11, డిసెంబర్ 2011, ఆదివారం

తెలంగాణ వాదం అంతంత మాత్రమే

రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, మంత్రివర్గ విస్తరణ, జగన్‌ వర్గ ఎమ్మెల్యేలపై తీసుకోవలసిన చర్యలపై చర్చించేందుకు ఢిల్లిd వెళ్ళిన ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డి తెలంగాణ అంశంపై ఓ సమగ్ర నివేదికను పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి అందజేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ నివేదికలో కీలకమైన అంశాలు చోటుచేసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. తెలంగాణ ప్రాంతంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి గతంలోని పరిస్థితులకు పూర్తి భిన్నంగా ఉందని, విద్యార్థులు, ఉద్యోగులు, ఉద్యమకారులు తమ దైనందిన కార్యకలాపాల్లో పూర్తిగా నిమగ్నమయ్యారని నివేదికలో పేర్కొన్నట్టు సమాచారం. తెలంగాణ ప్రాంతంలోని పది జిల్లాల్లో కేవలం నాలుగు జిల్లాల్లో మాత్రమే తెలంగాణ సెంటిమెంట్‌ ఉందని, ఆరు జిల్లాల్లో ఏమాత్రం సెంటిమెంట్‌ లేదని ముఖ్యమంత్రి కిరణ్‌ నివేదికలో పొందుపరిచినట్లు తెలుస్తోంది.
స్థానిక సంస్థలతో పాటు తెలంగాణ ప్రాంతంలో ఇప్పటికిప్పుడు ఉప ఎన్నికలు జరిపితే కాంగ్రెస్‌ పార్టీకి మంచి ఫలితాలు వస్తాయని నివేదికలో చెప్పినట్టు తెలుస్తోంది. తెలంగాణ వాదం ఎంతో బలంగా ఉన్న నాలుగు జిల్లాల్లో అక్కడక్కడ మాత్రమే ఉద్యమకారులు రోజుకు ఏదో ఒక పోరాటం చేస్తూ తమ వాదం బలపడే విధంగా ముందుకు వెళుతున్నారని, అన్ని నియోజకవర్గాల్లో వాదం అంతగా లేదని పేర్కొన్నారు. మెదక్‌ జిల్లాలో సిద్ధిపేట, దొమ్మాట, మెదక్‌ నియోజకవర్గంలోని కొన్ని మండలాల్లోనే తెలంగాణ వాదం ఉందని, జిల్లాలో మరెక్కడా తెలంగాణ కోసం పోరాడుతున్న వారు లేరని అందులో వివరించారు. నిజామాబాద్‌ జిల్లాలో కూడా నాలుగైదు నియోజకవర్గాల్లో మాత్రమే ఈ పరిస్థితి ఉందని చెప్పారు. బోధన్‌, బాల్కొండ, బాన్స్‌వాడ నియోజకవర్గాల్లో సెటిలర్లు బలంగా ఉన్నారని, బాన్స్‌వాడ, నిజామాబాద్‌ రూరల్‌లో తెలంగాణ సెంటిమెంట్‌ బలంగా వీస్తోందని చెప్పారు. సింగరేణి బెల్టులో సెటిలర్లు అధికంగా ఉండడం వల్ల తెలంగాణ ప్రభావం పెద్దగా లేదని అందులో పేర్కొన్నారు.
కరీంనగర్‌, వరంగల్‌ జిల్లాల్లో తెలంగాణ సాధనకు ఉధృతంగా పోరాటాలు జరుగుతున్నాయని, కాకతీయ, తెలంగాణ విశ్వవిద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థులు పోటీ పరీక్షల కోసం సిద్ధమవుతుండడంతో గతంలో లాగా ప్రత్యేక రాష్ట్ర సాధనకు ఉద్యమాలు చేయడం లేదని అందులో ముఖ్యమంత్రి వివరించారు. రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, నల్గొండ, ఖమ్మం, హైదరాబాద్‌ జిల్లాల్లో తెలంగాణ వాదం అంతంత మాత్రంగానే ఉందన్నారు. అయితే తెలంగాణపై మాత్రం పార్టీ అధినాయకత్వం సత్వరమే ఒక నిర్ణయం తీసుకోవలసి ఉంటుందని, ఏదో ఒక విషయాన్ని ప్రకటించడం ద్వారా రాష్ట్రంలో నెలకొన్న అనిశ్చితిని తొలగించేందుకు ప్రత్యేక దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి సోనియాను ప్రత్యేకంగా అభ్యర్థించారు. సోనియాతో జరిగిన చర్చల సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు చేపడుతున్న ఆందోళన కార్యక్రమాలతో పాటు తెలంగాణ రాష్ట్ర సమితి చేస్తున్న కార్యకలాపాలు, తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్ర సాధనకు చేపట్టిన కార్యక్రమాలను సోనియా అడిగి తెలుసు కున్నట్టు సమాచారం.
రాష్ట్రంలో వివిధ ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టేందుకు కొన్ని పార్టీలు యత్ని స్తున్నాయని, అభివృద్ధిలో తెలంగాణతో పాటు రాయలసీమ, కోస్తాంధ్రలోని కొన్ని జిల్లాలు వెనకబడి ఉన్నాయని, వీటిపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించి మారుమూల ప్రాంతాల అభివృద్ధికి నిధులు కేటాయించాలని ముఖ్యమంత్రి కోరారు. సీమాంధ్రలో జరిగిన అభివృద్ధి, తెలంగాణ ఉన్న అభి వృద్ధిని పోలిస్తే తెలంగాణలోనే అంతగా అభివృద్ధి జరగ లేదని, అయితే ఇతర ప్రాంతాలతో సమానంగా తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి కేంద్రం భారీస్థాయిలో నిధులను మంజూరు చేయవలసిన అవసరం ఉందని ఉద్ఘాటించారు.
రాయలసీమలోని అనంతపురం, కర్నూలు జిల్లాలతో పాటు కోస్తాలోని ప్రకాశం, ఉత్తరాంధ్రలోని విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు కూడా అభివృద్ధిలో వెనకబడి పోయాయని, ఈ జిల్లాల అభివృద్ధికి కూడా ప్రత్యేకంగా నిధులు కేటాయించి దశల వారీగా అభివృద్ధికి పాటుపడితే సమస్యలు పూర్తిగా తొలగిపోతాయని అందులో పేర్కొ న్నారు. ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక మండళ్ళను ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందన్న అంశంపై సోనియా ముఖ్యమంత్రి కిరణ్‌ను ఆరా తీసినట్టు సమాచారం. తెలంగాణపై మరోసారి అన్ని రాజకీయ పక్షాలతో సమావేశమై తుది నిర్ణయం తీసుకుందామని, అప్పటి వరకు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారించాలని సోనియా ముఖ్యమంత్రిని కోరినట్టు తెలుస్తోంది. అయితే ముఖ్యమంత్రి సోనియాకు ఇచ్చిన రహస్య నివేదికపై చర్చించేందుకు ముఖ్యమంత్రి కిరణ్‌ ససేమిరా అన్నారు. తాను అధినాయకత్వంతో చర్చించిన అంశాలను మీడియాకు చెప్పడం సబబు కాదని దాటవేశారు.