10, ఫిబ్రవరి 2011, గురువారం

మే 18న ఐసెట్ 14న నోటిఫికేషన్...

రాష్టవ్య్రాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి మే 18న ఐసెట్‌ను నిర్వహించనున్నారు. ఈ మేరకు బుధవారం విశాఖపట్నంలోని ఆంధ్రయూనివర్సిటీ క్యాంపస్‌లో జరిగిన ఐసెట్ కమిటీ సమావేశంలో నిర్ణయించారు. సమావేశం వివరాలను ఐసెట్ కన్వీనర్ జి.ఎస్.ఎన్.రాజు ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. ఈ నెల 14న ఐసెట్-2011 నోటిఫికేషన్ పత్రికల్లో ప్రచురితం కానుంది. ఫిబ్రవరి 22 నుంచి దరఖాస్తు ఫారాలు విక్రయిస్తారు. వాటిని మార్చి 24 వరకు సమర్పించవచ్చు. ఆఫ్‌లైన్‌తోపాటు ఆన్‌లైన్‌లోనూ దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.250గా నిర్ణయించారు. రూ. 500 అపరాధ రుసుముతో ఏప్రిల్ 8 వరకు, రూ.2,000 అపరాధ రుసుంతో ఏప్రిల్ 13 వరకు అందజేయవచ్చు.

నిబంధనల మేరకు ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి విద్యార్థులు డిగ్రీలో కనీసం 50 శాతం మార్కులు కలిగి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 శాతం సడలింపు ఇస్తారు. దరఖాస్తులు ఈ-సేవా సెంటర్లలో, ప్రధాన తపాలా కార్యాలయాల్లో, విశ్వవిద్యాలయాల్లో ఉన్న తపాలా కార్యాలయాలు, ఆంధ్రాబ్యాంక్ ప్రధాన శాఖల్లో లభిస్తాయి. మరిన్ని వివరాలకు www.icet2011.net, www.andhrauniversity. info, www.apsche.org వెబ్‌సైట్‌లలో సందర్శించవచ్చు.