13, మార్చి 2011, ఆదివారం

ఉద్యమానికి తెలంగాణా ఉద్యోగ జెఎసి ద్రోహం

ప్రత్యేక తెలంగాణా రా ష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో భాగంగా ఏర్పాటైన ఉద్యోగ సంఘాల జెఎసి నిట్ట నిలువునా చీలింది. ఫిబ్రవరి 17 నుండి ప్రారంభించిన సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఉద్యోగ సంఘాల నాయకులు కొందరు తమ స్వార్ద రాజకీయాల కోసం ఈనెల 4న ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా ఉద్యమాన్ని నీరుగార్చారని ఆరోపిస్తూ 32 సంఘాలకు చెందిన అధికార, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాల నాయకులు ప్రత్యేక సమాఖ్యను ఏర్పరుచుకున్నా రు. తమ స్వార్దం కోసం 4.5 లక్షల మంది ఉద్యోగులకు తీవ్ర ద్రోహం చేసారని, ఈ సందర్బంగా ఆరోపిస్తున్నారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ముందస్తుగా నిర్ణయించిన అంశాలపై సంతకాలు చేసి ఉద్యమాన్ని విరమింప చేశారని ఆరోపిస్తున్నా రు. స్వామిగౌడ్‌, దేవినేని ప్రసాద్‌, శ్రీనివాసగౌడ్‌, విఠల్‌లు ఈ కుట్రలో భాగమని, వారిని పొలిటికల్‌ జెఎసి నుండి బహిష్కరించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ప్రభుత్వంతో ఈ నాయకులు కుదుర్చుకున్న ఒ ప్పందంలోని 11వ అంశంలో చేర్చబడిన ఇకనుండి సమ్మె చేయబోమని, అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములమై విధులు నిర్వహిస్తామని పేర్కొన్న విషయాన్ని కూడా చూడకుండా సంతకాలు చేస్తున్నారని ఆరోపించారు.

సహాయ నిరాకరణను నిలిపివేస్తూ ప్రభుత్వంతో ఒ ప్పందం కుదుర్చుకునే విషయంలో జెఎసి లోని ఇతర సంఘాలతో చర్చించకుండానే స్వయం నిర్ణయం చేశారని అంటున్నారు. మరో 15 నుండి 20 రోజుల పాటు సహాయ నిరాకరణ జరిగివుంటే ప్రభుత్వం సంక్షోభ స్థితికి చేరుకుని, రాష్ట్ర అవతరణకు అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సూచనలు చేసేదని అంటున్నారు. ఈ స్థితిలో వీరు ఉద్యమానికి ఎనలేని ద్రోహం చేశారని ఆరోపిస్తున్నారు.

స్వామిగౌడ్‌ ఎన్జీవోలకు గచ్చిబౌలిలో ఇళ్ళ స్థలాలు ఇప్పిస్తామని చెప్పి కోట్లాది రూపాయలు దండుకున్నాడని, ఈ విషయమై ప్రభుత్వం వద్ద రికార్డులు ఉన్నాయని, దీన్ని ఆసరాగా చేసుకుని కేసులు బనాయిస్తామని ప్రభుత్వం చేసిన హెచ్చరికకు స్వామిగౌడ్‌ లాంటి నాయకులు లొంగిపోయారని తీవ్రఆరోపణలు చేస్తున్నారు.