9, డిసెంబర్ 2011, శుక్రవారం

రేపు సంపూర్ణ చంద్ర గ్రహణం

సంపూర్ణ చంద్ర గ్రహణం శనివారం సంభవించనుంది. ఈ ఏడాదిలో ఇది రెండోసారి. దీని తర్వాత మళ్లిd ఏడేళ్ల వరకూ చంద్రగ్రహణాన్ని దర్శించే అవకాశం లేనందున దీ నికి ప్రాధాన్యత పెరిగింది. మన దేశంలో ఈ గ్రహణం సాయంత్రం 6.15 నిముషాలకు ప్రారంభమై 7.36 నుంచి 8.28 వరకు ఉంటుంది. ఇంతకు ముందు జూన్‌ 15న ఏర్పడిన చంద్ర గ్రహణాన్ని మేఘాల కారణంగా దేశంలోని పలు ప్రాంతాల వారు దర్శించలేకపోయారని, ఈ సారి వాతావరణం బాగుంటుందని నిపుణులు చెబుతున్నారు. తర్వాత చంద్ర గ్రహణం 2018లోనేనని వారు తెలిపారు.
శ్రీవారి ఆలయం మూసివేత
చంద్ర గ్రహణం సందర్భంగా శ్రీవారి ఆలయాన్ని శనివారం మూసివేయనున్నట్లు టిటిడి తిరుమల జెఇఓ శ్రీనివాసరాజు తెలిపారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 10.30 గంటల వరకు ఆలయం తెరచిఉండదని చెప్పారు. ఈ కారణంగా ఉదయం 6 గంటల తర్వాత భక్తులను వైకుంఠం -2 కాంప్లెక్సులోనికి అనుమతించరు. సంపూర్ణ చంద్ర గ్రహణం కారణంగా శ్రీవారికి నిర్వహించే ఆర్జిత సేవలైన కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలను రద్దు చేశారు. ఒక్క సుప్రభాతసేవకు మాత్రమే భక్తులను అనుమతించనున్నారు. రాత్రి 10.30 గంటలకు శ్రీవారి ఆలయం ద్వారాలు తెరచిన అనంతరం పుణ్యహవచనం, శుద్ధి, రాత్రి కైంకర్యాలు, పూజా కార్యక్రమాలను అర్చకులు నిర్వహించనున్నారు. రాత్రి 11.30 గంటలకు కార్తీక దీపోత్సవాన్ని శాస్త్రోక్తంగా చేస్తారు. శ్రీవారి భక్తులను వైకుంఠం-2 కంపార్టుమెంటులోకి శనివారం రాత్రి 10.30 గంటల నుంచి మాత్రమే అనుమతిస్తామని జెఇఓ శ్రీనివాసరాజు తెలిపారు.
పాలకమండలి సమావేశం
తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సమావేశం ఆదివారం తిరుమల అన్నమయ్య భవన్‌లో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి టిటిడి చైర్మెన్‌ కనుమూరి బాపిరాజు అధ్యక్షత వహిస్తారు. పాలకమండలిలో ప్రధానంగా జనవరి 1వ తేదీన, జనవరి 5న వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులకు దర్శన, వసతి అంశాల గురించి చర్చిస్తారు. ఆ రోజులలో విఐపిలకు మంజూరు చేసే పాసులు గురించి చర్చించే అవకాశం ఉంది. ప్రతి ఏటా వైకుంఠ ఏకాదశి రోజు అధిక రద్దీ కావడం వల్ల వైకుంఠం క్యూ కాంప్లెక్సులో గేట్లు విరిచేయడం, క్యూ లైన్లో భక్తుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని అటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకున అవకాశం ఉంది. అంతే కాక టిటిడి విద్యా సంస్థలోని కాంట్రాక్ట్‌ ఉద్యోగుల వేతనాల క్రమబద్ధీకరణపై చర్చించే అవకాశం ఉంది. మార్పులు చేర్పులపై ఎండోమెంట్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రమణాచారి, తిరుమల జెఇఓ శ్రీనివాసరాజుకు సూచనలు చేసినట్లు సమాచారం.
రేపు శ్రీశైలంలో ఆలయం తలుపులు మూసివేత
కర్నూలు ,కెఎన్‌ఎన్‌బ్యూరో: త్రిపాదాధిక చంద్రగ్రహణం సందర్భంగా శనివారం శ్రీశైలంలోని బ్రమరాంభ మల్లికార్జున స్వామి వార్ల దేవాలయ ద్వార తలుపులు మూసివేయనున్నారు. ఉదయం 3.30 గంటలకు దేవాలయంలో మంగళవాయిద్యాలు, సుప్రభాతసేవ, కాలపూజలు, హారతులు నిర్వహించిన తర్వాత 9 గంటల తర్వాత ఆలయ ద్వారాలు మూసివేస్తారు. ఆ రోజు సాయంత్రం జరిగే పల్లకి సేవ, స్వామివార్ల కల్యాణం, పయనింపు సేవ, ఏకాంత సేవలు కూడా రద్దు చేశారు. ఆదివారం ఉదయం 4 గంటలకు ఆలయం ద్వారాలు తెరిచి, ఆలయాన్ని శుభ్రం చేసి, సంప్రోక్షణ పూజలు నిర్వహిస్తారు. అనంతరం మంగళవాయిద్యాలు, సుప్రభాత సేవ, కాలపూజలు, హారతులు నిర్వహించిన తర్వాత 6 గంటల నుంచి భక్తులకు ధర్శనాలు, అభిషేకాలకు అనుమతిస్తారు.అలాగే జిల్లాలోని పలు దేవాలయాల తలుపులు కూడా చంద్రహ్రగణం సందర్భంగా మూసి వేయనున్నారు. ప్రధానంగా మంత్రాలయంలో రాఘవేంధ్రస్వామి, మహానందిలో నందీశ్వరుడు, అహోబిలంలో లక్ష్మీనరసింహస్వామి, ఉరుకుందలో నరసింహస్వామి ఆలయాల తలుపులు మూసివేస్తారు. మహానందిక్షేత్రంలో ఈనెల 10వ తేదీ ఉదయం 12 గంటల తర్వాత ఆలయాలను మూసివేస్తున్నట్లు వేద పండితులు తెలిపారు. త్రిపాదాధిక చంద్రగ్రహణం సందర్భంగా స్వామి అమ్మవార్లకు మహానివేదన అనంతం ఆలయాన్ని మూసివేస్తామన్నారు. మళ్ళీ 11వ తేదీ తెల్లవారు జామున సంప్రోక్షణ పూజలు నిర్వహించిన తర్వాత 7 గంటల నుంచి భక్తులకు దైవదర్శనానికి అనుమతిస్తున్నట్లు తెలిపారు