27, సెప్టెంబర్ 2012, గురువారం

టీడీపీకి బైరెడ్డి బై.. బై..

తెలుగుదేశం పార్టీకి సీనియర్ నాయకుడు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి రాజీనామా చేశారు. చంద్రబాబు వ్యవహారశైలి నచ్చకపోవడం వల్లే పార్టీకి రాజీనామా చేస్తున్నానని ఆయన అన్నారు. తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇస్తే అభ్యంతరం లేదని ఆయన అన్నారు. కానీ రాయలసీమ అంటే ఎందుకు చంద్రబాబుకు లెక్కలేనితనం ఉందోనని బైరెడ్డి మండిపడ్డారు. బాబుకు సలహాలు ఇస్తున్నవారు పార్టీని ముంచడానికే తప్ప, పెంచడానికి కాదని టీడీపీ నేతలను విమర్శించారు.

తనకు రాజకీయాల కన్నా రాయలసీమ ప్రయోజనాలే ముఖ్యమని బైరెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రులు అవ్వడానికి రాయలసీమను ఉపయోగించుకుంటున్న నేతలు ఆ ప్రజల ఆకాంక్షను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రాయలసీమ నాలుగు జిల్లాలో అక్టోబర్ 2 నుంచి 40 రోజులపాటు రాయలసీమ ఆత్మగౌరవ యాత్ర చేస్తానని ఆయన తెలిపారు.