24, ఫిబ్రవరి 2011, గురువారం

శనీశ్వరుడు శాంతించాలంటే...

శని పీడితులు ఆయనను తిడుతూ కూర్చోక ఎలా ప్రసన్నుడిని చేసుకోవాలా అని ఆలోచించాలి. శనిని తృప్తి పరచడం అన్నది నిజానికి చాలా కష్టమైన వ్యవహారమే. మనిషి యొక్క జాతకంలో శని ప్రభావం వుంటే ఆ వ్యక్తిని బాధించడమే లక్ష్యంగా పెట్టుకున్న శనిగ్రహాన్ని భక్తి శ్రద్ధలతో పూజించడం తప్ప వేరు మార్గం లేదు. ఆయనని గనుక సంతృప్తి పరుస్తే కార్యసిద్ధికి ఉన్న ఆటంకాలన్నింటినీ దాటి బ్రతుకును బంగారుమయం చేసుకోవచ్చు నంటారు. శనివారం నాడు తల్లవారుజామున తలస్నానం చేసి, తిలల నూనె తో దీపం పెట్టి శ్రీవెంకటేశ్వర స్వామిని పూజించి ఒంటి పూట భోజనం చేయడం వల్ల శని దోషం చాలా వరకు తగ్గుతుంది. ఆ రోజు ఉదయంపూట హనుమాన్‌ చాలీసా పారాయణం చెయ్యాలి. శని వాహనమైన కాకికి ఆహారం పెట్టడం వల్ల కూడా శని దోషం తగ్గుతుంది.

భైరవుని ఆరాధన చేసి, నల్లనువ్వులు, ఇనుము దానం ఇవ్వాలి. పుష్యమి-అనూరాధ ఉత్తరాభాద్ర నక్షత్రాలకు శని అధిపతి. పుష్యమి కర్కాటక రాశికి సంబంధించింది. అనూరాధ వృశ్చికరాశికి సంబంధిం చింది. ఉత్తరాభాద్ర మినరాశికి సంబంధించింది. కంటి చూపు తగ్గటం, ఉబ్బసం, దగ్గు, కఫం వంటి వ్యాధులు శనిగ్రహా ప్రతీకూలత వల్ల వస్తాయంటారు. ఇళ్ళు కూలిపోవడం, అగ్నిప్రమాదాలు జరగడం కనుబొమ్మల రెప్పలు కాలిపోవడం శనిప్రభావమే! సాధువులకూ, దీనులకూ వంట పాత్రలు దానం చెయ్యాలి. శని ప్రతిమను లోహంతో చేయించి పూజించి నల్లనువ్వులూ నూనెపాత్రతో సహా బ్రాహ్మనిడికి

''య:పునర్భ్రష్ట రాజ్యాయ సలాయ పరితోషిత: స్వప్నేదదౌనిజం రాజ్యం సమేసౌరి||.''

అంటూ దానం చెయ్యాలి.

నలుడు రాజ్యం కోల్పోయి నానా కష్టాలు పడ్డాక ఈ మంత్రాలతో తిరిగి విజయం సాధించాడు. విజయం సాధించడానికి వేరే మంత్రాలూ వాటి మాత్రిక లక్షణాలూ ఏమీ లేవు కృషి తప్ప! ఈశ్వర శక్తిని గమనించి మనం ఎంతో నేర్చుకోవలసింది వుంది. బాధలకు కృంగి పోయి శనిని తిట్టుకుంటూ కూర్చోడం కంటే కష్టాన్ని ఎదురీదాలనే తపస్సే మంత్రం దాన్ని ఆచరించడమే పరిహారం!

ఏకాదశులలో 'షటతిలైకాదశి' అని వస్తుంది. ఆరోజున నీళ్ళల్లో నువ్వులు వేసుకొని స్నానం చెయ్యాలి. నువ్వులు ముద్దగా నూరి ఒంటికి రాసుకోవాలి. ఆరు నువ్వు గింజలు తినాలి. త్రాగే నీటిలో నువ్వులు వేసుకు తాగాలి. కాసిని నువ్వులు దానం ఇవ్వాలి. వాటితో తర్పణం వదలాలి. ఇలా చేస్తే విష్ణువుకు ప్రీతి కలుగుతుందీ. శనికి మన బంధన వదులుతుంది.