11, డిసెంబర్ 2011, ఆదివారం

ఎపి ట్రాన్స్‌కో, డిస్కంల్లో ఉద్యోగ మేళా

ఎపి ట్రాన్స్‌కోతో పాటు రాష్ట్రంలోని నాలుగు డిస్కంల పరిధిలో 6,263 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. గతంలో ఇంత పెద్ద స్థాయిలో ఉద్యోగ మేళా నిర్వహించలేదు. ఒకే సారి ఇన్ని ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఈ నెల 15న ప్రభుత్వం నోటిఫికేషన్‌ను విడుదలచేయనుంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రకటించిన లక్ష ఉద్యోగాల్లో భాగంగానే విద్యుత్‌ సంస్థల్లో ఉద్యోగాలను భర్తీ చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలో విద్యుత్‌కు నానాటికి పెరుగుతున్న ఆదరణ, గుర్తింపు, అన్నింటికి మించి డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని శాఖలో సేవలందించేందుకు అన్ని విభాగాలలో అవసరమైన పద్ధతిలో ఉద్యోగులను నియమించనున్నారు. రాష్ట్రంలోని విద్యుత్‌ వినియోగదారులకు మెరుగైన సేవలను అందించడమే ప్రభుత్వ లక్ష్యంగా ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి దినేష్‌ కుమార్‌ పేర్కొన్నారు.
విద్యుత్‌ వ్యవస్థలో వివిధ విభాగాల్లో అవసరమైన ఖాళీలను భర్తీచేసేందుకు సాగే ప్రక్రియ పూర్తిగా పారదర్శకతతో ఉంటుందని ఆయన చెప్పారు. ఇందులో సంస్థ ఉద్యోగులతో పాటు ఉన్నత స్థాయిలోని అధికారులు సైతం జవాబుదారిగా ఉండే విధంగా ఒక ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు. ఈ మేరకు ఆయన ఎపి ట్రాన్స్‌కో సిఎండి అజయ్‌జైన్‌, డిస్కంల సిఎండిలు అనంతరాము, ఆహ్మద్‌ నదీం, సిహెచ్‌ నర్సింహారెడ్డి, కె విద్యాసాగర్‌రెడ్డి, జెఎండిలు రంగనాథం తదితర అధికారులతో దినేష్‌ కుమార్‌ టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వారితో మాట్లాడుతూ, ఉద్యోగుల ఖాళీలు భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్‌ విడుదల, ఉద్యోగుల నియామకాల్లో అనుసరించాల్సిన విధానాలను ఆయన చర్చించారు. డిసెంబర్‌ 15న నోటిఫికేషన్‌ను విడుదల చేయాలని, ఆతర్వాత చేపట్టాల్సిన చర్యల గురించి అధికారులను ఆయన అప్రమత్తం చేశారు. ప్రకటించిన ఉద్యోగ పోస్టులను అన్నింటిని భర్తీ చేసేందుకు ఎక్కడా ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని ఆయన సూచించారు.
ఎపి ట్రాన్స్‌కోలో మొత్తం 2,261 పోస్టులను భర్తీచేయనున్నారు. ఇందులో జూనియర్‌ లైన్‌ మెన్‌లు 1648, జూనియర్‌ అసిస్టెంటులు 16, సబ్‌ ఇంజనీర్లు 347, అసిస్టెంట్‌ ఇంజనీర్లు 250 పోస్టులను భర్తీ చేయనున్నారు. రాష్ట్రంలోని నాలుగు డిస్కంల పరిధిలో 4002 పోస్టులను భర్తీచేయనున్నారు. ఇపిడిసిఎల్‌లో జూనియర్‌ లైన్‌మెన్‌ (జెఎల్‌ఎం) 937, జూనియర్‌ అసిస్టెంట్‌లు (ఎల్‌డిసి) 58, సబ్‌ ఇంజనీర్లు 35, ఎస్‌పిడిసిఎల్‌ జెఎల్‌ఎం 1316, ఎల్‌డిసి 144, సిపిడిసిఎల్‌ పరిధిలో జెఎల్‌ఎం 1169, ఎల్‌డిసిలు 100, ఎన్‌పిడిసిఎల్‌ ఎల్‌డిసిలు 182, సబ్‌ ఇంజనీర్లు 61 ఉద్యోగాలకు నియామకాలను చేపట్టనున్నారు. మొత్తం జూనియర్‌ లైన్‌మెన్‌లు 5070, ఎల్‌డిసిలు 500, సబ్‌ ఇంజనీర్లు 443, అసిస్టెంట్‌ ఇంజనీర్లు 250 ఉద్యోగాలు ఇందులో ఉన్నాయి. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల విద్యుత్‌ సంస్థలోని అన్ని యూనియన్ల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర ఇంధన శాఖ కార్యదర్శి పి ఉమాశంకర్‌ చేసిన ప్రకటనలో బాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నియామకాలను పూనుకున్నట్టు సమాచారం. ఇంధన శాఖలో దేశ వ్యాప్తవంగా 6 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని నిర్ణయించారు. 12వ పంచవర్ష ప్రణాళికలో పెద్ద మొత్తంలో ఉద్యోగ ఖాళీలను పూరించాలని కేంద్రం భావిస్తున్నట్టు తెలుస్తోంది. భవిష్యత్‌లో రాష్ట్ర ఇంధన శాఖలో మరిన్ని ఉద్యోగాలను భర్తీచేసే అవకాశం ఉందని ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు.
ఆర్టీసీలోనూ భారీగా నియామకాలు
త్వరలో నోటిఫికేషన్‌
ఆర్టీసీ మరో సారి భారీ స్ధాయిలో సిబ్బంది నియామకాలకు సిద్దపడింది. కొత్తగా 4 వేల బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయించిన పాలక మండలి సిబ్బంది సమస్యపై దృష్టి కేంద్రీకరించింది. ఇప్పటికే 12 వేల మంది డ్రైవర్‌, కండక్టర్లను నియమించింది. మరో మూడు వేల మంది వరకు కాంట్రాక్టు పద్దతిలో డ్రైవర్‌, కండక్టర్లుగా విధులు నిర్వహిస్తున్నారు. గ్యారేజీల్లో సిబ్బంది నియామకాలు లేక పోవడంతో సాంకేతిక పరమైన సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. సమీప భవిష్యత్‌లో ఆరు వేల మెకానిక్‌లను, 500 మంది క్లరికల్‌ సిబ్బందిని నియమించాలని భావిస్తున్నారు. ప్రభుత్వ ఆమోదం లభించిన వెంటనే నోటిఫికేషన్‌ జారీ చేసే అవకాశం ఉంది. బస్సుల సంఖ్యను పెంచుకోవడం, అందుకు అనుగుణంగా సిబ్బంది నియామకాలు జరపడం కోసం ఇప్పటికే ప్రభుత్వం నుండి ఆర్టీసీ యాజమాన్యం ఆమోదం పొందింది.