1, జనవరి 2012, ఆదివారం

విమల యశస్వి

దరిసె ప్రత్యూష
దరహాస పారిజాత
చైతన్య చకచ్చకిత
సమతా మమతల పీయూష
ధర్మగతి, గృహస్థవిధి, భగవదార్చన, స్వదేశ సేవన విలువలు తెలిసి అమలు చేసి చూపుతున్న మహిత మంగళ.
విలక్షణ ప్రసూన మాల, వినిర్మల
ప్రవిమల శ్రీమతి విమల.
భారతీయ మహిళ’ అనే పదానికి అర్థంగా, అద్దంగా నిలిచే ఆదర్శ వనిత రాష్ట్ర ప్రథమ మహిళ, గవర్నర్‌ ఇఎస్‌ఎల్‌ నరసింహన్‌ సతీమణి శ్రీమతి విమల. మూర్తీభవించిన మానవత్వం, స్ఫూర్తీభవించిన భారతీయం ఆమె సొంతం. శిక్షణకు, క్రమశిక్షణకు, విలువల పరిరక్షణకు నిలువెత్తు నిదర్శనం ఆమె. ఈ రాష్ట్రానికి తొలి మహిళననే దర్పం, దర్జా ఆమెలో మచ్చుకైనా కానరావు.
వివిధ రకాల సడి, సందడితో నగరం అర్ధరాత్రి వరకూ హడావిడి పడి భానుడి ఉదయ కిరణాలు ప్రసరించినా నగరం నిద్రపోతున్న వేళ గవర్నర్‌ దంపతుల పూజాదికాలు పూర్తి అయిపోతాయి. నగరం బద్ధకంగా ఒళ్లు విరుచుకునే వేళకు గవర్నర్‌ దంపతులు వారి వారి పనుల్లో ఉత్సాహంగా బిజీ అయిపోతారు. అంతకంటే ఆశ్చర్యం కలిగించే విషయం తొలిపొద్దు పొడిచేవేళ ఉషస్సు కాంతులు పూర్తిగా ప్రసరించకముందే రాజ్‌భవన్‌ అధికార నివాసంలో ముత్యాల ముగ్గులు పెట్టే మహిళ సాక్షాత్తూ ఈ రాష్ట్ర తొలిమహిళే అంటే ఆశ్చర్యం అనిపించవచ్చు. ప్రతిరోజూ ఉదయం నాలుగు గంటలకే నిద్రలేచి దైనందిన కార్యక్రమాలు ప్రారంభిస్తారు గవర్నర్‌ దంపతులు. శ్రీమతి విమల నిత్యకార్యక్రమాల్లో స్వయంగా ముగ్గులు వేయడం, పూజాగదిని తానే అలంకరించడం ప్రధాన విధిగా భావిస్తారు. నిత్యం అధికార నివాసంలో పూజాది కార్యక్రమాలే కాక దంపతులు ఇద్దరూ రాజభవన్‌ వెనుక పంజాగుట్ట రోడ్డులో వున్న ఆంజనేయ స్వామి గుడికి వెళ్లి పూజలు నిర్వహిస్తారు. లిబర్టీ రోడ్డులోని తిరుమల, తిరుపతి దేవస్థానం ఆలయాన్నీ తరచు దర్శిస్తారు.
శ్లోకాల్ని ఆశువుగా చెప్పే శ్రీమతి విమల అధ్యాపకురాలిగా ఢిల్లీలో పనిచేసేవారు. పాఠాలు చెప్పడంలో కూడా మంచి లెక్చరర్‌గా పేరు తెచ్చుకున్న ఆమె ఎప్పుడైనా చిరాకుపడినా, ఆగ్రహించినా చూడాలనిపించేది అంటారట ఆమెతో పాటు పనిచేసిన సహ అధ్యాపకులు. ఆమెవద్ద పాఠాలు నేర్చుకున్న విద్యార్థులు. ప్రశాంత వదనం, చెదరని చిరునవ్వు ఆమెకు పెట్టని ఆభరణాలు. విమల అంటే నిర్మలమైనది అని అర్థం. ఆవిధంగా సార్ధక నామధేయురాలు అనిపించుకున్నారు ఆమె. భర్త గవర్నర్‌ కాకముందు పోలీసు శాఖలో అత్యున్నత అధికార బాధ్యతలు నిర్వహించడం వల్ల ఆమె లెక్చరర్‌ ఉద్యోగం మానేశారు. అయితే ఆయనతోపాటు ఎక్కడికి వెళ్లినా ఆయా చుట్టుపక్కల గ్రామాల పిల్లలకు పాఠాలు నేర్పడం వారిని ఈ సమాజంలో మంచి పౌరులుగా తీర్చిదిద్దాలని అభిలషించడం ఆమెకున్న సామాజిక బాధ్యతకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
ఆంధ్రప్రదేశ్‌కు గవర్నర్‌గా శ్రీ నరసింహన్‌ బాధ్యతలు స్వీకరించాక ఈ రాష్ట్రంలో స్థితిగతులు బాగుపడాలని రాష్ట్రం సర్వతోముఖంగా అభివృద్ధి చెందాలని అభిలషిస్తూ పూజలు చేశారు. రాజ్‌భవన్‌లో “సుధర్మ’ అనే కార్యాలయం ప్రారంభించడానికి సొంత గృహప్రవేశం జరిగితే ఎలా పూజలు నిర్వహిస్తారో ఆ విధంగా దంపతులు ఇద్దరూ పీటలపై కూర్చుని శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి ప్రసాదాల్ని సిబ్బంది అందరికీ పంచారు.
అయితే రాష్ట్రంలో గుళ్లు, గోపురాలు దర్శించడంపై కొందరు రాజకీయ నేతలు విమర్శించడంపై కించిత్‌ నొచ్చుకున్నా ధర్మభూమి, కర్మభూమి అయిన ఈ భారత భూమిలో మనుషులు నిమిత్తమాత్రులే భగవంతుడి అనుగ్రహమే ప్రధానం అనే విశ్వాసాన్ని కాదనలేం అంటారు. దసరా పండుగ నాడు పది రోజులు అత్యంత భక్తిశ్రద్ధలతో పూజలు చేసి పసుపు కుంకుమలు అధికార కుటుంబాలకు, సన్నిహితులకు పంచిపెట్టారు విమల. పూజలు చేసిన అక్షతలు తీసుకొని దంపతులు ఇద్దరూ స్వయంగా రాజ్‌భవన్‌ ప్రాంగణం అంతా చల్లి “లోకాస్సమస్తా సుఖినోభవంతు’ అని ప్రార్థించారు.
విమలా -నరసింహన్‌ దంపతులకు ఇద్దరు కుమారులు. ఇద్దరూ విదేశాల్లో (ఒకరు అమెరికా, ఒకరు ఆస్ట్రేలియా) వుంటున్నారు. ప్రస్తుతం ధనుర్మాసం సందర్భంగా ఇక్కడకు వచ్చారు. కొడుకులు, కోడళ్లు, అత్తమామలు, తల్లిదండ్రులు మాత్రమే కాక తాము ఈ రాష్ట్రానికి బాధ్యత వహిస్తుండడం వల్ల ఈ రాష్ట్ర ప్రజలంతా మాకుటుంబ సభ్యులే అన్న వసుధైక కుటుంబ భావన పలుసందర్భాల్లో వ్యక్తీకరించారు. అందుకే దీపావళి, హోలీ, న్యూ ఇయర్‌, రంజాన్‌ వంటి పండుగల్ని కలిసి చేసుకోవడం సిబ్బందిలో ఒకరిగా కలసిపోయి హోలీ ఆడటం. రాజ్‌భవన్‌లో దీపావళి సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి అందరికీ బాణసంచా పంచడం వంటి కార్యక్రమాల్లో విమల చురుగ్గా పాల్గొంటారు. ఈరోజుకీ అత్తమామలకు, అమ్మానాన్నలకు స్వయంగా సేవలందించడం అవసరమైతే వారికి స్వయంగా వండిపెట్టడం, వంట సిబ్బంది సెలవు పెడితే తనే వంట చేయడం శ్రీమతి విమలకు అలవాటు. పెరటిలో పెంచిన కూరగాయలతోనే వంట. వాటి పోషణ స్వయంగా పర్యవేక్షిస్తారు. ఉగాది సమయంలో రాలిపడే వేపపువ్వు సేకరించి ఎండబెట్టి ఆ వేపపువ్వుతో పులుసు చేస్తారు శ్రీమతి విమల. ఒకవైపు భక్తి మరోవైపు సంస్కృతి అంటే ఆమెకు ఎంతో మక్కువ. తల్లి స్వయంగా సంగీత విద్వాంసురాలు. తీరిక వేళల్లో ఆమెతో కలసి సంగీత సాధన చేస్తుంటారు. తెలుగు మాట్లాడడం బాగానే వచ్చినా ఆ తెలుగులోని మాధుర్యం చవిచూడాలనే పట్టుదలతో తెలుగుపై లోతైన అభ్యాసం చేస్తున్నారు.
ఆభరణాలు, ఖరీదైన చీరలపై ఆమెకు మోజు లేదు. చేనేత చీరల్లో సింపుల్‌గా కనిపించడానికే ఇష్టపడతారు. అధికార కార్యక్రమాల్లో ప్రోటోకాల్‌ని అనుసరించి పాల్గొనే ఆమె అధికార వ్యవహారాల్లో మచ్చుకైనా ఆమె జోక్యం కనిపించదు. తల్లిగా, సహధర్మ చారిణి, కోడలిగా కూతురుగా, అధ్యాపకురాలిగా, ఈ సమాజం పట్ల బాధ్యత గుర్తెరిగిన మహిళగా ఎలా ఉండాలి అనడానికి నిలువెత్తు నిదర్శనం శ్రీమతి విమలా నరసింహన్‌. ఈ రోజు ఆమె పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రప్రభ ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు అందజేస్తోంది!
ఆదర్శదంపతులు
మ్యారెజెస్‌ ఆర్‌ మేడిన్‌ హెవెన్‌’ అన్న మాటలు కొందరిని చూస్తే అక్షర సత్యాలనిపిస్తాయి. ఎక్కాడు శ్రీనివాసన్‌ లక్ష్మీ నరసింహన్‌ (ఇఎస్‌ఎల్‌ నరసింహన్‌)కు అన్నివిధాలా జోడు విమలానరసింహన్‌. సర్వావస్థల్లో చేదోడువాదోడుగా వుంటూ సహధర్మ చారిణి అనే పదాన్ని సార్థకం చేశారు. శ్రీ నరసింహన్‌ దేశంలోనే అత్యంత గౌరవంగల ఐపిఎస్‌ అధికారిగా పేరు తెచ్చుకోవడానికి ఆమె మద్దతు ఎంతైనా ఉందనేది నిర్వివాదాంశం. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇంటెలిజెన్స్‌ బ్యూరో డైరెక్టర్‌గా నరసింహన్‌ బాధ్యతలు నిర్వహించిన తర్వాత ఆయన ఛత్తీస్‌గఢ్‌ గవర్నర్‌గా నియమితులయ్యారు. సుమారు 3 సంవత్సరాల తర్వాత ఆయన ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌గా పదవీబాధ్యతలు స్వీకరించారు.
1968వ ఐపిఎస్‌ బ్యాచ్‌కి చెందిన నరసింహన్‌ 1946లో తమిళనాడులో జన్మించారు. చెన్నైలోని మద్రాస్‌ యూనివర్సిటీ నుండి ఫిజిక్స్‌లో పట్టా పొందిన ఆయన రాజకీయ శాస్త్రం, న్యాయశాస్త్రాలలో పోస్టుగ్రాడ్యుయేట్‌ డిగ్రీ కూడా చెన్నైలోనే పూర్తి చేశారు. దేశ రాజధానిలోని నేషనల్‌ డిఫెన్స్‌ కాలేజీలో చదువు పూర్తి చేసిన తర్వాత ఆయన ఇండియన్‌ పోలీస్‌ సర్వీస్‌లో చేరారు.
ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన అనేక సంచలన నిర్ణయాలను తీసుకున్నారు. అప్పటి వరకూ రాజ్‌భవన్‌ అంటే కేవలం కొందరు రాజకీయ నాయకులు, సీనియర్‌ అధికారులు మాత్రమే అడుగుపెట్టగలిగే ప్రదేశమనే భావనను తుడిపేస్తూ రాజ్‌భవన్‌ గేట్లు సామాన్య మానవునికి కూడా తెరుచుకుంటాయని రుజువు చేసిన ఘనత నరసింహన్‌ది. ఒకదశలో ఈ విషయంపై రాజకీయ వర్గాలలో కొంత అసంతృప్తి వచ్చినప్పటికీ తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకుండా సామాన్య మానవుడు కూడా రాజ్‌భవన్‌లోకి వచ్చి తన గోడు వినిపించుకోవచ్చునని రాష్ట్రం మొత్తానికి తెలియజేశారు నరసింహన్‌. అలాంటి సంచలన వ్యక్తికి సహధర్మ చారిణిగా, ఫస్ట్‌ లేడీ గవర్నర్‌గా తన బాధ్యతలు నిర్వహించడంలో, సామాజిక సేవా కార్యక్రమాల్లో, ఆధ్యాత్మ భావనలు పెంపొందించడంలో, సాంస్కృతిక పరిమళాలు వెదజల్లడంలో, మహిళల్లో చైతన్యానికి తనవంతు కృషి చేయడంలో శ్రీమతి విమలా నరసింహన్‌ తనదైన ప్రత్యేకత చాటుకొన్నారు.