11, డిసెంబర్ 2011, ఆదివారం

యుపిఎ కూటమిలో అజిత్‌సింగ్‌

కేంద్రంలో అధికారంలో ఉన్న యునైటెడ్‌ ప్రోగ్రెసివ్‌ అలియన్స్‌(యుపిఎ) కూటమిలోకి అజిత్‌ సింగ్‌ నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్‌దల్‌ చేరింది. రానున్న ఉత్తరప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కలిసి ఆర్‌ఎల్‌డి పోటీచేయాలని నిర్ణయిం చాయి. శనివారం నాడు యుపిఎ చైర్‌పర్సన్‌, కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీని ఆమె నివాసంలో ఆర్‌ఎల్‌డి అధినేత అజిత్‌ సింగ్‌ కలుసుకుని యుపిఎ కూటమిలో చేరడానికి సుముఖత వ్యక్తం చేశారు. అజిత్‌సింగ్‌ నిర్ణయాన్ని సోనియాగాంధీ స్వాగతించారు. ఆర్‌ఎల్‌డికి లోక్‌సభలో ఐదుగురు పార్లమెంట్‌ సభ్యులున్నారు. యుపిఎ కూటిమిలోకి చేరినందున ఆర్‌ఎల్‌డికి కేంద్ర కేబినెట్‌లో చోటు కల్పించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రాష్ట్రీయ లోక్‌దల్‌ పార్టీని యుపిఎ కూటమిలోకి తీసుకురావడానికి కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు మోహన్‌ ప్రకాష్‌ విశేషంగా కృషి చేశారు. శనివారంనాడు సోనియాగాంధీతో అజిత్‌సింగ్‌ భేటీలో కూడా మోహన్‌ ప్రకాష్‌ ఉన్నారు.
భేటీ అనంతరం మోహన్‌ ప్రకాష్‌ మీడియాతో మాట్లాడుతూ ఆర్‌ఎల్‌డి అధినేత అజిత్‌ సింగ్‌ త్వరలో ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ను కలుసుకుంటారు.
కేబినెట్‌లో బెర్త్‌కు సంబంధించి సాధ్యాసాధ్యాలను పరిశీలించి ఆర్‌ఎల్‌డికి చోటు కల్పించడం జరుగుతుందని, యుపిఎ భాగస్వామి అయినందున ఆర్‌ఎల్‌డికి అధికారాన్ని పంచుకునే అర్హత ఉందని ప్రకాష్‌ పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లిd ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌- ఆర్‌ఎల్‌డి కలిసి పోటీచేస్తాయని తెలిపారు. సమాజ్‌వాదీ పార్టీ నేత, మాజీ కేంద్ర మంత్రి రషీద్‌ మసూద్‌తో పాటు పలువురు సీనియర్‌ నాయకులు త్వరలోనే కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నారని మోహన్‌ప్రకాష్‌ వెల్లడించారు.