23, ఫిబ్రవరి 2011, బుధవారం

సెట్స్‌ నిర్మాణంలో 'శ్రీరామరాజ్యం'

బాలకృష్ణ శ్రీరామునిగా నటిస్తున్న పౌరాణిక చిత్రం 'శ్రీరామరాజ్యం'. మేటి దర్శకుడు బాపు దర్శకత్వంలో యలమంచిలి సాయిబాబు నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ 35 శాతం మేరకు పూర్తయింది. ఇందులోని సన్నివేశాల చిత్రీకరణ కోసం పలురకాల సెట్స్‌ నిర్మిస్తుండటంవల్ల మధ్య మధ్యలో గ్యాప్‌ తీసుకుని షెడ్యూల్స్‌ చేస్తున్నారు. డిసెంబర్‌ 2 నుండి 10 వరకు, జనవరి 21 నుంచి ఫిబ్రవరి 8 వరకు షూటింగ్‌ జరిగింది. ఇందులో భాగంగా వాల్మీకి ఆశ్రమం సెట్‌లో మూడు పాటల చిత్రీకరణ, కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించామని నిర్మాత సాయిబాబు తెలిపారు. లవకుశుల జననం, లక్ష్మణుడు అడవిలో సీతను వదిలివేయడం, వాల్మీకి ఆమెను ఆదరించడం వంటి సన్నివేశాలను వాల్మీకి ఆశ్రమంలో 14 సెటప్స్‌లో చిత్రీకరించామని ఆయన చెప్పారు. మార్చి నెలాఖరు నుండి పూర్తయ్యేవరకు తదుపరి షెడ్యూల్‌ నిర్విరామంగా జరుగుతుందని అన్నారు. మరోపక్కన రామోజీ ఫిలింసిటీలో దర్బారు, ఏకాంత మందిరం, కౌసల్య మందిరం వంటి సెట్స్‌ పనులు జరుగుతున్నాయని చెప్పారు. ఇంకా రాజప్రసాదం యొక్క అవుట్‌డోర్‌, అయోధ్యనగరం నిర్మాణం పనులు కూడా అక్కడే జరుగుతున్నాయని అన్నారు. ఇందులో ఎనిమిది పాటలు, కొన్ని బిట్‌ సాంగ్స్‌ ఉన్నాయని ఆయన వివరించారు. జూన్‌లో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు.
కాగా వాల్మీకిగా అక్కినేని నాగేశ్వరరావు నటిస్తున్న ఈ చిత్రంలో సీతగా నయనతార, హనుమంతునిగా ఒకప్పటి దారాసింగ్‌ అబ్బాయి విందు ధారాసింగ్‌ నటిస్తున్నారు. జనకునిగా మురళీమోహన్‌, జనకుని భార్యగా సుధ, భూదేవిగా జయసుధ, వశిష్టుడుగా బాలయ్య, లక్ష్మణునిగా శ్రీకాంత్‌, భరతునిగా సాయికుమార్‌, రుష్యంగుడిగా నాగినీడు, తిప్పడుగా బ్రహ్మానందం, రంగిగా ఝాన్సీ నటిస్తున్నారు. ముళ్లపూడి వెంకటరమణ రచన చేస్తున్న ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతాన్ని సమకూరుస్తున్నారు.