1, జనవరి 2012, ఆదివారం

హిట్లు-పట్లు

భారత క్రికెట్‌ చరిత్రలో 2011 సంవత్సరానికి విశిష్ట ప్రాముఖ్యత ఏర్పడింది. ఈ ఏడాది భారత క్రికెట్‌ జట్టు ఎన్నో మరుపురాని విజయాలను సొంతం చేసుకుంది. వీటిలో ఒకటి వన్డే ప్రపంచకప్‌ విజయం. అంతేగాక, వెస్టిండీస్‌, న్యూజిలాండ్‌, సౌతాఫ్రికాలతో జరిగిన టెస్టు సిరీస్‌లలో జయకేతనం ఎగుర వేసింది. దీంతోపాటు వన్డే క్రికెట్‌ చరిత్రలో వీరేంద్ర సెహ్వాగ్‌ చిరస్మరణీయ డబుల్‌ సెంచరీ సాధించి అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఇన్ని తీపి జ్ఞాపకాల మధ్య కొన్ని మరచిపోలేని చేదు గుళికలు కూడా క్రికెట్‌ జట్టు అందించింది. ఇంగ్లండ్‌ పర్యటనలో టెస్టులు, వన్డేల్లో క్లీన్‌స్వీప్‌ కావడం టీమిండియా ప్రతిష్టను దిగజార్చింది. మరోవైపు మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌కు చారిత్రక వందో సెంచరీ అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. ఈ ఏడాది విదేశి గడ్డపై భారత్‌ వరుసగా ఐదు టెస్టుల్లో ఓటమి పాలైంది. దశాబ్దకాలంగా ఎన్నడూ కూడా భారత్‌ ఇటువంటి చెత్త రికార్డును మూటగట్టుకోలేదు. కాగా, అశ్విన్‌, ఉమేశ్‌ యాదవ్‌, వరుణ్‌ అరోన్‌లో రూపంలో భారత్‌కు కొత్త అస్త్రాలు దొరికాయి. కానీ, ఓపెనర్లు గౌతం గంభీర్‌, సెహ్వాగ్‌, హైదరాబాదీ వివిఎస్‌.లక్ష్మణ్‌, కెప్టెన్‌ ధోనీ, సురేశ్‌ రైనాల వైఫల్యం టీమిండియాను వెంటాడింది. అంతేగాక సీనియర్‌ బౌలర్లు జహీర్‌ ఖాన్‌, ఇషాంత్‌ శర్మ, ప్రవీణ్‌ కుమార్‌, నెహ్రా, హర్భజన్‌ సింగ్‌ తదితరులు గాయాల వల్ల చాలా రోజుల పాటు జట్టుకు దూరంగా ఉన్నారు. అంతేగాక స్టార్‌ ఆటగాడు యువరాజ్‌ కూడా జట్టుకు అందుబాటులో లేకుండా పోయాడు.
జగజ్జేత భారత్‌..
శతకోటి అభిమానుల కలలను సాకారం చేస్తూ టీమిండియా ఉపఖండం గడ్డపై జరిగిన వన్డే ప్రపంచకప్‌పను గెలుచుకొంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఏప్రిల్‌ మూడున జరిగిన చారిత్రక ఫైనల్లో ధోనీ సేన చిరకాల ప్రత్యర్థి శ్రీలంకను ఓడించి తన ఖాతాలో రెండో ప్రపంచకప్‌ను జమ చేసుకుంది. ఎప్పుడో 1983లో కపిల్‌దేవ్‌ నేతృత్వంలోని భారత జట్టు తొలి వరల్డ్‌కప్‌ గెలుచుకోగా, దాదాపు 27 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియా మళ్లిd జగజ్జేతగా నిలిచింది. భారత క్రికెట్‌ చరిత్రలోనే ఇది మరుపురాని ఘట్టంగా చిరకాలం గుర్తుండి పోతుంది. ప్రతికూల వాతావరణంలోనూ కెప్టెన్‌ ధోనీ, గౌతం గంభీర్‌ చిరస్మరణీయ బ్యాటింగ్‌తో జట్టును విశ్వవిజేతగా నిలిపారు. ప్రతిష్టాత్మకమైన ప్రపంచకప్‌లో భారత్‌ అద్భుత ఆటతో కప్పును సొంతం చేసుకుంది. యువరాజ్‌ ఆల్‌రౌండ్‌ ప్రతిభకు, జహీర్‌ పదునైన బౌలింగ్‌ తోడు కావడంతో టీమిండియా ప్రపంచకప్‌ను ఎగురేసుకు పోయింది.
మాస్టర్‌ అ 15000
రికార్డుల రారాజు మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ ఈ ఏడాది తన పేరిట మరో అరుదైన రికార్డును లిఖించుకున్నాడు. వెస్టిండీస్‌తో ఢిల్లిdలోని ఫిరోజ్‌షా కోట్లా మైదానంలో జరిగిన తొలి టెస్టు సందర్భంగా సచిన్‌ టెస్టు క్రికెట్‌లో 15వేల పరుగుల మైలురాయిని అందు కున్నాడు. క్రికెట్‌ చరిత్రలోనే ఒక ఆటగాడు టెస్టుల్లో 15వేల పరుగుల మార్క్‌ను చేరుకోవడం ఇదే ప్రథమం. టెస్టుల్లో 15వేల పరుగులు చేసిన సచిన్‌ వన్డేల్లో 18వేలకు పైగా పరుగులు సాధించి తన పేరిట ఎన్నటికి చెదిరిపోని రికార్డులను నమోదు చేశాడు.
అందని ద్రాక్షే...
అంతర్జాతీయ క్రికెట్‌లో రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్న సచిన్‌కు శతకాల సెంచరీ మాత్రం అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. ఇంగ్లండ్‌తో జరిగిన ప్రపంచకప్‌ మ్యాచ్‌లో సెంచరీ తర్వాత సచిన్‌ మళ్లిd మూడంకెల స్కోరుకు చేరుకోలేక పోయాడు. వెస్టిండీస్‌, ఇంగ్లండ్‌లతో జరిగిన టెస్టు సిరీస్‌లలో సచిన్‌ ఈ రికార్డును అందుకోలేక పోయాడు. రెండు మూడు సార్లు శతకానికి చేరువగా వచ్చినా ఒత్తిడికి తట్టుకోలేక పెవిలియన్‌ చేరాడు.
సెహ్వాగ్‌ గ్రాండ్‌ డబుల్‌
ఇక, భారత క్రికెట్‌ చరిత్రలోనే మరో అరుదైన రికార్డును డాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ నెలకొల్పాడు. వెస్టిండీస్‌తో డిసెంబర్‌ 8న ఇండోర్‌లోని హోల్కార్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో సెహ్వాగ్‌ 149 బంతుల్లోనే 219 పరుగులు సాధించి వన్డే క్రికెట్‌ చరిత్రలో డబుల్‌ సెంచరీ సాధించిన రెండో క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో మాస్టర్‌ బ్లాస్టర్‌ పేరిట ఉన్న 200 నాటౌట్‌ రికార్డును అధిగమించాడు. కరేబియన్‌ బౌలర్లను హడలెత్తించిన సెహ్వాగ్‌ 149 బంతుల్లో 25 ఫోర్లు, 7భారీ సిక్సర్లతో 219 పరుగులు సాధించి వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన క్రికెటర్‌గా నిలిచాడు. వన్డేల్లో ఇప్పటివరకు నమోదైన రెండు వన్డే సెంచరీలు కూడా భారత ఆటగాళ్లే నమోదు చేయడం మరో విశేషం. మరోవైపు ఈ మ్యాచ్‌లో టీమిండియా మరో అరుదైన రికార్డును నెలకొల్పింది. వన్డే క్రికెట్‌లో అత్యధిక సార్లు 400పైగా స్కోర్లు నమోదు చేసిన జట్టుగా భారత్‌ నిలిచింది. భారత్‌ నాలుగు సార్లు 400పైగా స్కోర్లు నమోదు చేసింది.
ఇంగ్లండ్‌ సిరీస్‌ ఓ పీడకల....
ఇదిలావుండగా, భారత క్రికెట్‌ చరిత్రలో ఎన్నో తీపి జ్ఞాపకాలు మిగిల్చిన 2011 సంవత్సరం అంతే చేదు అనుభవాలను కూడా మిగిల్చింది. దశాబ్దకాలంలో ఎన్నడూ లేని విధంగా టీమిండియా ఈసారి ఘోర పరాజయాన్ని చవిచూసింది. రెండు నెలలకు పైగా సాగిన ఇంగ్లండ్‌ పర్యటనలో టీమిండియా అత్యంత చెత్త ఆటతో అవమానకర ఓటమిని చవిచూసింది. ఆడిన నాలుగు టెస్టుల్లోనూ ఘోర పరాజయాలను మూటగట్టుకుంది. అంతేగాక, వన్డేల్లోనూ క్లీన్‌స్వీప్‌ అయ్యింది. దీంతోపాటు ఆడిన ఏకైక ట్వంటీ-20 మ్యాచ్‌లోనూ పరాజయం పాలైంది. భారత క్రికెట్‌లోనే ఇది చాలా చెత్త సిరీస్‌గా పరిగణించవచ్చు. సుదీర్ఘకాలంపాటు సాగిన ఇంగ్లండ్‌ సిరీస్‌లో భారత్‌ ఒక్క విజయం సాధించకుండానే ఇంటికి చేరింది.
కొసమెరుపు...
అయితే ఆ వెంటనే సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేయడం ద్వారా టీమిండియా తీయని ప్రతీకారం తీర్చుకుంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ ను భారత్‌ 5-0 తేడాతో గెలుచుకొని ఇంగ్లండ్‌ తీయని బదులిచ్చింది. ఈ గెలుపు భారత అభిమానులను కాస్త ఊరట కలిగించింది. తర్వాత వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు, వన్డే సిరీస్‌లను కూడా భారత్‌ కైవసం చేసుకుంది.
చేజేతులా...
మరోవైపు ఆస్ట్రేలియాతో జరిగిన బాక్సింగ్‌డే టెస్టులో ఘోర పరాజయం ద్వారా భారత్‌ మళ్లిd నిరాశ పరిచింది. ఆస్ట్రేలియాను ఓడించేందుకు వచ్చిన చారిత్రక అవకాశాన్ని టీమిండియా చేజేతులా జారవిడుచుకుంది. నిర్లక్ష్య బ్యాటింగ్‌, పసలేని బౌలింగ్‌తో ఆసీస్‌ చేతిలో ఓటమి పాలైంది. కీలక సమయంలో వైఫల్యం భారత్‌ విజయావకాశాలను దెబ్బతీసింది. గంభీర్‌, సెహ్వాగ్‌, సచిన్‌, లక్ష్మణ్‌, కోహ్లి, ద్రవిడ్‌, ధోనీ వంటి అగ్రశ్రేణి బ్యాట్స్‌మెన్‌ కలిగిన టీమిండియా 292 పరుగుల లక్ష్యాన్ని అందుకోవడంలో చతికిల పడింది. కనీస పోరాట పటిమను కూడా కనబరచకుండానే చేతులెత్తేసింది. దీంతో భారత క్రికెట్‌ జట్టు 2011 సంవత్సరాన్ని ఓటమితో ముగించింది.