10, ఫిబ్రవరి 2011, గురువారం

జగన్‌కు అన్ని విధాలా మద్దతు...లక్ష్మీపార్వతీ

స్వేచ్ఛా వాయువుల కోసం ఈజిప్టు నైలునదీ తీరంలో ప్రజలు పోరాటాలు చేస్తుంటే ఇక్కడ సాగు, తాగు నీటి కోసం పోలవరం కట్టాలని గోదావరి తీరానా ప్రజలు పోరాడుతున్నారని ఎన్టీఆర్‌ సతీమణి లక్ష్మీపార్వతి వ్యాఖ్యానించారు. గురువారం జగన్‌ హరితయాత్ర ముగింపు సభలో మాట్లాడుతూ ప్రజల అవసరాలు ప్రభుత్వాలు గుర్తెరిగి పోలవరం ప్రాజెక్టును బహుళార్థక సాధక ప్రాజెక్టుగా గుర్తించాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ రాజకీయ కోణంలోనే ఆలోచిస్తూ నేటికీ జాతీయ హోదా కల్పించకపోవడంవల్లే ప్రజలు పోరాటానికి దిగాల్సి వచ్చిందని ఇందుకు గత నాలుగు రోజులుగా లక్షలాదిగా జగన్‌ వెంట జనం నడుస్తున్న విషయాన్ని గుర్తెరగాలని ఆమె అన్నారు.

తెలుగువారి ఆత్మ గౌరవివాన్ని ఢిల్లి వీధుల్లో కాంగ్రెస్‌ అధినాయకత్వాల దగ్గర తాకట్టుపెట్టడం ఇష్టంలేని జగన్‌ ఆ పార్టీపైన పోరాటానికి సిద్ధపడ్డారని ప్రజా సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆయన చేస్తున్న ప్రయత్నాలకు అండగా నిలవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని మన ఆత్మ గౌరవాన్ని నిలబెడుతున్న జగన్‌కు తన సంపూర్ణ మద్దతు ఎప్పుడూ ఉంటుందని అన్నారు.