5, మార్చి 2011, శనివారం

అది శాసనసభ? సీమాంధ్ర సభ? : తెరాస

తెలంగాణ సభ్యులు లేకుండా శాసనసభా సమావేశాలను నిర్వహించుకుంటున్నారని, అది సీమాంధ్ర శాసనసభగా నడుస్తోందని తెరాస శాసనసభ్యుడు హరీష్ రావు విమర్శించారు. ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో కిరణ్ కుమార్ రెడ్డిని చంద్రబాబు కాపాడుతున్నారని..తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవడానికి..సమైక్యాంధ్ర కుట్ర చేస్తున్నారని, ఇద్దరు కుమ్మక్కు కావడం వల్లనే చంద్రబాబు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించడం లేదని ఆయన వ్యాఖ్యానించారు.

కుమ్మక్కులో భాగంగానే కాంగ్రెసు శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి చంద్రబాబును కలిశారని, తెలుగుదేశం నాయకులు తమ ఎంపిటీసీ సభ్యులను కాంగ్రెసుకు అప్పగిస్తున్నారని, రాష్ట్ర మంత్రి తెలుగుదేశం పార్టీ కార్యాలయాలకు వెళ్తున్నారని..ప్రజా ప్రయోజనాల కన్నా సొంత ప్రయోజనాలే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిరెడ్డికి ముఖ్యంగా మారాయని ఆయన వ్యాఖ్యానించారు.