11, డిసెంబర్ 2011, ఆదివారం

పుతిన్‌ పాలన ఇక చాలంటున్న రష్యన్లు

రష్యా ప్రధాని వ్లాదిమిర్‌ పుతిన్‌ నేతృత్వంలోని యునైటెడ్‌ రష్యా పార్టీ పార్లమెంటులో 238 స్థానాలను సంపాదించినప్పటికీ, ఆయన పట్ల ప్రజా వ్యతిరేకత ఎక్కువగా ఉంది. శనివారంనాడు మాస్కోలోనూ, దేశంలోని వివిధ నగరాల్లోనూ వేలాది మంది ప్రజలు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. మాస్కోలో క్రెవ్లిున్‌కి సమీపంలోని స్క్వేర్‌ వద్ద వేలాది మంది గుమిగూడి “పుతిన్‌ పాలన ఇక చాలు’ అంటూ నినాదాలు చేశారు. డ్యూమా ఎన్నికల్లో అక్రమాలు పెద్ద ఎత్తున చోటు చేసుకున్నాయని ప్రదర్శకులు ఆరోపించారు. రేవు నగరమైన వ్లాదివోస్టోక్‌లో గత ఆదివారం జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో పుతిన్‌ పార్టీ అయిన యునైటెడ్‌ రష్యా కమ్యూనిస్టుల చేతిలో ఓటమి పాలైంది.అలాగే,ఖాబారోవస్క్‌ నగరంలో జరిగిన నిరసన ప్రదర్శనలో వేలాది మంది పాల్గొన్నారు. మాస్కోలో జరిగిన ప్రదర్శకులు పుతిన్‌,మెద్వెదెవ్‌లు తప్పుకోవల్సిందే నన్న నినాదాలు గల అట్టలు చేత పుచ్చుకున్నారు.
కాగా, నిరసన ప్రదర్శన కారణంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మాస్కోలో 50 వేల మంది భద్రతా సిబ్బందితో పటిష్ఠమైన బందోబస్తును ఏర్పాటు చేశారు.ఈ ప్రదర్శనల్లో పాల్గొన్న వారిలో ఎక్కువ మంది కమ్యూనిస్టులు ఉన్నారు. అయితే, పుతిన్‌ ఈ ప్రదర్శనలు జరిపిన వారికి ఆ హక్కు ఉందంటూ వ్యాఖ్యానించారు. ఈ ప్రదర్శకులకు అమెరికా మద్దతు ఉందని అధికార పార్టీ నాయకులు ఆరోపించారు.