1, మార్చి 2011, మంగళవారం

లుగు సినిమాలో నటించాలని అనుకుంటున్నా..పునీత్‌రాజ్‌కుమార్‌

కన్నడ కంఠీరవ డాక్టర్‌ రాజ్‌కుమార్‌ నటవారసుడు పునీత్‌రాజ్‌కుమార్‌ కన్నడంలో సక్సెస్‌ఫుల్‌ కథానాయకుడు. ఆయన నటించిన పలు చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. పునీత్‌ తొలి కన్నడ చిత్రానికి తెలుగువాడైన పూరి జగన్నాథ్‌ దర్శకుడు కావడం విశేషం. ఆ తర్వాత కూడా పలువురు తెలుగు దర్శకులు ఆయనను డైరెక్ట్‌ చేశారు. తాజాగా పునీత్‌ నటించిన 'జాకీ' చిత్రాన్ని అదే పేరుతో తెలుగులో అనువదిస్తున్నారు. సూరి దర్శకుడు. సూరజ్‌ ఫిలింస్‌ అనువదిస్తోంది. శ్రీమతి పార్వతమ్మరాజ్‌కుమార్‌ సమర్పకురాలిగా ఉన్నారు. ఈ చిత్రం పాటల విడుదల కార్యక్రమం ఇటీవల హైదరాబాద్‌లో జరిగింది. ప్రఖ్యాత నటులు డాక్టర్‌ అక్కినేని నాగేశ్వరరావు, యువనటుడు అల్లు అర్జున్‌, ఇంకా సీనియర్‌ నటులు కైకాల సత్యనారాయణ, కోట శ్రీనివాసరావు, నిర్మాతలు కె.యస్‌.రామారావు, సి.కల్యాణ్‌, వీరశంకర్‌తో పాటుగా చిత్ర కథానాయకుడు పునీత్‌ రాజ్‌కుమార్‌ హాజర య్యారు. అల్లు అర్జున్‌ ఆడియో సిడిని విడుదల చేసి అక్కినేనికి తొలి సిడిని అందజేశారు.
అక్కినేని నాగేశ్వరరావు మాట్లాడుతూ 'రాజ్‌కుమార్‌ గారి కుటుంబంతో మా కుటుంబానికి సన్నిహిత సంబంధాలున్నాయి. ఆయన ఎంతమంచి నటుడో అంతటి మంచి వ్యక్తి. అలాంటివారు అరుదుగా ఉంటారు. ఆయన లక్షణాలు వారి ముగ్గురు కొడుకుల్లో ఉన్నాయి. రాజ్‌కుమార్‌ గారి అబ్బాయి నటించిన చిత్రం కాబట్టి ఈ వేడుకకు హాజరయ్యాను' అన్నారు.
'తెలుగు ప్రేక్షకులు ఎవరిని అయినా సరే ఆదరిస్తారు. పునీత్‌ను తెలుగు పరిశ్రమ తరపున సాదరంగా ఆహ్వానిస్తున్నాను' అన్నారు అల్లు అర్జున్‌.
పునీత్‌రాజ్‌కుమార్‌ మాట్లాడుతూ 'జాకీ చిత్రం కన్నడంలో మంచి విజయం సాధించింది. ఆంధ్ర ప్రజలు నా కుటుంబసభ్యుల్లాంటివారు. నేను తెలుగు సినిమాలో నటించాలని అనుకుంటున్నాను' అన్నారు.