1, జనవరి 2012, ఆదివారం

.ప్రమాదపుటంచున పథకాలు... 2011లో ఎత్తిపోతల పథకాలు

ఎగువ ప్రాంతాల మెట్టభూములను సస్యశ్యామలం చేయాలన్న దృఢసంకల్పంతో దాదాపు మూడు దశాబ్దాల క్రితం రాష్ట్రంలో ప్రారంభించబడిన ఎత్తిపోతల పథకాలు నేడు ప్రమాదపుటంచుకు చేరుకున్నాయి. ప్రతిఏటా పెరుగుతున్న వ్యయం, మోయలేని నిర్వహణ భారం, పెట్టుబడికి తగిన విధంగా దక్కని ప్రతిఫలం లాంటి అనేక కారణాలు ఈ పథకాల మనుగడకు ప్రశ్నార్థకమవుతున్నాయి. పదేళ్ళ క్రితం అమర్చిన మోటార్లు సామర్థ్యం తగ్గిపోవడం, విద్యుచ్ఛక్తి ఎక్కువగా అవసరమవుతుండడం, ప్రతిఏటా రెండు మూడుసార్లు సాంకేతిక సమస్యలు తలెత్తడం వల్ల భారీ వ్యయం ప్రభుత్వ ఖజానాకు గండికొడుతోంది. సాగునీటి పారుదల శాఖ ఇంజినీరింగ్‌ అధికారుల అంచనాల ప్రకారం గత ఏడాది నాటికే లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టుల నిర్వహణకు ఏటా10 వేల కోట్ల రూపాయలకు పైగానే ఖర్చు చేయాల్సివస్తోంది. ఈ నిధులను మళ్ళించి మరో అభివృద్ధి పథకానికి వెచ్చిస్తే రాష్ట్ర రైతాంగానికి ఇంతకన్నా రెట్టింపు ప్రతిఫలం అందించవచ్చునని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వాస్తవ పరిస్థితులు కూడా ఈ వాదనకే బలం చేకూరుస్తున్నాయి. చెప్పుకోదగిన జలవనరులు లేని కారణంగానే వెనుకబడిన తెలంగాణ ప్రాంతానికి భవిష్యత్తులోనూ వెనుకబాటు తప్పని పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ ప్రాంత ఆయకట్టుకు ఎత్తిపోతల పథకాలే ప్రధానం. అయితే వీటి ద్వారా రైతాంగానికి అందే ప్రయోజనం కన్నా వెచ్చిస్తున్న ఖర్చే అధికమవుతోందన్న వాదన నానాటికీ బలపడుతోంది. ప్రభుత్వంపై ప్రతిఏటా ఎత్తిపోతల పథకాల నిర్వహణ భారం పెరిగిపోతోంది. నీటి పారుదల, ఆయకట్టు అభివృద్ధి శాఖకు బడ్జెట్‌లో కేటాయించిన నిధుల్లో ఎక్కువభాగం ఈ పథకాల నిర్వహణకే ఖర్చవుతోంది. కోస్తాంధ్ర ప్రాంతంలో భారీ నీటి ప్రాజెక్టులు అధికంగా ఉన్నాయి. వీటి నిర్వహణ ఖర్చు పెద్దగా ఉండదు. ప్రభుత్వ అంచనా ప్రకారం కేవలం ఎత్తిపోతల పథకాల నిర్వహణకు ప్రతిఏటా సుమారు పది వేల కోట్ల రూపాయాలు వెచ్చించాల్సి వస్తోంది.
రాష్ట్రంలో ఇప్పటికే ప్రారంభమైన ఎత్తిపోతల పథకాలు 22 కాగా, కొత్తగా ప్రతిపాదించినవి కలుపుకొని మొత్తం 26 పథకాలు నెలకొల్పబడుతున్నాయి. వీటిలో దాదాపు 16 పథకాలు ఒక్క తెలంగాణా ప్రాంతంలోనే ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి మోయలేని భారంగా మారిన ఎత్తిపోతల పథకాల నిర్వహణ ఖర్చు సమీప భవిష్యత్తులో ప్రశ్నార్థకంగా మారనుంది. గత ఏడాది తీవ్ర ప్రభావం చూపిన ఆర్థిక మాంధ్యం నేపథ్యంలో నానాటికీ పెరుగుతున్న ఖర్చు ఆందోళన కలిగిస్తోంది. కెపాసిటీ తగ్గుతున్న విద్యుత్‌ మోటార్లకు మరమ్మతు చేయడం, నీటిని తోడి పంట పొలాలకు అందించడం, ఇతర కార్యక్రమాలకు ప్రస్తుత అంచనాల ప్రకారం అవసరమయ్యే నిధులు దాదాపుగా 5 వేల కోట్ల రూపాయలు. జలాశయం నుంచి సుమారు 500 మీటర్ల ఎత్తున ఎగువ ప్రాంతాలకు నీటిని తరలించేందుకు లిఫ్టులకు అమర్చిన భారీ కెపాసిటీ గల మోటార్లకు అవసరమయ్యే విద్యుత్‌ ఖర్చు మరో 5 వేల కోట్ల రూపాయలు. మొత్తం కలుపుకుని ఎత్తిపోతల పథకాల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి ప్రతిఏటా దాదాపు 10 వేల కోట్లకు పైగానే నిధులు ఖాళీ అవుతున్నాయి. అందుకోసం ప్రత్యేకంగా అవసరమవుతున్న మానవవనరులు, కార్యాలయాల నిర్వహణ, ప్రయాణపు ఖర్చులు కలుపుకుని మరో రెండున్నర వేల కోట్ల రూపాయలు వెచ్చించక తప్పడంలేదు. ఇంత పెద్ద మొత్తంలోప్రజాధనం ఖర్చు చేస్తున్నప్పటికీ, అందుకు తగిన ప్రతిఫలం మాత్రం అన్నదాతకు దక్కడంలేదు. భవిష్యత్తులో అధికారంలోకి రానున్న ప్రభుత్వాలకు సైతం ఈ వ్యయం గుదిబండగా మారనుంది. అధికారుల అంచనా ప్రకారం ఒక్కో ఎత్తిపోతల పథకం కింద 5 నుంచి 10 వేల ఎకరాలకుపైగా పంటలు సాగైతే, అప్పుడప్పుడు తలెత్తే సాంకేతిక లోపాలు రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో ఈ నష్టం అన్నదాతలకు ప్రాణసంకటంగా కూడా మారుతున్నది. ఈ లిఫ్లుల నిర్వహణలో అధికభాగం మెకానికల్‌ వ్యవస్థే ఉంటుంది. ఏటేటా కెపాసిటీ తగ్గుతున్నందున ఖరీదైన మోటార్లు కాలిపోతే గనుక వేలాది ఎకారాల్లో పంటలు ఎండిపోకతప్పదు. దీంతో రైతుల్లో ఆందోళన, ప్రభుత్వంపై ఒత్తిడి తదితర సమస్యలు ఉత్పన్నమవుతుండడం సర్వసాధారణమే. ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని గతంలో ఎత్తిపోతల పద్ధతిని గ్రామ పంచాయతీలు, మునిసిపాలిటీల్లో తాగునీటి వనరులు సమకూర్చేందుకు మాత్రమే ఏర్పాటు చేసేవారు. ఒకేసారి పెట్టుబడితో తరతరాలుగా ప్రయోజనం చేకూర్చే భారీ నీటి ప్రాజెక్టులు తెలంగాణలో లేకపోవడం దురదృష్టకరమే. అయినప్పటికీ ఈ ప్రాంతంలో సాహసంతో నెలకొల్పుతున్న ఎత్తిపోతల పథకాలు మాత్రం భావితరాలకు ముప్పును సూచిస్తున్నాయి. హరితాంధ్ర సాధన దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించి అమలు చేస్తున్న జలయజ్ఞం కార్యక్రమంలో తలపెట్టిన ఎత్తిపోతల పథకాలు ఖజానాకు భారంగా మారుతున్నాయి. రాష్ట్రంలో ఆయకట్టు విస్తీర్ణాన్ని గణనీయంగా పెంచి వ్యవసాయ రంగానికి బంగారుబాట వేయాలన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి లక్ష్యం, ఆలోచనా విధానం సరైనదే అయినప్పటికీ గత పరిణామాల దృష్ట్యా ఈ పథకాలకు భవిష్యత్తు కనిపించడం లేదు. అనంతరం అధికార బాధ్యతలు చేపట్టిన ప్రభుత్వాలు ఈ రంగానికి ఇదివరకిచ్చిన ప్రాధాన్యత ఇవ్వలేకపోతున్నాయి. గడిచిన రెండు దశాబ్దాల కాలంగా చూస్తే ఇప్పటివరకు అనేక ఎత్తిపోతల పథకాలు మూతపడ్డాయి. నీటి పారుదల శాఖ ఇంజనీర్ల అంచనా ప్రకారం ప్రస్తుతం కొనసాగుతున్న పథకాల ఆయకట్టు విస్తీర్ణానికి ఎకరం ఒక్కింటికి సరాసరిగా 12 వేల నుంచి 15 వేల రూపాయల నిర్వహణ ఖర్చు అవసరమవుతున్నది. ఈ పెట్టుబడుల మేరకు రైతాంగానికి ఫలితం దక్కడంలేదు. గత ఐదేళ్ళ నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో కొనసాగుతున్న 60 సాగునీటి పారుదల ప్రాజెక్టుల్లో 22 ఎత్తిపోతల పథకాలే ఉన్నాయి. ఈ పథకాల కింద ఆయకట్టు విస్తీర్ణం 40,83,535 ఎకరాలుగా అధికారులు గుర్తించారు. నీటి వనరులు అంతగాలేని తెలంగాణ ప్రాంతంలో 14 ఎత్తిపోతల పథకాల క్రింద 26,80,535 ఎకరాల ఆయకట్టు, రాయలసీమలో 5 పథకాల కింద 9,75,000 ఎకరాలు, ఆంధ్రా ప్రాంతంలో 3 పథకాల కింద 4,28,000 ఎకరాల ఆయకట్టు ఉన్నది. కనిష్టంగా ఎకరాకు ప్రభుత్వం ఖర్చు చేస్తున్న మొత్తం 12,000 రూపాయలుగా లెక్కకడితే ప్రతిఏటా 4,900 కోట్ల 24 లక్షల 20 వేల రూపాయల ఆర్థిక భారాన్ని ప్రభుత్వం భరించాల్సి వస్తుంది. ఈ మొత్తాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీ మేరకు తమ పార్టీ ప్రతిష్ట కోసమైనా ఖర్చు చేయక తప్పదు. కానీ ఒకవేళ ప్రభుత్వం మారితే గనుక ఇంతటి భారాన్ని మోయలేని పరిస్థితుల్లో పథకాలన్నీ మూసివేసే అవకాశాలున్నాయని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అదే జరిగితే కనుక తెలంగాణ రైతాంగం తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది.
గతంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన 86 మధ్యతరహా చిన్ననీటి వనరుల్లో దాదాపు అన్ని ఎత్తిపోతల పథకాలే ఉన్నాయి. అందులో తెలంగాణ ప్రాంతంలో ఉన్న సుమారు 33 పథకాల్లో సగానికిపైగా నిర్వహణ లోపంతోనే మూతపడ్డాయి. తద్వారా తొమ్మిది జిల్లాల్లో దాదాపు నాలుగు లక్షల పైచిలుకు ఎకరాల్లో రైతులు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కోక తప్పలేదు. ఈ నేపథ్యంలో పెద్దఎత్తున ప్రజాధనం కూడా వృధా అయ్యింది. అంతకు ముందే మూతపడిన చిన్నాచితకా లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టులు అనేకంగా ఉన్నాయి. జలయజ్ఞంలో లక్ష్యంగా పెట్టుకున్న ఆయకట్టు విస్తీర్ణం సగానికిపైగా ఎత్తిపోతల పథకాల కిందే ఉన్నది. సాగు విస్తీర్ణాన్ని కోటి ఎకరాలకు పెంచేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలు సమీప భవిష్యత్తులో ప్రశ్నార్థకమయ్యే సూచనలున్నాయి.
తెలంగాణ ప్రాంతంలోని 26 ప్రాజెక్టుల్లో 14 లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పథకాలు ఉన్నాయి. అందులో చొక్కారావు లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు మొదటి దశలో వరంగల్‌, కరీంనగర్‌, మెదక్‌, నల్గొండ జిల్లాల్లో 1,23,000 ఎకరాల ఆయకట్టు, రెండవ దశలో 5,25,100 ఎకరాల ఆయకట్టు విస్తీర్ణాన్ని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అదే విధంగా నిజామాబాద్‌ జిల్లాలో అలీసాగర్‌ ఎత్తిపోతల పథకం కింద 53,973 ఎకరాలు, గుత్పా ఎత్తిపోతల పథకం కింద 38,729 ఎకరాలు, నల్గొండ జిల్లాలో శ్రీశైలం లెఫ్ట్‌ బ్యాంక్‌ కెనాల్‌పై నిర్మించిన ఎనిమినేటి మాధవరెడ్డి ఎత్తిపోతల పథకం కింద 2,70,000 ఎకరాల విస్తీర్ణం ఉన్నది. మహబూబ్‌నగర్‌ జిల్లాలో రాజీవ్‌(బీమా) ఎత్తిపోతల పథకం కింద 2,03,000 ఎకరాలు, మహాత్మాగాంధీ (కల్వకుర్తి) ఎత్తిపోతల పథకం కింద 3,40,000 ఎకరాలు, జవహర్‌ (నెట్టెంపాడు) ఎత్తిపోతల పథకం కింద 2 లక్షల ఎకరాలు, కరీంనగర్‌ జిల్లాలో శ్రీపాదరావు ఎత్తిపోతల పథకం కింద 4,63,600 ఎకరాలు, ఖమ్మం జిల్లాలో దుమ్ముగూడెం ఎత్తిపోతల పథకం మొదటి దశలో 2 లక్షల ఎకరాలు, ఇదే పథకం రెండవ దశలో మరో రెండు లక్షల ఎకరాల ఆయకట్టు విస్తీర్ణం సాగులోకి వచ్చింది. ఆదిలాబాద్‌ జిల్లా పెద్దవాగుపై నిర్మించిన జగన్నాథపురం ఎత్తిపోతల పథకం కింద 15,000 ఎకరాలు, మహబూబ్‌నగర్‌ జిల్లాలో కోయిలసాగర్‌ ఎత్తిపోతల పథకం కింద 38,250 ఎకరాలు, ఖమ్మం జిల్లాలో కిన్నెరసాని లిఫ్ట్‌ ఇరిగేషన్‌ కింద 10 వేల ఎకరాల ఆయకట్టు విస్తీర్ణం సాగులో ఉన్నది.
రాయలసీమ ప్రాంతంలోని 11 సాగునీటి పారుదల ప్రాజెక్టుల్లో మూడు ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. అందులో కర్నూలు జిల్లా గురు రాఘవేంద్ర లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీమ్‌ కింద 50,000 ఎకరాల విస్తీర్ణంలో ఆయకట్టు సాగవుతున్నది. కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల రైతాంగానికి సంబంధించి నిర్మించిన గాలేరు-నగరి సుజల స్రవంతి ఎత్తిపోతల పథకం కింద 2,60,000 ఎకరాలు, అనంతపురం జిల్లాలో పెన్నా అహోబిలం బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ స్టేజ్‌-2 పథకం కింది 50,000 ఎకరాలు, అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాలకు సంబంధించి హంద్రీనీవా సుజల స్రవంతి ఎత్తిపోతల పథకం కింద 6,50,000 ఎకరాలు, కడప జిల్లా గండికోట ఎత్తిపోతల పథకం కింద 10 వేల ఎకరాల ఆయకట్టు విస్తీర్ణం సాగులో ఉన్నది. ఈ ప్రాంతంలో మొత్తం 11 ప్రాజెక్టుల కింద 16,54,000 హెక్టార్ల విస్తీర్ణం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ఆంధ్రా ప్రాంతంలోని 23 నీటి పారుదల ప్రాజెక్టుల కింద మొత్తం 39,55,719 ఎకరాల ఆయకట్టు విస్తీర్ణం కాగా అందులో 4,28,000 హెక్టార్లు ఎత్తిపోతల పథకాల కింద సాగవుతోంది. తూర్పుగోదావరి జిల్లాలోని పుష్కర ఎత్తిపోతల కింద 1,86,000 ఎకరాలు, వెంకటనగరం ఎత్తిపోతల పథకం కింద 36,000 ఎకరాలు, పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడిపూడి ఎత్తిపోతల పథకం కింద 2,06,000 ఎకరాల ఆయకట్టు విస్తీర్ణం సాగవుతోంది.
ఇప్పటికే పూర్తయిన మధ్య తరహా చిన్ననీటి పారుదల ప్రాజెక్టుల్లో ఆంధ్రా రీజియన్‌లో ఉన్న 32 పథకాల కీంద 4,68,816 ఎకరాల ఆయకట్టు విస్తీర్ణం సాగవుతోంది. రాయలసీమ రీజియన్‌లోని నాలుగు జిల్లాల్లో ఉన్న 53 పథకాల కింద 1,75,184 ఎకరాలు, తెలంగాణా రీజియన్‌లోని తొమ్మిది జిల్లాల్లో ఉన్న 86 చిన్ననీటి ప్రాజెక్టుల కింద 4,68,816 ఎకరాలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మధ్య తరహా చిన్ననీటి ప్రాజెక్టుల ఆయకట్టు 1,01,60,188 ఎకరాల విస్తీర్ణం సాగవుతున్నట్లు నీటి పారుదల శాఖ అధికారిక లెక్కలు చెబుతున్నాయి. కానీ, ఈ ప్రాజెక్టుల్లో అధికంగా ఉన్న ఎత్తిపోతల పథకాలు సుదీర్ఘకాలం కొనసాగే అవకాశాలు తక్కువగా ఉన్నాయని వ్యవసాయరంగ నిపుణులు భావిస్తున్నారు. ఎకరా ఒక్కంటికి ప్రతీ సంవత్సరం 15 వేల రూపాయలు పెట్టుబడి అవసరమయ్యే ఎత్తిపోతల పథకాల ద్వారా రైతులు పొందుతున్న ప్రయోజనం చాలా తక్కువగా ఉండడంతో సమీప భవిష్యత్తులో వీటిని ఎత్తివేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.