11, డిసెంబర్ 2011, ఆదివారం

అహ్మద్‌పటేల్‌తో కెసిఆర్‌ చర్చలు?

తెరాస అధినేత కె.చంద్రశేఖరరావు తెలంగాణ అభివృద్ధికి ప్రత్యేక మండలి ఏర్పాటు చేయాలన్న కేంద్ర ప్రతి పాదనకు అంగీకరించారా? అనే అంశం చర్చనీయాంశమైంది. ఈ మధ్య కెసిఆర్‌ పత్రికల వారికి దూరంగా ఉంటూ నివాసం నుండే చర్చల ప్రక్రియ కొనసాగిస్తున్నారు. మూడురోజులపాటు మెదక్‌ జిల్లాలో సొంత వ్యవ సాయ క్షేత్రంలో ఎవరికీ అందుబాటులో లేకుండా గడపడంతో పాటు అక్కడి నుండే ఫోన్‌ ద్వారా కేంద్రం, కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్‌పటేల్‌తో పలు దఫాలుగా చర్చలు జరిపినట్టుగా సమాచారం. తెరాస సీనియర్‌ నాయకుడు హరీష్‌రావు మాత్రం కాంగ్రెస్‌ అధిష్ఠానం తెరాసకు ఎటువంటి ఫోన్‌ చేయలేదని, సంప్రదింపులు జరపలేదని, తెలంగాణ తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని స్పష్టం చేశారు. రాజకీయ జెఎసి చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరామ్‌ కూడా తెలంగాణాపై కేంద్ర నిర్ణయం ప్రకటించాకే స్పందిస్తామని, కెసిఆర్‌కు ఢిల్లిd నుంచి ఎటువంటి ఫోన్‌ రాలేదని చెప్పారు. తెలంగాణ అభివృద్ధికి గుర్ఖాలాండ్‌, బోడో తరహాలో ఒక స్వయం ప్రతిపత్తి గల కౌన్సిల్‌ను ఏర్పాటు చేయాలని, ఈ కౌన్సిల్‌కు మాజీ పిసిసి చీఫ్‌ డి.శ్రీనివాస్‌ను చైర్మన్‌గా నియమించనున్నట్టు వార్తలొచ్చాయి. ఢిల్లిd వచ్చిన సందర్భంలో డిఎస్‌కు బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనాన్ని కూడా ఏర్పాటుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పిసిసి చీఫ్‌ బొత్స సత్యనారాయణలను ఢిల్లిdకి పిలిపించడంలో తెలంగాణాపై నిర్ణయం ప్రకటించేందుకేనా అన్న సంకేతాలు కూడా వెలువడుతున్నాయి. ఈ పరిస్థితుల్లోనే రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్‌, కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్‌ కూడా తెలంగాణాపై కేంద్ర నిర్ణయాన్ని ప్రకటించే సమయం ఆసన్నమైందంటూ వ్యాఖ్యానించారు. కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రివర్గ విస్తరణ కూడా తెలంగాణాపై నిర్ణయం తీసుకున్నాకే ఉంటుందని ప్రకటించడం గమనార్హం. ఢిల్లిdస్థాయిలో పరిణామాలు వేగంగా మారుతున్న నేపథ్యంలో కెసిఆర్‌ మౌనముద్ర వహించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. వరంగల్‌ జైలు నుండి విడుదలై యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు డాక్టర్‌ చెరుకు సుధాకర్‌ను శనివారం కెసిఆర్‌ పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియా ఎంత ప్రయత్నించినా ఆయన కనీసం పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. తెలంగాణాపై కాంగ్రెస్‌ అధిష్ఠానం కెసిఆర్‌తో మాట్లాడిందనే వార్తలపై వివరణ ఇవ్వాల్సి ఉంటుందనే కారణంగానే ఆయన మీడియాతో మాట్లాడకుండా వెళ్ళిపోయినట్లు పలువురు అనుమానిస్తున్నారు. ప్రత్యేక మండలిని కేంద్రం ప్రకటిస్తే దానిపై తనపై విమర్శలు వస్తాయన్న ఉద్దేశ్యంతో ఆయన ఈ విధంగా ప్రవర్తించి ఉండవచ్చునని తెలుస్తోంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రకటన ఈ పరిస్థితుల్లో చేస్తే కేంద్ర ప్రభుత్వం ఇబ్బందుల్లో పడుతుందని, ఇప్పటికే బిఎస్పీ అధినేత్రి మాయావతి, ఉత్తరప్రదేశ్‌ను నాలుగు రాష్ట్రాలుగా విభజించాలని శాసనసభలో తీర్మానం చేసిన నేపథ్యం వంటి కారణాల వల్ల తెలంగాణాకు తాత్కాలిక పరిష్కారంగా ప్రత్యేక మండలిని ఏర్పాటు చేస్తామంటూ అహ్మద్‌ పటేల్‌ కెసిఆర్‌ ముందు ప్రతిపాదించినట్లు సమాచారం.
లోక్‌సభ ఎన్నికలు 2014లో జరగనున్నందున రెండేళ్ళలో ప్రత్యేక మండలి వల్ల అభివృద్ధి చెందకపోతే ఎన్నికల ముందు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించేందుకు చర్యలు తీసుకుంటామని కూడా అహ్మద్‌ పటేల్‌ ఈ సందర్భంగా కెసిఆర్‌కు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. తెలంగాణ అంశంపై కాంగ్రెస్‌ అధిష్ఠానం తీవ్ర కసరత్తు చేసిందని, మెజారిటీ అభిప్రాయం మేరకే స్వయం ప్రతిపత్తి గల ఒక అభివృద్ధి మండలిని ఏర్పాటు చేయాలనే నిర్ణయానికి వచ్చామని, ఇందుకు సహకరించాలని కూడా కెసిఆర్‌కు అహ్మద్‌పటేల్‌ విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితులన్నీ గమనిస్తున్న కెసిఆర్‌ అహ్మద్‌పటేల్‌ ప్రతిపాదనకు కొంత సానుకూలంగా స్పందించినట్టు సమా చారం. ప్రస్తుతం ఉద్యమం రాజకీయ జెఎసి నాయకత్వంలో జరుగుతుండడం, మరోవైపు గద్దర్‌, కొండా లక్ష్మణ్‌ బాపూజీ, తెలంగాణ తెలుగుదేశం ఫోరం ఎవరికి తోచిన రీతిలో వారు ఉద్యమిస్తుండడంతో కెసిఆర్‌ కూడా ఎటూ తేల్చుకోలేక పోతున్నారనే వాదనలు వినవస్తున్నాయి. కెసిఆర్‌ కేంద్ర ప్రతిపాదనకు అంగీకరిస్తే రాజకీయ జెఎసి ప్రజాసంఘాలు, తెలంగాణ ఫోరంలు వ్యతిరేకించి ఉద్యమబాట పడితే తెరాస రాజకీయ భవిష్యత్తు డోలాయ మానంలో పడుతుందని కూడా కెసిఆర్‌ అనుమానిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కారణాల వల్లే కెసిఆర్‌ రహస్యంగా మూడు రోజుల పాటు వ్యవసాయ క్షేత్రంలో గడిపినట్లు తెలుస్తోంది.