8, నవంబర్ 2010, సోమవారం

ఆటకేక్కుతున్న ఆశయ సాధన

దేశ ప్రగతి ప్రజలు విద్యాభివృద్ధిపై ఉందని గ్రహించిన ప్రభుత్వాలు విద్యాభివృద్ధికి ఎన్నో కోట్లు ఖర్చుచేసి వయోజన విద్యా కేంద్రాలు, నిరంతర విద్యా కేంద్రాలు, సాక్షర భారత్‌ లాంటి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి కృషి చేస్తున్నా పథకాల్లో ఉన్న ఆశయ సాధనకానరావడం లేదు.

తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు అమలుకు సొంత రాజకీయ నాయకులే కారణమని .. తమ పార్టీకి చెందిన వారు.. తమ వర్గానికి చెంది ఉండపోతే ప్రభుత్వ పథకాలకు మోకాలడ్డు వేస్తున్న స్వార్ధ రాజకీయాలకు పాల్పడుతున్న నాయకులు ఉన్నంత వరకు ప్రభుత్వ ఆశయానికి గండి తప్పడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.

సంపూర్ణ అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు ఉద్దేశించి కేంద్ర ప్రభుత్వం సదాశయంతో సాక్షర భారత్‌ను ప్రవేశపెట్టింది. రాజకీయ నాయకుల కారణంగా ఇప్పటికీ బాలారిష్ట దశ నుంచి ఇది అధిగమించలేదు. గత పథకాల మాదిరిగానే ఈ పథకం నీరుగారిపోతోందని పలువురు విశ్లేస్తున్నారు.

ఆరు నెలల్లో ఈ కార్యక్రమం పూర్తి చేయాలన్నది అధికారుల లక్ష్యం. నాలుగు నెలల్లో ఒకటో వాచకం, రెండు నెలల్లో రెండో వాచకం నేర్పించేందుకు రాత పుస్తకం, పెన్సిల్‌, రబ్బరు, మెండర్‌ ప్రతి నిరక్షరాస్యునికీ అందించారు. ఈ పరికరాలు గ్రామ సమన్వయకర్త ఇళ్లల్లో మూలుగుతున్నాయని ఆరోపనలున్నై.

గౌరవ భృతి పొందిన వారికి రాజకీయ అండదండలు ఉండడంతో సాక్షర భారత్‌ కేంద్రాలు చీకట్లోనే నిద్రపోతున్నాయి. నిబంధనల మేరకు నాలుగు నెలల్లో వాచకం పూర్తి చేయాల్సి ఉన్నప్పటికీ రెండు నెలలు గడిచిపోయింది. అంటే ఎనిమిదో వంతు పుస్తకం పూర్తవ్వాలి. కానీ పూర్తయినట్లు గ్రామ, మండల కో-ఆర్డినేటర్లు నమోదు చేస్తున్నారు. మండల కో-ఆర్డినేటర్‌ ఆఫీసుకే పరిమితమవడం పర్యవేక్షణ లేకపోవడంతో, ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. వీరిపైన చర్యలు తీసుకోవడానికి కూడా అధికారులు వెనకడుగు వేస్తున్నారు.

రాజకీయ నాయకుల సిఫార్సుపై పని చేస్తున్నా వీరు ప్రభుత్వ ఆశయాన్ని నెరవేరుస్తారా అన్నది శేష ప్రశ్నగా మిగిలిందని ప్రజలు పేర్కొంటున్నారు.