26, ఫిబ్రవరి 2011, శనివారం

రాష్ట్రంలో అనిశ్చితి కి బీజేపీయే కారణం

శాసనసభలో తెలంగాణవాదాన్ని గట్టిగా వినిపిస్తామని చెప్పినవారు సమావేశాలను అడ్డుకుంటున్నారని,ఇక సోమవారం నుండి వారు పద్దతి మార్చుకోకుండా సభను అడ్డుకుంటే శాసనసభ్యులను సస్పెండ్ చేస్తామని..చేసేందుకు వెనకాడబోమని.. సభను నడిపించేందుకు తమకున్న అన్నిఅధికారాలను వినియోగించుకుంటామని ప్రభుత్వ చీఫ్ విప్ మల్లుభట్టి విక్రమార్క చెప్పారు.

శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలోఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యేలు ప్రజా సమస్యలపై చర్చించాలిగాని, ఇలా దుర్వినియోగం చేయడం తగదని అన్ని పార్టీల సభ్యులు సహకరించాలని కోరినప్పటికీ కొన్ని పార్టీలు పనిగట్టుకుని కావాలనే సమావేశాల్ని అడ్డుకుంటున్నారని ఆయన విమర్శించారు. శాసనసభ సమావేశాలకి ఎంత డబ్బు వృధా అవుతుందో ఆలోచించాలని, ఇదంతా ప్రజల సొమ్మేనని ఆయన గుర్తు చేశారు. ప్రతి విషయంలోనూ కాంగ్రెస్‌ను తప్పుబట్టడం బిజెపి అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి అలవాటైపోయిందని, అసలు ప్రత్యేక తెలంగాణా అక్కరలేదని అద్వానీ అన్నట్లు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు పేర్కొన్న విషయాన్ని గుర్తు చేస్తూ రాష్ట్రంలో సమస్యలు రావడానికి, అనిశ్చితి నెలకొనడానికి కారణం బీజేపీయేనని విమర్శించారు