కాబట్టే ఎబికె ఆరోపణలు చేశారన్నారు.

కాగా ఐఎంజి కేసులో చంద్రబాబుపై వచ్చిన ఆరోపణలపై ఎర్రంనాయుడు రెండు రోజుల క్రితం కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. దేశంలో మూడో ఫ్రంట్ ఆవిర్భావం కోసం ప్రయత్నిస్తున్నందునే చంద్రబాబుపై ఐఎంజీ కేసు వంటి కుట్రలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఐఎంజీ వ్యవహారంలో చంద్రబాబు నిర్దోషి అని అనేక సందర్భాల్లో కోర్టులు స్పష్టం చేసిన విషయాన్ని గుర్తు చేశారు.

ధర్మాసనం ఆదేశిస్తే 'ఐఎంజీ భారత' సంస్థకు భూ కేటాయింపుల్లో అక్రమాలపై ప్రాథమిక విచారణ చేస్తామని సిబిఐ తెలిపిన నేపథ్యంలో ఎర్రంనాయుడు ఆ మాటలు అన్నారు. ఆ విషయం తెలియజేస్తూ సోమవారం హైకోర్టులో సిబిఐ కౌంటర్ దాఖలు చేసింది. ఐఎంజీ భారత సంస్థకు అప్పటి చంద్రబాబు ప్రభుత్వం నగర శివార్లలోని అత్యంత ఖరీదైన భూములను కారుచౌకగా కట్టబెట్టిందని ఆరోపిస్తూ న్యాయవాది శ్రీరంగరావు, ప్రముఖ పాత్రికేయులు ఎబికె ప్రసాద్, ఆడిటర్ విజయసాయిరెడ్డి పిటిషన్ దాఖలు చేశారు.

వీటిని సోమవారం హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పీసీ ఘోష్, జస్టిస్ అఫ్జల్ పుర్కర్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. ఐఎంజీ భారత సంస్థ కుదుర్చుకున్న ఒప్పందంలోని అక్రమాలపై ప్రాథమిక విచారణ కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం 2006లో జీవో 310ను జారీ చేసిందని, అంతకుముందే ఔటర్ రింగ్‌రోడ్ భూసేకరణలో అక్రమాలపైనా ప్రాథమిక విచారణ కోరిందని కోర్టుకు సిబిఐ తెలిపింది.

తగిన సిబ్బంది లేకపోవడంతో ఐఎంజీ వ్యవహారంపై రాష్ట్రస్థాయి దర్యాప్తు అధికారులతోనే ప్రాథమిక విచారణ చేయించాలని, ఆధారాలు లభిస్తే సీబీఐ విచారణను కోరాలని రాసిన లేఖపై ఇంతవరకు ఎలాంటి సమాధానం రాలేదని తెలిపింది. ప్రస్తుతం తాము దర్యాప్తు చేస్తున్న కేసులన్నీ ఓ కొలిక్కి వచ్చాయని, సిబ్బంది కొరత సమస్య ఉండే పరిస్థితి లేదని సిబిఐ కోర్టుకు తెలిపింది. తాజాగా సీబీఐ కౌంటర్‌ను పరిశీలించిన ధర్మాసనం విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.