11, డిసెంబర్ 2011, ఆదివారం

పాపం పెద్దోళ్లది - భారం ప్రజలది

ప్రపంచ ఆర్థిక సంక్షోభాన్ని సృష్టించిన పాపం ఒకరిదైతే భారం మరొకరిపై పడుతున్నది. ప్రపంచ వ్యాప్తంగా శ్రామిక వర్గం ఈ పాప ఫలితాన్ని అనుభవిస్తున్నది. సుమారు 5 కోట్ల మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. అంతర్జాతీయ కార్మిక సంఘం లెక్కల ప్రకారం సాధారణ స్థితి రావడానికి మరో 3-4 ఏళ్లు పడుతుంది. అభివృద్ధి చెందిన దేశాల కార్మికులపై భారం మరీ తీవ్రంగా పడింది. ఐఎల్‌ఓ తన నివేదికలో ఇలా పేర్కొన్నది. 'సమాచారం లభ్యమవుతున్న 35 దేశాల్లో, సుమారు 40 శాతం ఉద్యోగస్తులు గత సంవత్సర కాలం నుండి ఉపాధి దొరకక తీవ్ర నిరాశలో మునిగిపోయారు. ఎంతోమంది యువకులకు ఉద్యోగాలు దొరకడం లేదు. ఉద్యోగం దొరికినా అది ఎక్కువ కాలం నిలుస్తుందన్న నమ్మకం లేదు. తమ నైపుణ్యానికి తగిన ఉద్యోగం దొరకడం లేదని చాలా మంది అసంతృప్తితో ఉన్నారు. 2009 నాటికి సుమారు 40 లక్షల మంది ఉద్యోగార్థులు ఇక ఉద్యోగం కోసం వెదకడం దండుగని విరమించుకున్నారు. పెట్టుబడిదారీ సంక్షోభం కోట్లాది శ్రామిక జనుల బ్రతుకులను చిన్నాభిన్నం చేసింది.
దివాళా తీసిన బ్యాంకులను గట్టెక్కించడానికి పెట్టుబడిదారీ దేశాలు కోట్లాది డాలర్లను వెచ్చించాయి. సంక్షోభాన్ని ఎదుర్కొనే క్రమంలో భాగంగా ఎన్నో పొదుపు చర్యలను చేపట్టారు. సంక్షేమ పథకాలకు అందించే నిధులను పూర్తిగా తగ్గించారు. ప్రభుత్వరంగ ఉద్యోగుల జీతభత్యాల్లో కోత విధించారు. ఒకవైపు రిటైర్మెంట్‌ వయసును పెంచేసి మరోవైపు పెన్షన్‌ సదుపాయాలను తగ్గించారు. 5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను రద్దుచేసిన బ్రిటన్‌ ప్రభుత్వం ఉద్యోగుల పెన్షన్‌ అర్హతా వయస్సును పెంచేసింది. పోర్చుగీసు ప్రభుత్వం ఉద్యోగుల వేతనాల్లో 5 శాతం కోత విధించింది. జర్మనీ సంక్షేమ పథకాల నిధులను తగ్గించింది. ఫ్రెంచి ప్రభుత్వం ఉద్యోగుల రిటైర్మెంట్‌ వయసును 60 నుంచి 62 కి పెంచి, పెన్షన్‌ అర్హత వయస్సు 65 నుండి 67 మార్చింది.
ఈ పరిణామాలను నిరసిస్తూ ప్రపంచవ్యాప్తంగా కార్మికవర్గం ఉవ్వెత్తున ఉద్యమించింది. సంక్షోభానికి కారకులయిన వారు పాప ఫలితం అనుభవించాలి తప్ప కార్మికులపై భారాలు మోపితే సహించమంటూ కార్మికులు నినదించారు. కార్మిక సంఘాల సభ్యత్వం ఒక్కసారిగా పెరిగింది. సమరశీల పోరాటాలు చేపట్టిన కార్మికులు ప్రభుత్వాల విధానాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 2010 అక్టోబర్‌ 2న అమెరికా కార్మికులు వాషింగ్టన్‌ వీధుల్లో పెద్ద ప్రదర్శన నిర్వహించారు. సుమారు 3 కోట్లుగా వున్న నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని, నైపుణ్యానికి తగిన ఉద్యోగాలను కల్పించాలని ప్రదర్శనకారులు డిమాండ్‌ చేశారు. ఈమధ్య కాలంలో అమెరికాలో జరిగిన అతిపెద్ద కార్మిక ప్రదర్శనగా విశ్లేషకులు దీన్ని పేర్కొన్నారు.
యూరప్‌లో కూడా నిప్పు రాజుకుంది. సమ్మెలు, ప్రదర్శనలు అక్కడ నిత్యకృత్యమయ్యాయి. తమ జీవన ప్రమాణాలపై జరుగుతున్న దాడిని తిప్పికొట్టడానికి గ్రీకు కార్మికవర్గం వీరోచిత పోరాటాలకు పూనుకున్నది. పోలీసు కాల్పుల్లో ముగ్గురు కార్మికులు అమరులయ్యారు. నిరుద్యోగిత 20 శాతానికి చేరుకున్న స్పెయిన్‌లో కార్మిక ఉద్యమాలు వెల్లువలా చెలరేగాయి. పారిశ్రామిక సమ్మెలు ఫ్రాన్స్‌ ఆర్థిక వ్యవస్థలోని అన్ని రంగాలకు అంటుకున్నాయి. విమానాశ్రయాలు, రైల్వే, పోస్టల్‌, ఆస్పత్రులు, రిఫైనరీలు అన్ని రంగాలు సమ్మెలతో స్థంభించిపోయాయి. సర్కోజీ నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న కార్మికులకు విద్యార్థులు, ఇతర వర్గాల నుండి అనూహ్య మద్దత్తు లభిస్తుంది. బ్రిటన్‌, ఇటలీల్లోనూ కార్మిక ఉద్యమాలు ఉవ్వెత్తున లేస్తున్నాయి. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అతి పెద్ద కార్మిక సమ్మె 2010 సెప్టెంబర్‌ 29న యూరప్‌లో జరిగింది. 35 దేశాల్లోని లక్షలాది మంది కార్మికులు ఆ రోజున సమ్మె చేశారు. మన దేశంలో స్వాతంత్య్రానంతరం అతిపెద్ద కార్మిక సమ్మె 2010, సెప్టెంబర్‌ 7న జరిగింది. ఆ రోజున సుమారు 10 కోట్ల మంది కార్మికులు సమ్మెబాట పట్టారు.
నయా ఉదారవాదం ప్రపంచ వ్యాప్తంగా ప్రజల జీవితాలను ధ్వంసం చేసింది. అమెరికా నిర్దేశకత్వంలో ఐఎంఎఫ్‌, ప్రపంచ బ్యాంకులను సాధనాలుగా చేసుకొని ఈ నయా ఉదారవాద విధానాలను వర్థమాన దేశాలపై అప్రజాస్వామికంగా రుద్దారు. వ్యాపారంపై నున్న అన్ని ఆంక్షలను తొలగించాలని, ప్రభుత్వ ప్రమేయాన్ని తగ్గించాలని ఈ విధానాల సారాంశం. ఈ విధానాలకు నేడు ప్రతిచోట వ్యతిరేకత ఎదురవుతున్నది. నియంత్రణలు పూర్తిగా ఎత్తివేయాలనే విధానం ఇక చెల్లుబాటు కాదని 2009 లో జరిగిన జి-20 సమావేశంలోనే బ్రిటన్‌ ప్రధాని గార్డన్‌ బ్రౌన్‌ తేల్చి చెప్పారు. మన సమాజంలో శృంఖలాలు ఉండకూడదు నిజమే కాని, విశృంఖలత్వానికి కూడా తావులేదని బ్రౌన్‌ స్పష్టీకరించాడు. ఇదే అభిప్రాయాన్ని ఆస్ట్రేలియా ప్రధాని కెవిన్‌ రన్‌ కూడా వ్యక్తీకరించాడు. ''నియంత్రణ లేని మార్కెట్లే అన్ని సమస్యలను పరిష్కరించగలిగే దేవతలను కొందరు కొలుస్తున్నారు. అవి క్షుద్ర దేవతలని నేడు తేలింది.'' నయా ఉదారవాదాన్ని వేనోళ్లా పొగిడిన వారే ఇప్పుడు దాన్ని ఈసడించుకుంటున్నారనడానికి ఇవి ప్రబల నిదర్శనాలు.
విధాన నిర్ణయాల్లో తమకు కూడా పాత్ర ఉండాలని నేడు వర్థమాన దేశాలు గట్టిగా నిలబడుతున్నాయి. సమస్త మానవజాతి భవిష్యత్తును నిర్ణయించే అధికారం ధనిక దేశాల కెక్కడిదనే ప్రశ్నలు నేడు ఉత్పన్నమవుతున్నాయి. ఐక్యరాజ్యసమితిలోని 196 దేశాలు ఒక ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి ప్రజల జీవన స్థితిగతుల్లో మెరుగుదల తీసుకురాలేని అభివృద్ధికి అర్థంలేదని తేల్చిచెప్పాయి. అమెరికా ఆధిపత్యాన్ని కూడా నేటి ప్రపంచం ప్రశ్నిస్తున్నది. ఆర్థిక సంక్షోభానికి తోడు అఫ్ఘనిస్తాన్‌, ఇరాక్‌లలో తగిలిన ఎదురుదెబ్బలు అమెరికా సామ్రాజ్యవాదాన్ని మరింత బలహీనపరిచాయి.
తమ జీవన ప్రమాణాలు నానాటికీ దిగజారడం చూస్తున్న ప్రజలు తమ ప్రభుత్వాలపై నమ్మకం కోల్పోతున్నారు. ఐఎల్‌ఓ నిర్వహించిన ఒక సర్వే ప్రకారం ఆయా దేశాల్లోని మెజారిటీ ప్రజలు పెట్టుబడిదారీ విధానంపై తమకు నమ్మకంలేదని తేల్చిచెప్పారు. నయాఉదారవాద ఆర్థిక నమూనా నేడు సవాళ్లను ఎదుర్కొంటున్నది. లాటిన్‌ అమెరికా ఖండం ప్రత్యామ్నాయ విధానాలతో అభివృద్ధి పథంలో దూసుకెళుతున్నది. మౌలిక వసతుల కల్పనలో పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టి అంతర్గత డిమాండ్‌ను సృష్టించిన చైనా ప్రపంచ ఆర్థిక సంక్షోభ ప్రభావం నుండి సునాయాసంగా తప్పించుకోగలిగింది. నేటివరకు అనుసరిస్తున్న నయా ఉదారవాద విధానాలపై పున: సమీక్ష జరిపి ఆర్థిక వ్యవస్థను సక్రమ మార్గంవైపు మళ్లించడానికి భారత దేశానికిదే సరైన సమయం.