26, సెప్టెంబర్ 2012, బుధవారం

ఎలమంచిలి ఎమ్మెల్యే ఉక్కిరిబిక్కిరి

మకుటం లేని మహారాజుగా చెలామణి అయిన ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబురాజును వరుస కేసులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ప్రజాప్రతినిధిగా ఉంటూ రియల్ ఎస్టేట్, కాంట్రాక్టులు, మద్యం వ్యాపారాల ద్వారా సంపాదించిన ఆస్తులు వందల కోట్ల రూపాయల్లో ఉండడంతో అవన్నీ అక్రమాస్తులేననే ఆరోపణలు అధికమయ్యాయి. విశాఖ నగరం నడిబొడ్డున(హోటల్ మేఘాలయ) భారీ స్థలం, అందులో చేపడుతున్న షాపింగ్‌మాల్, సినిమా థియేటర్ల నిర్మాణానికి నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఆ స్థలం రిజ్రిస్టేషన్ విలువే 26 కోట్ల రూపాయలు ఉంటే...వాస్తవంగా మార్కెట్ విలువ ఇంకెంత ఉంటుందో అర్థం చేసుకోవచ్చునంటూ ఆయన ప్రత్యర్థులు సవాళ్లు విసురుతున్నారు. సీతమ్మధారలో ఆయన నిర్మించుకున్న భవంతికి విశాఖ నగర పాలక సంస్థ ఎందుకు అనుమతులు ఇవ్వలేదు? నిబంధనలు ఉల్లంఘించి నిర్మించినా ఎందుకు చర్యలు చేపట్టలేదో అధికారులు నోరు విప్పాలనే వాదన ఊపందుకుంది. ఆ భవనం, అందులో స్విమ్మింగ్‌పూల్ సినిమా సెట్‌ను తలపిస్తున్నాయంటే..ఆయన ఎంత సంపాదించారో అంతుచిక్కడం లేదంటూ పలువురు ఆశ్చర్యం ప్రకటిస్తున్నారు. ఆయన ఎంత సంపాదించుకున్నా ఫరవాలేదని, అయితే తినడానికి కూడు లేని పేదలు తన దగ్గర పనిచేస్తుంటే..వారి పేరు మీద బ్యాంకులో రుణం తీసుకొని, ప్రభుత్వం నుంచి కోటి రూపాయల రాయితీని అక్రమంగా కొట్టేయడంపై తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి.

వీటిని విజిలెన్స్ విభాగం నిర్ధారించి, ఎమ్మెల్యే కుమారుడు తేజపై క్రిమినల్ కేసు పెట్టి చర్యలు తీసుకోవాలని ఆదేశించినా ప్రభుత్వం మిన్నకుండిపోవడంతో ఆయన ప్రత్యర్థులు ఇక న్యాయస్థానమే దిక్కుగా భావించి నేరుగా హైకోర్టును ఆశ్రయించారు. ఎలమంచిలి నియోజకవర్గానికి చెందిన కొయిలాడ వెంకట్రావు ఎమ్మెల్యే అక్రమ ఆస్తులు, ఎస్సీల పేరుతో ఆయన ప్రభుత్వం నుంచి పొందిన రాయితీపై హైకోర్టులో పిటిషన్ వేశారు. దాన్ని విచారణకు స్వీకరించిన కోర్టు విజిలెన్స్ ఏ నివేదిక ఇచ్చిందో తమకు సమర్పించాలని ఆదేశించింది.

దాంతో ఎమ్మెల్యే కన్నబాబు గుండెల్లో రాయి పడింది. ఇన్నాళ్లు ప్రభుత్వంలో మేనేజ్ చేయగలిగినా న్యాయస్థానానికి వచ్చేసరికి ఏం చేయాలో పాలుపోక ఆపసోపాలు పడుతున్నారు. అది సరిపోదు అన్నట్టు విశాఖ ఏసీబీ కోర్టులో ఆడారి ఆదిమూర్తి ఎమ్మెల్యే అక్రమ సంపాదన, కుటుంబ సభ్యుల పేరిట ఆస్తులపై కేసు వేశారు. దానిపై విశాఖలో ఏసీబీ అధికారులు ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయంటూ ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు. జిల్లాలో ఇలాంటి కేసును ఎదుర్కొంటున్న మొదటి ఎమ్మెల్యే ఆయనే కావడం విశేషం.

ఏసీబీ విచారణ మొదలుపెడితే..ఆదాయ వ్యయాలు, పన్నుచెల్లింపులు, కొనుగోళ్లు అమ్మకాలు అన్నింటిపైనా కూపీ లాగుతుంది. మొత్తం వ్యవహారాలు బయటకొస్తాయి. వీటికి తోడుగా భూమి విషయంలో ఎమ్మెల్యే తనను బెదిరిస్తున్నారంటూ ఇటీవల సన్యాశిరాజు అన్యే భూ వ్యాపారి నాలుగో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలా ఒక్కొక్కటిగా కేసులు పడుతుండడంతో రాజకీయ దురుద్దేశాలతో ప్రత్యర్థులు దాడి చేస్తున్నారని ఎమ్మెల్యే వర్గీయులు ఆరోపిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఓడించడానికి ఈ ఎత్తులు వేస్తున్నారని పేర్కొంటున్నారు.

వచ్చే ఎన్నికల సంగతి ఏమో కానీ వీటన్నింటిపై విచారణ జరిగితే...ఎమ్మెల్యేపైన, ఆయన కుమారుడిపైనా క్రిమినల్ కేసులు నమోదు కావడం ఖాయమని పార్టీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. కన్నబాబురాజు సీరియస్‌గా వుడా అధ్యక్ష పదవికి ప్రయత్నిస్తున్న తరుణంలో ఈ కేసులన్నీ దాఖలు కావడంతో ఆయన అవకాశాలు నీరుగారిపోయినట్టేనని ప్రత్యర్థులు సంతోషం ప్రకటిస్తున్నారు. ఈ పదవి కోసం ఎన్ని కోట్లు అయినా ఖర్చు చేయడానికి నగరానికి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ముందుకొస్తే...వారికి ఏమాత్రం తీసిపోకుండా పార్టీకి ఫండ్ ఇస్తానంటూ కన్నబాబు వుడా ఛైర్మన్ గిరి కోసం పోటీ పడుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈయనకు జిల్లా మంత్రులు బాలరాజు, గంటా శ్రీనివాసరావుల మద్దతు ఉండడంతో దాదాపుగా పదవి ఖాయమని భావిస్తున్న తరుణాన ఈ కేసులతో ఆ పదవి వస్తుందో రాదోననే అనుమానం మొదలైంది. ఈ కేసులు ఏ మలుపులు తిరుగుతాయోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.