27, సెప్టెంబర్ 2012, గురువారం

వైఎస్సార్ కాంగ్రెస్ వైపు ప్రవీణ్‌రెడ్డి

ప్రత్యేక తెలంగాణపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ప్రధానమంత్రికి లేఖ రాయడంపై ఆ పార్టీ సీమాంధ్ర నేతల్లో చిచ్చురేపుతోంది. తంబళ్లపల్లి టీడీపీ శాసనసభ్యుడు ప్రవీణ్‌రెడ్డి చంద్రబాబు వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రాయలసీమవాసి అయ్యిండి ఇలా లేఖ రాయడం సరికాదని అన్నారు. టీడీపీ అన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటోందని, లేఖను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో పార్టీకి రాజీనామా చేసేందుకు కూడా సిద్ధమని ఆయన హెచ్చరించారు. లేదంటే టిడిపి పేరును తెలంగాణ దేశంగా పెట్టుకోవాలని వ్యాఖ్యానించారు.

మార్చ్ అంటే సీమాంధ్రులపై పరోక్షంగా దాడి జరిపుతున్నట్లే ప్రవీణ్‌రెడ్డి అన్నారు. అలాంటి మార్చ్‌కి తమ సహచర తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు మద్దతివ్వడం దారుణమన్నారు. తెలంగాణపై పార్టీ ఇచ్చిన లేఖను నిరసిస్తూ తాను ఆయన నిర్వహించబోయే పాదయాత్రలో నిరసన వ్యక్తం చేస్తానని చెప్పారు. టిడిపి అంటే తెలంగాణ దేశం పార్టీగా మారిందని ఎద్దేవా చేశారు.  కాగా ప్రవీణ్‌రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీవైపు వెళ్ళేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. అందుకు తగిన కారణం దొరకక ఇంతకాలం అగినట్లు తెలిసింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రధానికి రాసిన లేఖ కారణంగా చూపుతూ పార్టీ నుంచి వెళ్లిపోయేందుకు సిద్ధపడుతున్నట్లు తెలియవచ్చింది.