1, మార్చి 2011, మంగళవారం

అభిమానుల కోసమే డాన్స్‌ చేశా

జూ.ఎన్టీఆర్‌ కథానాయకుడిగా వైజయంతీ మూవీస్‌ నిర్మిస్తున్న భారీచిత్రం 'శక్తి' పాటల విడుదల కార్యక్రమం ఘనంగా జరిగింది. వేదికపై జూనియర్‌ డాన్స్‌ చేయడం ప్రత్యేక ఆకర్షణ. మెహర్‌రమేష్‌ ఈ చిత్రానికి దర్శకుడు. ఇలియానా కథానాయికగా నటించింది. జాకీష్రాప్‌, సోనూసూద్‌, మణిశర్మ, మంజరి, భోగవల్లి ప్రసాద్‌, బోయపాటి శ్రీను, మంజుభార్గవి, పైడిపల్లి వంశీ తదితరులు పాల్గొన్న ఈ వేడకకు అభిమానులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. 'నందమూరి వంశంలో మూడు తరాలవారితో తాను చిత్రాలు నిర్మించినట్టు' ఈ సందర్భంగా అశ్వనీదత్‌ తెలిపారు. 'భవిష్యత్తులో బాలకృష్ణ కుమారుడితో కూడా చిత్రాలు నిర్మించడానికి సిద్ధంగా ఉన్నట్టు పేర్కొన్నారు. శక్తి చిత్రాన్ని భారతదేశంలోని పలు ముఖ్య ప్రాంతాలతో పాటుగా విదేశాల్లో షూటింగ్‌ చేశామన్నారు'.'ఈ చిత్రం చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. తెలియని శక్తి ఏదో నన్ను నడిపించింది' అని దర్శకుడు మోహర్‌రమేష్‌ పేర్కొన్నారు. 'బడ్జెట్‌కు పరిమితులు విధించకుండా తీసినట్టు తెలిపారు. ఇంతవరకు ఎవరూ చేయని కొత్త లొకేషన్స్‌లో షూటింగ్‌ చేశాం. పాటలు అద్భుతంగా వచ్చాయి. ప్రేక్షకాదరణ చూరగొంటాయనే నమ్మకం ఉంది' అన్నారు.
'అభిమానుల కోసమే నేను డాన్స్‌ చేశాను. వారి కేరింతలు విని పై లోకంలో ఉన్న తాతగారు సంతోషిస్తారు. నేను మా తల్లిదండ్రుల ఆశీస్సులతో, అభిమానుల ఆశీర్వాదంతో కొనసాగుతున్నాను' అని జూ.ఎన్టీఆర్‌ అన్నారు.
'శక్తి' పాటల సీడీని జూ.ఎన్టీఆర్‌ ఆవిష్కరించి మణిశర్మకు అందజేశారు.