2, మార్చి 2011, బుధవారం

తమిళనాట పెట్రోల్‌పై విక్రయ పన్ను తగ్గింపు

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరిగి పోతున్నా, తమిళనాడు ప్రభుత్వం మాత్రం రాష్ట్రంలో పెట్రోల్‌ కొనుగోలుపై సేల్స్‌ టాక్స్‌ మూడు శాతం తగ్గిస్తూ మంగళవారం నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకూ తమిళనాడులో పెట్రోల్‌ విక్రయ పన్ను 30 శాతంగా ఉంది.
తమిళనాడు ముఖ్యమంత్రి ఎం కరుణానిధి ఈ మేరకు ఓ ప్రకటన చేస్తూ, అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా భారతీయ చమురు సంస్థలు పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెంచాల్సి వచ్చిందన్నారు. అయితే రాష్ట్రంలోని ద్విచక్ర వాహన చోదకులకు సహకరించేందుకు పెట్రోల్‌పై విక్రయ పన్ను మూడు శాతం తగ్గించాలని నిర్ణయించినట్లు కరుణానిధి ఆ ప్రకటనలో తెలిపారు.
ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వ ఖజానాకు ఏడాదికి రూ.210 కోట్ల రెవెన్యూ లోటు ఏర్పడుతుందని కరుణానిధి తెలిపారు. దీంతో రాష్ట్రంలో పెట్రోల్‌పై లీటర్‌కు రూ.1.38 తగ్గుతుంది. తమిళనాడు రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కరుణానిధి ప్రభుత్వ నిర్ణయానికి ప్రాధాన్యం ఏర్పడింది.